బొక్కలు అరిగేలా ఒంట్లో బలం ఉన్నంత కాలం మూటలు మోస్తారు. వయసు ఉడికి ముసలి వాళ్ళయిన తర్వాత వీరి పరిస్థితి ఏంటి? వీళ్ళ ఓట్లతో గెలిచి గద్దెనెక్కి పాలిస్తున్న ప్రభుత్వానికి వీరి కష్టాలు పట్టవు? పనిచేసే చోట ఏదైనా జరగరానిది జరిగితే పట్టించుకునే దిక్కు లేదు? నడుములు విరిగినా, కాళ్ళూ, చేతులు గాయాలపాలైనా భారమంతా వీరిదే. ఇక వీరిపై ఆధారపడిన కుటుంబం పరిస్థితి ఏమిటి? వీరే హమాలీ కార్మికులు. నిత్యం వీరు అనుభవిస్తున్న కష్టాల గురించి ఈ వారం కొలువులో తెలుసుకుందాం...
పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఉండవు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీరు కూడా ఉండవు. అలసిపోయి కూర్చుందామంటే కనీసం షెడ్డు కూడా ఉండదు. ఐదు రూపాయల భోజన కేంద్రాలు పెట్టామంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. టీవీలో, పేపర్లో ఊదగొడుతున్నారు. కానీ ఇలాంటి దిన సరి కూలీలు పని చేసే చోట మాత్రం అలాంటి భోజన కేంద్రాలు లేవు. దాంతో టైంకి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి. ఇంటి నుండి క్యారేజీ తెచ్చుకుంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఎండాకాలం మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఉదయం ఎప్పుడో ఐదు గంటలకు ఇంటి నుండి బయలు దేరి క్యారేజీ తీసుకుని మండీకి వస్తే మధ్యానం తినే లోపు ఎండ వేడికి అది పాడైపోతుంది. తాగుదామంటే కనీసం చల్లటి మంచినీరు కూడా దొరకదు.
అధికారులు పట్టించుకోరు
కూలీరేట్లు పెంచాలంటే సేట్లను బతిమలాడుకోవాలి. ఎండా, వానా, చలి పట్టించుకోకుండా రోజంతా కష్టపడుతున్న వీరికి ఇఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు లేవు. మరీ ముఖ్యంగా వీరి పనికి ఓ టైమ్ టేబుల్ అంటూ ఉండదు. పట్టించుకోవలిస్న లేబర్ అధికారులు ఏసీ రూముల్లో చల్లగా కూర్చుంటారు. హైదరాబాద్ మహానగరంలో మరీ ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలో సైదాబాద్ మండీ, మక్తార్గంజ్, కిషన్గంజ్, ఉస్మాన్గంజ్, ఫీల్ఖానా, బేగంబజార్, భూలక్ష్మమ్మ గుడి ప్రాంతం, కొత్త ఉస్మాన్ గంజ్ మార్కెట్లు ఉన్నాయి. ఇవి రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్లు. ఇక్కడ పని చేసే హమీలీ కార్మికుల సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
బొక్కలు అరిగిగేలా...
ప్రజలకు కావాల్సిన ప్రతి నిత్యావసర వస్తువు ఈ మార్కెట్లలో లభిస్తాయి. ఆ వస్తువులను మోసే కూలీలే ఈ హమాలీలు. ఒక్కో మార్కెట్లో 150 నుంచి 250 మంది వరకు హమాలీ కార్మికులు పనిచేస్తుంటారు. అంటే సుమారు 1300 మంది కార్మికులు ఉన్నారన్నమాట. వీరెవరికీ కనీస సౌకర్యాలు లేవు. బస్తా దించినందుకు కొంత, కస్టమర్కు కాటా వేసి ఎక్కించినందుకు కూలి రూపంలో ఇస్తారు. ఎన్ని బస్తాలు మోస్తే అంత ఆదాయం. ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. బస్తాలు మోసి మోసి వారి బొక్కలు అరిగిపోయాయి. వీరి కుటుంబాలన్నీ వీరి ఆదాయంపైనే ఆధారపడి ఉన్నాయి. అలాంటి వారి సమస్యలు పరిష్కరించే వారు లేక వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేతినిండా పనిలేదు
యాదయ్య గత 20 సంవత్సరాల నుంచి హమాలీ వర్కర్గా పనిచేస్తున్నాడు. అతను పనిలోకి వచ్చిన కొత్తలో పని బాగా ఉండేదట. దాంతో చేతినిండా పని దొరికేది. ఇప్పుడు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కొనేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో యాదయ్య లాంటి వారికి పనిలేకుండా పోయింది. ఇతను పనిచేసే దుకాణంలో ఐదుగురు హమాలీ కూలీలు ఉంటారు. అందరికీ పని దొరకదు. పైగా వీరికి ఇచ్చే కూలీ కస్టమర్ల నుంచి తీసుకోవడమే. సేట్ నుంచి వీరికి ఎలాంటి ఆదాయం ఉండదు.
కూలీ పెంచరు
రాజు గతంలో సికింద్రాబాద్ మార్కెట్లో హమాలీగా పనిచేసేవాడు. అక్కడ రోజుకు 300 వందల వరకు వచ్చేది. అయితే రాను రాను అక్కడ పని బాగా పెరిగిపోయింది. బరువులు మోయలేకపోయేవాడు. అయినా నాలుగు డబ్బులు వస్తాయనే ఆశతో పని చేసేవాడు. కానీ పని పెరిగిపోవడంతో సేట్ని కూలి పెంచమని అడిగాడు.ఎంత బతిమిలాడినా కూలి పెంచలేదు. దాంతో ప్రస్తుతం సైదాబాద్ మండీలో హమాలీగా పనిచేస్తున్నాడు. చేతినిండా పని ఉన్నరోజు రూ. 500 వరకు వస్తాయి. లేదంటే రూ.100, 150తో సర్దుకోవాల్సిందే.
సమస్యలు పరిష్కరిస్తామనీ...
రాష్ట్రం ఏర్పడితే వీరి కష్టాలు పరిష్కారమవుతాయిని నమ్మించారు. కానీ30 ఏండ్ల నుంచి ఇదే పనిచేస్తున్న సుధీర్ జీవితంలోగానీ, అతని కుటుంబ జీవన విధానంలో గానీ ఎలాంటి మార్పు రాలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రెండో సారి కూడా అధికారంలోకి వచ్చింది. ఇతను పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ చదువు అతనికి అక్కరకు రాలేదు. దాంతో కుటుంబ పోషణకు హమాలీగా మారి బరువులు మోస్తున్నాడు. ''ఇన్నేండ్ల నుంచి బరువులు మోసి మోకాళ్లు అరిగిపోయాయి. నడుము నొప్పులు వస్తున్నాయి. ఉదయం పది గంటలకు మార్కెట్కి వస్తే రాత్రి పనిముగించుకుని వెళ్ళే సరికి 11 అవుతుంది. భార్యా పిల్లలతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు. గెలిస్తే లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. గెలిచి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మా గురించే మాట్లాడటం లేదు'' అంటూ సుధీర్ ఆవేదన చెందుతున్నాడు.
మహిళలు ఇబ్బంది పడుతున్నారు
''బంగారు తెలంగాణ అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అన్నీ కష్టాలే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి సరుకంతా ఇక్కడికే వచ్చేది. దాంతో మాకు చేసుకున్నంత పని దొరికేది. కడుపు నిండా తినేవాళ్ళం. పిల్లల్ని చదివించుకునేవాళ్ళం. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి సరుకు డైరెక్ట్గా ఆంధ్రాకే పోతుంది. ఇక్కడి వాళ్ళు కూడా కొంత మంది బ్రోకర్లు సరుకు మార్కెట్కి రాకముందే తీసుకెళ్ళిపోతున్నారు. దాంతో మాకు పని బాగా తగ్గిపోయింది. బస్తాలు మోసి మోసి బొక్కలు అరిగిపోతున్నాయి కాని, మా బాధలు మాత్రం తీరడం లేదు. ఇక్కడ పని చేస్తున్న కూలీలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సులభ్ కాంప్లెక్స్లకు వెళితే మూడు నుంచి ఆరు రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి మాకు పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలి'' అంటున్నాడు మరో హమాలీ కార్మికుడు సురేష్.
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
'' భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా మాకు కూడా లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మాలాంటి వారు పనులు చేసి ఇరవై సంవత్సరాల వరకు బరువులు మోయలేకపోతున్నారు. వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తే అలాంటి వారికి గుర్తింపు కార్డులు వస్తాయి. పని చేయలేనపుడు కనీసం పెన్షనైనా వస్తుంది. అలాగే ఇఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు దొరకుతాయి. అలాగే ప్రమాదంలో ఎవరైనా హమాలీలు చనిపోతే వెల్ఫేర్ బోర్డునుంచి వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించవచ్చు. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నా వెల్ఫేర్ బోర్డును మా లాంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తే బాగుంటుంది మరో హమాలీ కార్మికుడు డిమాండ్ చేస్తున్నాడు.
పనికోసం వలసొచ్చాం
''మా దుకాణంలో ఐదుగురు పనిచేస్తారు.పాతికేండ్ల నుంచి ఇదే పని చేస్తున్నా. నేను పాలకుర్తి నుండి నగరానికి వలస వచ్చాను. ఊర్లో వర్షాలు పడితేనే పని. తిండి గడవటం కూడా కష్టం. ఇక్కడైతే రోజూ చేతినిండా పని దొరుకుతుందని వచ్చాను. వచ్చిన కొత్తలో పని బాగానే ఉంది. కాని రాను రాను పని తగ్గిపోయింది. నా కుటుంబం మొత్తం నాకు వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంది. వయసు దాటి పోయింది. పని కూడా చేయలేకపోతున్నా. నాలాంటి వాళ్ళు ఓపిక ఉన్నంత కాలమే పని చేయగలం. పని చేయలేనపుడు ఇంటికి పోవాల్సిందే. మా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'' అంటూ 50 ఏండ్ల రశరధరామయ్య ఆవేదన చెందుతున్నాడు.
Authorization