గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం, గ్రామాలలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం కేటాయించిన నిధులు మహిళలకు ఎలా అందుతున్నాయో ఆడిటింగ్ చేస్తారు. ఆ నిధులతో మహిళలు స్వయం ఉపాధి కల్పించుకుంటారు. నిధులు వారికి అందకపోతే ఆ వివరాలు మండల సమాఖ్యకు, సెర్ఫ్కు వెంటనే చేరవేస్తారు. నగరంలో అయితే కాస్త ఇబ్బంది ఉండదు. అదే జిల్లాలో పని చేస్తున్న వారైతే ఈ పనులన్నీ చేయడం కోసం వీరు కుటుంబాలను, పిల్లల్ని వదిలి రోజుల తరబడి గ్రామాల్లోనే ఉంటారు. ఇన్ని రకాల పనులే కాకుండా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీరిలో ఉపయోగించారు. వారే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీలు). అయితే ఈ పథకం ముగిసి ఇప్పటికే నాలుగు నెలలు కావొస్తుంది. అయినా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఇవ్వాల్సిన వారి చేతికి అందలేదు. అసలు వస్తాయో లేదో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు.
వీరు సెర్ఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈ సంస్థ ప్రపంచ బ్యాంకు నిధులతో నడుస్తున్నది. ఈ సంస్థ పరిధిలో జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య ఎకౌంట్లని ఆడిట్ చేస్తున్న వారికి సహాయంగా 2006లో వీరిని నియమించారు. 3 నెలల నుండి సంవత్సరం వరకు రిటైర్డ్ బ్యాంకు మేనేజర్తో వీరికి శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణా కాలంలో కమ్యూనిటి ఆడిటర్స్ అని వీరికి పేరు పెట్టారు. ఆ తరువాత కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా పేరు మార్చారు.
నెలకు 15రోజులు మాత్రమే వీరికి ఈ పని ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏ కొత్త పథకం తీసుకు వచ్చినా వీరితోనే జనంలో ప్రచారం చేయిస్తుంది. వీరిని సెర్ప్ స్థాయి సీఆర్పీ అని కూడా అంటారు. సెర్ప్ యూనిట్ నుండే వేతనాలు, టీఏ, డీఏలు చెల్లిస్తారు. కానీ పని చేసే చోట ఎలాంటి కనీస వసతులు కల్పించరు. ఏ జిల్లాకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాలి. కేటాయించిన జిల్లాలో మండల సమాఖ్యల అకౌంట్స్ని ఆడిట్ చేస్తాం. ఏ గ్రామానికి వెళితే అక్కడ ఆ సంబంధిత కార్యాలయంలోనే వీరి బస. అకౌంట్స్ అన్నీ కరెక్టుగా వున్న చోట ఆడిట్ నిర్వహిస్తారు. ఫీల్డ్లో వీరు ఎదుర్కొనే బాధలు వర్ణనాతీతం. ప్రసూతి సెలవులు ఉండవు. ఎన్ని రోజులు పని చేసుకుంటే అన్ని రోజులు లెక్కకట్టి కూలి మాదిరిగా వేతనాలు ఇస్తారు.
గత ఏడాది ఆగస్టు 13 నుండి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ''కంటి వెలుగు'' పథకాన్ని కూడా వీరికే అప్పగించారు. సుమారు ఏడు నెలల పాటు ఈ పథకం కోసం సీఆర్పీలు ఎంతో కష్డపడ్డారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు సమాచారం ఇచ్చారు. టెస్టులు ఎప్పుడు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, డాక్టర్లు ఎప్పుడు వస్తారు, ఎప్పటి వరకు ఉంటారు లాంటి సమాచారాన్ని వీరే ప్రజలకు తెలియజేశారు. కొంత మేరకైనా ఈ పథకం ప్రజలకు చేరువయిందంటే అది వీరి శ్రమనే అని చెప్పుకోవచ్చు.
2018 ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకం 2019 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి వరకు వీరు నిర్విరామంగా కృషి చేశారు. ఆ సమయంలో పని చేసి నందుకు వీరికి రోజుకు 170 రూపాయలు ఇస్తామని అధికారులు చెప్పారు. ఎంతో మంది ఈ పని చేయలేక మధ్యలోనే ఆగిపోయారు. కానీ కుకట్పల్లి, ఫతే నగర్, బాలా నగర్ ఏరియాల్లో ఆరు గురు సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పటికి ఆ పథంకం ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇస్తామన్న వేతనం ఇవ్వలేదు. తమకు రావల్సిన జీతాల కోసం గత నాలుగు నెలల నుండి అధికారుల చుట్టూ వీరు తిరుగుతూనే ఉన్నారు. కానీ వారి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. వీరు తమ వేతనాల వెంటనే ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు..
Authorization