పని దొరికింది కదా అని వారెంతో సంబరపడ్డారు. సంతోషపడినంత కాలం పట్టలేదు, వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని తెలుసుకోడానికి. ఉపాధి చూపించమంటూ జనం గోలపెడితే వాళ్ళ కళ్లనీళ్ళు తుడవటానికి ఉద్యోగాలు ఇచ్చారు. కొంత మంది మహిళలను స్వచ్ఛంద కార్యకర్తలుగా తీసుకొని వారికి గౌరవ వేతనాలు ఇస్తామన్నారు. 'మహిళలైతే ప్రశ్నించరు, చెప్పిన పని చెప్పినట్టు చేస్తారు' అని పనిలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారి శ్రమను దోచుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించమని ఆడిగితే 'ఉంటే ఉండండి లేకపోతే పోండి' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వీరిలో ఆషా వర్కర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నెలల తరబడి పారితోషికాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ పాతబస్తీ మహిళలు కొంతమంది తమ కష్టాలను ఈ వారం కొలువుతో పంచుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న మాతా శిశుమరణాలను నివారించాలని ఆషావర్కర్స్ను స్వచ్ఛంద కార్యకర్తలుగా తీసుకుంది. వారికి గౌరవవేతనం ఇస్తామన్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి తిరుగుతారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఎవరికి ఒంట్లో కాస్త నలతగా ఉన్నా పరీక్షలు చేయించుకోమని సలహా ఇస్తారు. పరీక్షలు చేయించుకున్న తరువాత వారి ఆర్యోగ పరిస్థితి ఎలా వుందో వివరిస్తారు. సక్రమంగా మందులు వాడే విధంగా చూస్తారు.
చార్జీలకు కూడా చాలవు
కొత్తగా వివాహమైన అమ్మాయిలకు గర్భవతి సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు చెబుతారు. వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో సూచనలు ఇస్తారు. ఎప్పుడెప్పుడు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలో, డాక్టర్ని ఎప్పుడు కలవాలో నిత్యం పరిశీలిస్తారు. వారికి తొమ్మిది నెలలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు కంటిపాపలా చూసుకుంటారు. ఇంతా చేస్తే వీరికి వచ్చేది కేవలం గౌరవ వేతనం మాత్రమే. కానీ వీరు ఆ గర్భవతిని ఆసుపత్రికి తీసుకువెళితే కనీసం గౌరవించరు. పీహెచ్సీలోని డాక్టర్లు స్పందించరు. వీరు పనిలో భాగంగా తిరిగే ఖర్చులన్నీ వీరి సొంత డబ్బుతోనే పెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం కనీసం వీరి చార్జీలకు కూడా చాలదు.
యూనియన్ అండతో...
ఎంత స్వచ్ఛంద కార్యకర్తలైనా వీరికీ కనీస ఖర్చులు ఉంటాయి. ఇదే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కేవలం వీరిని ఆశక్కలని, ఆశాదీదీలని ప్రకటనల్లో మాత్రం ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి వారివి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. అందుకే సీఐటీయూ వీరికి అండగా నిలిచింది. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి జీవన పోరాటానికి అండగా నిలుస్తామంటున్నారు.
కార్మికులుగా గుర్తించాలి
దేశంలో మాతా శిశు మరణాలను తగ్గించడంలో మా కృషి ఎంతో ఉంది. ఈ విషయం స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. అప్పటి నుండి మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఉద్యోగ భద్రత, ఇఎస్ఐ, పీఎఫ్ కోసం అనేక సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నాము. గతంలో 106 రోజులు సమ్మె కూడా చేశాము. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా సమస్యలను పరిష్కరించడం లేదు.
- సఫియా ఉన్నీసా
తప్పించుకుంటున్న ప్రభుత్వాలు
ప్రస్తుతం మాకు ఇస్తున్న పారితోషికాలు, ఇతర ఖర్చులన్నీ రాష్ట్రాలే భరించాలని కేంద్రం పదే పదే చెబుతున్నది. ఈ విధంగా కేంద్రం తన బాధ్యత నుండి తప్పుకుంటుంది. అలాగే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందంటూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇలా అక్కడ కేంద్రం, ఇక్కడ రాష్ట్రం మా సమస్యలు పరిష్కరించడం లేదు.
- జహిదా బేగం
నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు
ఆస్పత్రిలో డెలివరీల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో 2005లో ప్రభుత్వం ఆషా వర్కర్లుగా మమ్మల్ని నియమించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్హెచ్ఎం స్కీం బడ్జెట్ కూడా తగ్గించింది. సాధారణ పథకాల మాదిరిగా దీనిలో మార్పులు చేయడం వల్ల ఎప్పుడైనా ఈ స్కీంను నిలుపుదల చేసే అవకాశం ఉంది. దీని వల్ల గర్భిణీలకు, బాలింతలకు, పసిపిల్లలకు ఇప్పుడు అందుతున్న పౌష్టికాహారం కూడా దొరకదు.
- జరీనా బేగం
ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలి
పని మాత్రం విపరీతంగా ఉంటుంది. పనికి తగ్గ ఫలితం మాత్రం లేదు. పారితోషికాలు కూడా ఐదారు నెలల నుండి రావడం లేదు. ఇప్పుడు మాకు ఈ పని కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. మమ్మల్ని ఇంటికి పంపించే సర్కులర్ కూడా జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. మాకు పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనాలు అమలు చేయాలి.
- షకీలా బేగం
Authorization