పర్మినెంట్ ఉద్యోగం అనే పదం మాయమై ఎన్నో ఏండ్లు గడుస్తున్నది. రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామంటే అందరూ నమ్మారు. అందులోనూ మున్సిపల్, గ్రామపంచాయితీ కార్మికులు తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశపడ్డారు. మరీ ముఖ్యంగా జిల్లాల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి దుర్భరం. రాష్ట్రం ఏర్పడి కూడా ఐదేండ్లు గడిచిపోయింది. జూన్ 2న రాష్ట్ర అవతరణోత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు ప్లాన్ కూడా జరుగుతుంది. 'సంబరాల సంగతి సరే. మరి మా బతుకుల పరిస్థితి ఏంటి?' అని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.
ఓ పట్టణ పరిధిలో సుమారు 270 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారనుకోండి. వీరిలో మెజారిటీ కార్మికులు దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల పేదలు. నిత్యదరిద్రానికి తోడు యాజమాన్య దోపిడీకి నిరంతరం గురయ్యే బడుగుజీవులు వీల్లే.
దోపిడీ చేస్తున్నా : కార్పోరేషన్లు, మునిసిపాలిటిలు, గ్రామ పంచాయితీలలో పని చేసే ఉద్యోగుల్లో ఎక్కువగా దళితులే ఉంటారు. అంటే వీళ్ళు చేసేపని 4 వ తరగతి ఉద్యోగం. రోడ్డుపైన కాస్త చెత్త కనిపించినా, మురుగు నీరు నిల్వ ఉన్నా అందరూ ముక్కు మూసుకుని దూరంగా పోతారు. కానీ ఈ కార్మికులు మాత్రం వాటిని శుభ్రం చేస్తారు. అందరి ఇళ్ళ ముందు నిల్వ ఉన్న మురుగు కాల్వలు, రోడ్లు శుభ్రం చేయడం, తడిపొడి చెత్తల్ని ఎత్తివేయడమే వీరిపని. తరతరాలుగా అణిచివేయబడి నీచమైనపనులు చేస్తున్నా, ఎంత దోపిడీకి గురవుతున్నా ఎప్పటికైనా మా ఉద్యోగం పర్మినెంట్ కాకపోతుందా? అనే ఆశతో ఇదే పనిలో ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్నారు.
అదనపు పని తప్పదు : గత మూడు, నాలుగు ఏండ్ల నుండి వీరి సమస్యలు పరిశీలిస్తే ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారో అర్థమవుతుంది. పనికి ఐదు నిమిషాలు లేటుగా వచ్చినా ఆరోజు కూలీ కట్ చేస్తారు. కానీ పనిలో వున్న వర్కర్లతో మాత్రం తమ పనిగాక అదనంగా మరో రెండు గంటలు ఎక్కువ చేయించు కుంటారు. ''మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని అసభ్య పదజాలంతో మాట్లాడకపోతే చాలు. మేము చేసిన పనికి ఇవ్వాల్సిన జీతాన్ని నెలవారి ఇస్తేచాలు. రోజువారి పనిలో మాకవసరమయ్యే సౌకర్యాలు కల్పిస్తే చాలు. మా అవసరాల కోసం, ఆరోగ్య రక్షణ కోసం మాకిచ్చే జీతాలనుండి కట్ చేస్తున్న మా సొమ్మును మా ఖాతాల్లో జమచేస్తే చాలు'' అంటూ ఎదురుచూస్తూ బతుకుతున్నారు .
జీతం డబ్బును మింగేస్తున్నారు :కార్మికుల అమాయకత్వం అధికారుల అలుసు చూసుకున్న కాంట్రాక్టర్లు కార్మికులకు వచ్చే 11000 జీతం నుండి 1500 రూపాయల ఇఎస్ఐ, పీఎఫ్ కోసమంటూ కట్ చేసుకుంటూ తమ కాంట్రాక్ట్ ముగియడానికి వస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. కార్మికుల ఇఎస్ఐ, పీఎఫ్ కట్టని కాంట్రాక్టర్లకు అధికారులు బిల్లులెలా మంజూరుచేస్తారో తెలియని ఇది మరో సమస్య. ఒకరూపాయి, రెండురూపాయలు కాదు ఏకంగా లక్షల్లోనే కార్మికుల జీతం డబ్బును కాంట్రాక్టర్లు మింగేస్తున్నారు.
ఇలాంటి పట్టణాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. శ్రమ దోపిడికి గురవుతున్న కార్మికులు వేలల్లో ఉన్నారు. వీరంతా ఏకమవ్వాలి. తమ సమస్యలపై ఉద్యమించాలి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగించాలి.
Authorization