తెలంగాణ జనహృదయనేత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇరువురూ తమకు త్వరలోనే టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారనే దృఢ నమ్మకంతో తెలుగు రాష్ట్రాల డీఎస్సీ-1998 బాధితులు ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు సీఎంల మధ్య మైత్రీ బంధం చాలా బలంగా విరాజిల్లడంతో తమకు ఉద్యోగాలు గ్యారెంటీ అని ఇరు రాష్ట్రాల క్వాలిఫైడ్స్ సంబరపడిపోతున్నారు. క్వాలిఫైడ్స్ హామీని కూడా ముఖ్యమంత్రులు ఇద్దరూ నెరవేరుస్తారని సంతోషంలో మునిగితేలుతున్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించిన 1998 మెగా డీఎస్సీ అవినీతి, అక్రమాల పుట్టగా మారింది. అది ఆయన పరిపాలనకు మాయని మచ్చను మిగిల్చింది. అప్పుడు విద్యా శాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఉన్నారు. విద్యా శాఖలో కొందరు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై టీచర్ పోస్టుల నియామకాలను భ్రష్ఠు పట్టించారు. కౌంటర్లు పెట్టి డబ్బులు దండుకున్నారు. ఇంటర్వ్యూలలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్ష కేంద్రాల్లో పైలటింగ్ సిస్టమ్, ఇంపర్సనేషన్ చోటుచేసుకున్నాయి. మెరిట్ ఉన్న అభ్యర్థులు రోడ్డున పడ్డారు. మార్కులు తక్కువ వచ్చి దొడ్డిదారి మార్గాలు అన్వేషించినవారికి ఉద్యోగాలు దక్కాయి.
ఆశలు అడియాసలై...
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డీఎస్సీ-98 నిర్వహణలో అభాసుపాలైంది. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాలకు బలియైపోయిన డీఎస్సీ-1998 బాధితులకు ఎట్లాగైనా న్యాయం చేయాలనే సంకల్పంతో డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దీంతో బాధితులు, బాధిత కుటుంబాలు కాంగ్రెస్ ప్టా కి ఎన్నికల్లో మద్దతు పలికారు. రాజశేఖర్ రెడ్డి గద్దెనెక్కారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్, హైకోర్టు నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కడప, అనంతపూర్ జిల్లాల క్వాలిఫైడ్స్ కు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బాధితులకు ఉద్యోగాలు ఇచ్చేందకు సిద్ధమయ్యారు. అలాంటి సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. క్వాలిఫైడ్స్ ఆశలు అడియాసలు అయ్యాయి.
స్పష్టమైన హామీ ఇచ్చి...
ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారధి కేసీఆర్ కరీంనగర్ బహిరంగ సభ సందర్భంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ త్వరలో సాధించుకోబోయే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం డీఎస్సీ-1998 బాధితులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చారు. జనవరి 3, 2016 న ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో డీఎస్సీ-98 ప్రతినిధి బృందానికి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు.
నీరు గార్చారు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ రావడానికి ముందు విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని, త్వరలోనే డీఎస్సీ-1998 క్వాలిఫైడ్స్కు టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం తరపున ఓ ప్రకటన చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు కొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు దక్కించుకోబోతున్నాం అని బాధితులు, బాధిత కుటుంబాలలో సంతోషం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేసి అంబరాన్ని అంటే సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ ఆనందాన్ని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నీరు గార్చారు. దీంతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.
మద్దతు పలికిన ఉపాధ్యాయ సంఘాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖలు రాస్తూ డీఎస్సీ-1998 బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూడా ముఖ్యమంత్రికి లేఖలు రాసి న్యాయం చేయాలని కోరారు. 54 ఉపాధ్యాయ సంఘాల జాక్టో ముఖ్యమంత్రికి అందజేసిన వినతిపత్రంలో వారి డిమాండ్లతో పాటు డీఎస్సీ-98 బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశాయి. అసెంబ్లీ, శాసనమండలిలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, విపక్షాలు కూడా క్వాలిఫైడ్స్ న్యాయం చేయాలన్న వాణిని వినిపించాయి.
అందరి చుట్టూ తిరుగుతూ...
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ మరోమారు టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీపై ఆశలు పెట్టుకున్న 1998 డీఎస్సీ బాధితులు అప్పటి నుండి అందరి చుట్టూ తిరుగుతూ వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేరవేర్చాలన్ని పట్టు వదలని ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. 21 ఏండ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న డీఎస్సీ-1998 బాధితులకు త్వరగా న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
రాజశేఖర్ రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా డీఎస్సీ-98 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్వాలిఫైడ్స్, వారి కుటుంబాలు ఆయనకు గట్టి మద్దతు పలికారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల క్వాలిఫైడ్స్ అందరూ సంతోషిస్తున్నారు. త్వరలోనే ఉద్యోగాల తీపికబురు వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చెక్కుచెదరని విశ్వాసంతో...
మెరిట్ ఉండి ఉద్యోగాలు దక్కలేదనే మానసిక సంఘర్షణతో ఇప్పటి వరకూ తెలంగాణలో 50 మందికి పైగా క్వాలిఫైడ్స్ గుండెపోటు, బ్రెయిన్ డెడ్కు గురై చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80మందికి పైగానే మరణించారు. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఉద్యోగాల తీపికబురు తప్పకుండా వస్తుందని నాలాంటి బాధితులు చెక్కుచెదరని విశ్వాసంతో ఎదురుచూస్తూనే ఉన్నాము.
- పుష్పారెడ్డి, కోదాడ
నమ్మకం ఉంది
మాట ఇస్తే వెనక్కి తగ్గరని పేరొందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ గుండెల్లో గుడికట్టి పూజిస్తాం. ఇరు రాష్ట్రాల బాధిత కుటుంబాల్లో చిరస్మరణీయులుగా వారు ఇద్దరూ నిలిచిపోతారు. 21 ఏండ్ల పోరాటానికి త్వరలోనే పరిష్కారం చూపిస్తారు అనే నమ్మకం మాకు ఉంది.
- కప్పల శ్రీనివాస్, అధ్యక్షులు డీఎస్సీ-98 సాధన సమితి, హైదరాబాద్
ఉద్యోగాలు ఇస్తామన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో జనవరి 3, 2016న డీఎస్సీ-1998 బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ప్రగతి భవన్ క్యాంపు కార్యాలయానికి ప్రతినిధి బృందాన్ని పిలిపించుకుని రెండున్నర గంటలపాటు చర్చలు జరపడం, మీకు తప్పనిసరిగా ఉద్యోగాలు ఇస్తామని మంజీరా గెస్ట్ హౌస్లో ఉండి పని పూర్తి చేయించుకోవాలని, ఖర్చులకు రూ.10 వేలు ఉంచుకోండనడంతో అందరూ సంబరపడ్డారు. ఆయనకు దండం పెట్టి మాకు టీచర్ ఉద్యోగాలు ఇస్తే చాలు సార్ అని ఆ డబ్బును తిరస్కరించారు. ఇప్పటికైనా కేసీఆర్ మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలు.
- కె.శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు,డీఎస్సీ-98 సాధన సమితి
త్వరలోనే పరిష్కరిస్తారని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పాదయాత్ర సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు దశాబ్దాలుగా రగులుతున్న డీఎస్సీ-1998 బాధితుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారనే తీపికబురు కోసం ఎదురుచూస్తున్నారు.
- సమ్మయ్య, కరీంనగర్