- తిండికి దూరం చేస్తూ
''విద్యుత్ సంస్థల్లో 20 ఏండ్లుగా పని చేస్తున్నాం.
అయినా పిఎఫ్ లేదు.. ఇఎస్ఐ లేదు.. ఉద్యోగ భద్రత
లేదు.. అసలు కనీస వేతనం అనే మాటే లేదు... విద్యుత్
సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే గుండెకాయ లాంటి
సుమారుగా 1400 మంది మీటర్ రీడింగ్ కార్మికులను
విద్యుత్ కార్మికులుగానే గుర్తించడం లేదు..
ముఖ్యమంత్రిగారు కార్మికులకు ఎలాంటి లోటు
లేకుండా అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటున్నారు.
అందుకే మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్నో సార్లు
తీసుకుపోయాం. కానీ ఎందుకు పట్టించుకోకుండా
వదిలేస్తున్నారు.. ?'' అంటూ ప్రశ్నిస్తున్నారు. వారంతా
'తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ ఉద్యోగుల
యూనియన్'గా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. వారి
సమస్యలు ఈ వారం కొలువులో...
కిందిస్థాయి అధికారులు మాత్రం మీటర్ రీడింగ్ కార్మికులతో మీటింగ్లు పెట్టి 'మీరే సంస్థకు గుండె కాయలాంటి వారు' అంటూ ఇంకా రకరకాల పొగడ్తలతో మభ్యపెడుతున్నారు. అదే సమయంలో మా సమస్యలు పరిష్కరించాలని అడిగితే 'మీ సమస్యలు మాకు సంబంధం లేదు' అని తప్పించుకుంటారు.
గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారు. చేయకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. సంస్థకు మీటర్ రీడర్స్కు సంబంధం లేనప్పుడు డిపార్ట్మెంట్ వారు ఎందుకు మాతో మీటింగ్లు పెడుతున్నారు.. ?
కనీస వేతనాలు అందుతాయని...
2014 వరకు 30 రోజులు బిల్లింగ్ చెసేవారు. కానీ అప్పటి కార్మికులకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. అందుకే గౌరవ జవీణ గారు 15 రోజులు టౌన్ , 19 రోజులు రూరల్ బిల్లింగ్ చెయ్యాలి. మిగతా రోజులు ఫీల్డ్ వర్క్ చెయ్యాలి. అలాగే పీఎఫ్ కట్టిస్తాం. దీని వల్ల కార్మికులకు కనీస వేతనాలు అందుతాయి. ఫ్యూచర్లో పర్మినెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనే ఉద్దేశ్యంతో ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కొంత కాలం పీఎఫ్ కట్టించారు. డిపార్ట్మెంట్ కూడా కట్ చేసిన పీఎఫ్ను రియంబర్స్మెంట్ చేసింది.
పీఎఫ్ ఎత్తేశారు
మీటర్ రీడింగ్ కార్మికుల జీవితాలు సంతోషంగా సాగుతున్న సమయంలో కొందరు ఓర్వలేక కుట్రలు పన్ని పీఎఫ్ను తీసి వేసినారు. కార్మికుల జీవితాలను సర్వ నాశనం చేసి అత్యంత దారుణమైన పాపాన్ని మూట కట్టుకున్నారు. ఇప్పుడు అదే ఆర్డర్ను డిపార్ట్మెంట్ ఫాలో అవుతున్నది. కానీ పీఎఫ్ మాత్రం కట్టడం లేదు.
గొప్పలు చెప్పుకుంటున్నారు
ఫీల్డ్ వర్క్ ఇవ్వడం లేదు. కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవడం లేదు. 30 శాతం బిల్లింగ్ డిపార్ట్మెంట్ చెయ్యాలి అని ఉన్న సర్వీసుల్లోనే కోత ఎందుకు విధిస్తున్నారు. దీని వల్ల కూడా కార్మికుడి జీతం తగ్గి పోతుంది. ఈ పాపం ఎవరిది.. పోనీ 30 శాతం బిల్లింగ్ డిపార్ట్మెంట్లోని అధికారులు చేస్తారా.. అంటే అదిలేదు. 30 శాతం సర్వీసులు కూడా మీటర్ రీడర్స్ ద్వార నే బిల్లులు చేయించుకుంటారు. ఇదెక్కడి న్యాయం.. పై అధికారులైతే బిల్లింగ్ మొత్తం మా డిపార్ట్మెంట్ నుంచే చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం..
కోట్లు ఎటు పోతున్నాయి
సుమారుగా 1 కోటి రూపాయలు మాత్రమే కార్మికులకు జీతాలు ఇస్తుంటే, మరి మిగిలిన 3 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి..అవి ఏమౌతున్నట్టు.. ఒక్క నెలకే 3 కోట్లు అంటే సంవత్సరానికి సుమారుగా 36 కోట్లు.. మరి18 సంవత్సరాలగా ఈ మోసం జరుగుతుంది. ఇలా అప్పనంగా, అడ్డగోలుగా డబ్బులు ధారాదత్తం చేస్తుంటే సంస్థ అప్పులు పాలు అవుతుంది అంటే అవ్వదా మరీ.. ? ఇలా కోట్లాది రూపాయలు ఎటుపోతున్నాయి..ఇవేవీ అధికారుల దృష్టికి రావడం లేదా..ఈ కాంట్రాక్టర్ల వల్ల సంస్థకు ఏమైనా లాభం ఉందా.. ఈ కాంట్రాక్టర్లు సంస్థలో ఏమైనా పని చేస్తున్నారా.. పోనీ సంస్థ అభివృద్ధి కోసం ఏమైనా ఉపయోగ పడుతున్నారా.. వీరి వల్ల అధికారులకు, సంస్థకు పని భారం ఏమైనా తగ్గుతుందా.. ఇదేదీ జరగడం లేదు. అయినా వారిని ఎందుకు గౌరవిస్తారు. వారినే పట్టి పట్టి పిలిచి మరీ సకల మర్యాదలు చేసి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు.
మమ్మల్ని అక్కున చేర్చుకుంటే...
తన దగ్గర పని చేస్తున్న కార్మికులు ఎంత మంది ఉన్నారో కాంట్రాక్టర్లకు తెలియదు. తన దగ్గర కార్మికుల డేటా ఉండదు. కనీసం రికార్డులను మెయింటెన్ చేస్తున్నారా...అంటే అదీ లేదు. కార్మికుల కనీస అవసరాలు గురించి ఏమాత్రం పట్టించుకోరు. కాంట్రాక్టర్లు చేసే పనిని డిపార్ట్మెంట్ లోని అధికారులు చెయ్యలేరా.. ఆ కాంట్రాక్టర్లను తీసివేసి ఎండనకా, వాననకా, చలనకా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటు ఇల్లిల్లు తిరిగి కరెంటు బిల్లులు కొట్టి సంస్థకు ఆదాయాన్ని తెచ్చే ఈ 1400 మంది మీటర్ రీడింగ్ కార్మికులను విద్యుత్ సంస్థ అక్కున చేర్చుకుంటే... ఎంత బాగుంటుంది.
- టి.కుమార్,
స్టేట్ సెక్రటరీ
సంబంధం లేదంటున్నారు
ప్రతీ నెలా రాష్ట్రంలోని కోటి నలబై లక్షల సర్వీసులకు బిల్లులు కొట్టేందుకు 40 , 50 మంది కాంట్రాక్టర్లకు విద్యుత్ శాఖ సుమారుగా 4 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఖర్చు చేస్తుంది. ఈ మొత్తం కాంట్రాక్టర్ల దగ్గర సుమారు 1400 మంది మీటర్ రీడింగ్ కార్మికులు పని చేస్తున్నారు. కానీ కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కాంట్రాక్టర్లకు అందుతున్న 4 కోట్ల రూపాయల్లో కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే కార్మికులకు జీతాల రూపంలో అందుతున్నాయి. కాంట్రాక్టర్లకు డిపార్ట్మెంట్కు జరిగే అగ్రిమెంట్లలో కార్మికులకు ఇఎస్ఐ, పీఎఫ్ కట్టాలి అని స్పష్టంగా ఉంటుంది. కార్మికులు ఇదే విషయాన్ని కాంట్రాక్టర్లను అడిగితే 'డిపార్ట్మెంట్ మాకు ఇవ్వడం లేదు.. ఈ పని మీద మాకు పైసా మిగలడం లేదు' అంటున్నారు.
- కె.రవి కుమార్,
స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్
లాభమే కానీ నష్టం ఉండదు
కరెంటు బిల్లులు కొట్టడానికి సంస్థ విడుదల చేసే డబ్బుల్లోనించే మాకు జీతాలు ఇవ్వవచ్చు.1400 మందికి కనీస వేతనమైన 18000 రూపాయలు చొప్పున జీతాలు ఇచ్చినా ఇంకా సంస్ధకు లాభమే ఉంటుంది. నష్టం మాత్రం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులతో సతమతమవుతున్న సంస్థలో కొత్త రిక్రూట్ మెంట్స్ చేసి అత్యధికంగా అప్పుల పాలు అయ్యేకన్నా... ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకుంటే లాభాలతో కాకపోయినా కొంత ప్రశాంతంగా ఉండవచ్చు. మీటర్ రీడింగ్ కార్మికులకు నెలరోజుల పని కల్పించి ఇఎస్ఐ, పీఎఫ్తో పాటు కనీసం వేతనాలు ఇస్తే సంస్థకు లాభమే కానీ నష్టం ఉండదు.
- వెంకట రామరాజు,
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, భద్రాద్రి
మాకు నెల రోజులు పని కల్పిస్తే
మీటర్ రీడింగ్ కార్మికులకు నెల రోజుల పని ఇవ్వడం వల్ల అటు సంస్థకు, ఇటు అధికారులకు పని వత్తిడి, పని భారం తగ్గుతుంది. వీరి కుటుంబాలు రోడ్డున పడకుండా బాగుపడతాయి. ఇన్ని సంవత్సరాలుగా ఈ సంస్థలో పని చేస్తున్నందుకు గౌరవం లభిస్తుంది. సంస్థకు కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆదాయం పెరుగుతుంది. మాతో పనులు చేయించుకొని చూడండి మా విలువ, దాని వల్ల వచ్చే రిజల్ట్ మీకే అర్థమవుతుంది.ఇంతకాలం ఎంత పెద్ద తప్పులు చేసారో కూడా విద్యుత్ సంస్థకు తెలుస్తుంది.
- డి. సునీల్ కుమార్,
రాష్ట్ర అధ్యక్షుడు
మీరే మమ్మల్ని వదిలేస్తే ఎలా?
విద్యుత్ శాఖ మంత్రి మరీ దారుణంగా అసెంబ్లీలోనే మాకూ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మా కార్మికుల గొంతు కోశారు. ఒక మంత్రి ఆ విధంగా మాట్లాడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే ఉంటుందా! ముఖ్యమంత్రి గారూ...మీరే మమ్మల్ని ఇలా వదిలేస్తే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలి.
- జి. వెంకటేశ్వర్లు
జీతాల్లో కోత విధిస్తారు
అనివార్య కారణాల వల్ల బిల్లింగ్ ఆలస్యం అయితే మా జీతాలలో కోత విధిస్తారు. కరెంట్ పోయినా బిల్లులు కొట్టాలి అంటారు. కొన్ని అనుకోని సందర్భాల్లో తప్పు రీడింగ్ పడితే దాన్ని సరిదిద్దు కోవాలని చెప్పకుండా ఏకంగా 'మీ మీద కేసులు పెడతాం' అంటారు. కరెంట్ పోతే బిల్లులు ఎలా కొట్టాలో చెప్పరు. ఒకప్పటి గౌరవ జవీణ గారు ఇచ్చిన ఆర్డర్ను తుంగలో తొక్కి కార్మికుల జీవితాలు నాశనం చేస్తున్నారు.
ఇప్పుడు అదే పదవిలో ఉన్న అధికారు మా సమస్యలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారు.
- ఇ. రమేష్ భరత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
Authorization