విశ్రాంతి ఎరుగని శ్రమ వారిది. నిత్యం బరువులు మోయనిదే పూట గడవదు. కడుపుకింత తిండి దొరకదు. వేరే పని చేతగాక ఈ పని చేసే వారు కొందరైతే.. వేరే ఉపాధి దొరక్క తప్పక బరువులు మోస్తున్నవారు కొందరు. చివరకు గ్రామాల్లో రైతులు సైతం వ్యవసాయంలో గిట్టుబాటు లేక ఈ పనిలో చేరిపోతున్నారు. ఇలా బరువులు మోసి అనారోగ్యాలు తెచ్చుకుంటున్న హమాలీ కూలీల సమస్యలు నేటి కొలువులో....
చంద్రయ్యకు యాభై ఏండ్లు. ముఫ్పై ఏండ్ల నుంచి హమాలిగా పని చేస్తున్నాడు. భార్య ఇండ్లల్లో పనులు చేసి కొద్దో గొప్పో సాయపడేది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరూ కష్టపడితే వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కొడుకు ఇంటర్లో మంచి మార్పులు తెచ్చకున్నాడు. ఇంజనీరింగ్ చేయాలని అతని కోరిక. అయితే చంద్రయ్య ఫీజులు కట్టలేక బిఎస్సీలో చేర్చాడు.
గతంలో వ్యవసాయం చేసే వెంకటయ్య మూడేండ్ల కిందట సిటీకి వచ్చేశాడు. పని వెదుక్కుంటుంటే తెలిసిన వారు హమాలీ పనిలో పెట్టారు. అప్పటి వరకు రైతుగా ఊళ్ళో దర్జాగా బతికన అతను ఇక్కడ కూలిగా మారిపోయాడు. వచ్చే ఆదాయం తక్కువ. దీని కోసం రోజంతా కష్టపడాలి. బరువులు మోయాలి. అలవాటు లేని పని కావడంలో మాటిమాటికీ జ్వరం వచ్చేది. మూడు రోజులు చేస్తే నాలుగు రోజులు ఇంట్లోనే. కుటుంబం గడవడమే కష్టంగా మారింది.
యాదయ్యకు అక్షరం ముక్క రాదు. పదిహేనేండ్ల నుంచి హమీలీగా పని చేస్తున్నాడు. ఇది తప్ప వేరే పని చేయలేడు. ఏండ్లు గడుస్తున్నాయి. పని మాత్రం చేయాలి. ఆదాయంలో పెద్దగా మార్పు లేదు. నొప్పులు భరించలేక తాగుతాడు. వచ్చిన ఆదాయంలో సగం దానికే పోతుంది. ఇక కుటుంబాన్ని ఏం పోషిస్తాడు.
వీరిదే ప్రముఖ పాత్ర
చంద్రయ్య, వెంకటయ్య, యాదయ్య లాంటివారు ఎందరో... కూటి కోసం బరువులు మోస్తూ హమాలీలుగా బతుకుతున్నారు. చాలీ చాలని జీతాలు. కుటుంబం గడవడమే కష్టం. కానీ వీరి సమస్యలు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థలో వర్తకం, వాణిజ్య వ్యాపారాలలో ఎగుమతులు, దిగుమతుల పనుల్లో ప్రముఖ పాత్ర పోషించేది హమాలీలు. అలాంటి హమాలీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ హమాలీలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తారు. మహాలీలు, జట్టుముఠా, కళాసి, బంటా రవాణా పార్శిల్ మహాలీ, ట్రాక్టర్ హమాలీ, కంకర ముఠా, క్వారిలలో పనిచేసే క్వారిముఠా, పౌరసరఫరాల శాఖలో పని చేసే లోడింగ్ అన్ లోడింగ్ వారు, రైస్మిల్లు, వ్యవసాయ, మార్కేట్, గన్నిమర్చంట్ దుకాణాలలో పనిచేసే మహాలీ, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీ, ఐఎంఎల్ డిపోలల్లో పనిచేసే బేవర్జ్ హమాలీ ఇలా అనేక రకాలుగా ఉన్నారు.
ఎన్ని జీవోలు వచ్చినా
హమాలీ కార్మికుల శ్రమశక్తి వలన రవాణ వర్తక, వాణిజ్య, వ్యాపారంలో పన్నుల రూపంలో కొట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది. వీరి సంరక్షణ కోసం ఎన్నో జీవోలు ప్రభుత్వం తీసుకువచ్చింది. కాని ఇవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం. జబారు ముఠా హమాలీలు అన్నిరకాల కిరాణ సరుకులు, ఐరన్, సిమెంట్ ఫెర్టిలైజర్ ఎగుమతి, దిగుమతులు చేస్తారు. కిరాణ సరుకులు ఎక్కువగా షాపుల వద్ద దిగుమతి చేయాలి. కాబట్టి సమయం ఎక్కువ పడుతుంది. ఎప్పుడూ బరువులు మోయడం వల్ల వీరికి తల, భుజాలు, వెన్నుముక నొప్పులతో పాటు చేతులపై, కాళ్ళ పిక్కల వద్ద చర్మం కాయకాసి నల్లబారుతోంది. పని గంటలు ఒక్కో కంపెనీలో ఒక్కో సమయం ఉంటుంది. దాంతో వీరి పని తెల్లవారు జామున మొదలై రాత్రి 11గంటల వరకు సాగుతూనే ఉంటుంది.
పొంచి ఉన్న ప్రమాదాలు
రైస్ మిల్లు కోల్డ్ స్టోరేజిలల్లో పై అంతస్థులకు గెడం వేసేటపుడు ఐదు నుండి పదంతుస్థుల వరకు చెక్కలతో ర్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఆ ర్యాంపులపై నడుస్తున్నపుడు కాళ్ళు చెమటలు పడతాయి. దాంతో ర్యాంప్పై జారిపడినపుడు చెక్కల మధ్య కాళ్ళు దూరి తొంటి వెన్నుముక, కాళ్ళు, చేతులు పక్క ఎముకలు విరుగుతాయి. ప్రమాద తీవ్రతను బట్టి వారి ఆరోగ్య పరిస్థితి లెక్కించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మార్కెట్ యార్డులో ట్రాలీలపై బస్తాలు ఎక్కించే సమయంలో ట్రాలీ అమాంతం పైకి లేసిపోతుంది. దాంతో హమాలీ కార్మికుల, మర్మంగాలకి, తొడలకు విపరీతమైన దెబ్బలు తగులుతాయి. దాంతో వారికి వాపులు వాస్తాయి. ప్రమాదం జరిగినపుడు ఏమైనా గాయాలు అయితే వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక అలాగే వుండిపోతారు. దాంతో ఆ గాయాలు సెప్టిక్ అయ్యి కనీసం పనులు కూడా చేసుకోలేని విధంగా వారి ఆరోగ్యం క్షీణించిపోతుంది.
ఎప్పుడూ అనారోగ్యమే
సిమెంట్ గోడౌన్లలో బస్తాలు ఎగుమతి, దిగుమతి చేసే సమయంలో గోడౌన్ల నిండా సిమెంట్ కమ్మి కండ్లు కూడా కనిపించవు. ముక్కు, నోటి నిండా సిమెంట్ దువ్వచేరి పోతుంది. దాంతో కడుపు ఉబ్బరంగా వుండటం, ఆకలి లేకపోవడం కడుపులో నొప్పిరావడం, మల విసర్జనలు జరగక పోవడం వంటి సమస్యలు వస్తాయి. మార్కెట్ యార్డులలో కోల్డ్ స్టోరేజ్లలో మిర్చి బస్తాల మధ్య పని చేసేటప్పుడు కారం కోరుతో మహాలీ కార్మికులకు మునికాళ్ళు మంటలు, తుమ్ములు, దగ్గులతోపాటు తిన్న అన్నం కూడా వాంతుల రూపంలో బయటికి వస్తుంది. ఇలాంటి ఎన్నో సమస్యలతో వారు నరకం అనుభవిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తారు
యాజమాన్యాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల హమాలీ కార్మికులకు నష్టం కోట్లల్లో ఉంది. ఉదాహారణకు ఆసియా ఖండంలోని అతిపెద్ద రెండవ మార్కెట్ యార్డుగా పేరుగాంచిన వరంగల్ జిల్లా ఎనూమముల మార్కెట్ యార్డులోనికి రైతులు పండించిన పంటకు క్రమ విక్రయాలు మార్కెట్ యార్డులలోనే జరగాలి. అయితే మార్కెట్ యార్డు లోపలికి తీసుకువస్తే హమాలీ ఎగుమతి, దిగుమతి కాంట కూలీ మార్కెటింగ్ సెస్సు చెల్లించాల్సి వస్తుందని యార్డుల బయట, వేబ్రిడ్డిల కింద తూకాలు పూర్తి చేసి సరుకులను అక్రమంగా తరలిస్తారు. దాంతో కొన్ని కోట్ల రూపాయల సరుకు అక్రమంగా దళారుల చేతికి పోతుంది.
నగరాల్లో మరీ ఎక్కువ
పని ప్రదేశంలోని బోర్వాటర్ తాగడం వల్ల చాలా మంది కిడ్నీలకు సంబంధించిన వ్యాధుల బారినే పడినట్లు కార్మికులు చెబుతున్నారు. హమాలీ తమ నివాస ప్రాంతం నుండి చేస్తున్న పని ప్రదేశానికి పది నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం నుండి వస్తారు. అలా వచ్చే వారి సంఖ్య తొభై శాతం ఉంటుంది. సొంత ఇండ్లు లేవు. అద్దె ఇండ్లల్లో నివాసం వుండేవారే ఎక్కువ. పట్టణాలు నగరాలలో నైతే వీరికి సమస్యలు మీరీ ఎక్కువగా ఉంటాయి. ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ముందు ఏ కులమో చెప్పాలి. రెండు, మూడు నెలల అడ్వాన్స్. ఇలా ఎన్నో షరతులతో ఇండ్లు కిరాయికి ఇస్తారు.
పగలంతా కష్టపడి పని చేసి ఆ నొప్పుల బాధలను భరించాలంటే మద్యానికి బానిసలవుతున్నారు. తాగుడుకే రోజుకు సుమారు యాభై నుండి వంద వరకు ఖర్చు అవుతాయి. ఇటువంటి పరిస్థితులలో ఎక్కువ మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన ఆధారపడుతున్నారు. అందుకే హమాలీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరిగేవిధంగా ప్రభుత్వం చూడాలి. కాని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Authorization