మున్సిపల్ కార్మికులు... రోడ్లు శుభ్రం చేయడంలో వీరి పాత్ర కీలకమైనది. వీరి శ్రమ వెల కట్టలేనిది. కానీ వారి సమస్యలను మాత్రం మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలల నుండి వీరికి వేతనాలు చెల్లించకుండం లేదు. దాంతో ఆ కుటుంబాలు ఎన్నో కష్టాలు పడుతున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే తమ విధులను మాత్రం సక్రమంగా నిర్వహిస్తున్న ఆ కార్మికుల సమస్యలు ఈ వారం కొలువులో...
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 75 మున్సిపాల్టీలలో వేతన బకాయిలున్నాయి. 2018 ఆగస్టు 2 కు ముందు గ్రామ పంచాయితీలుగా ఉన్నప్పుడు కూడా 3 నుండి 9 నెలలు వేతనాలు బకాయిలున్నాయి. మున్సిపాల్టీలుగా మారిన తర్వాత కూడా వేతన బకాయిలు అలాకే ఉన్నాయి. కొత్త మున్సిపాల్టీలలో జీఓ నెం.14 ప్రకారం వేతనాలివ్వడం లేదు. పిఎఫ్, ఇఎస్ఐ ఖాతాలు ఇంకా ప్రారంభించలేదు.
వేతనాలు తగ్గించారు
కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులు ఆనాటికి పొందుతున్న వేతనాలను విలీనం పేరుతో తక్కువగా చెల్లించకూడదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గ్రామ పంచాయితీలుగా ఉన్నప్పుడు పంచాయితీ తీర్మానాల ప్రకారం రూ.12,000/- లకు పైన వేతనాలు పొందే కార్మికులున్నారు. మున్సిపాల్టీలు అయిన తరువాత అలాంటి వారి వేతనాలను తగ్గించారు. మున్సిపాల్టీలలో ఉన్న జీఓ ప్రకారమే వేతనాలిస్తాం అంటున్నారు. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం పొందుతున్న వేతనాలు జీఓ కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ తగ్గించరాదు. ఎక్కువ వేతనాలు ఉన్నవారికి తగ్గిస్తున్నారు. కాని తక్కువ వేతనాలు ఉన్నవారికి మాత్రం జీఓ నెం.14 ప్రకారం వేతనాలు పెంచడం లేదు. మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో విలీనం అయిన కార్మికులకు కూడా జీఓ నెం.14 ప్రకారం అమలు చేయడం లేదు.
వారాంతపు సెలవులు లేవు
వడ్డేపల్లి, ఆదిలాబాద్, కేతేపల్లి, బాన్సువాడ, మంథిని, దుండిగల్లో ప్రాంతాల్లో వారాంతపు సెలవులే లేవు. రాష్ట్రంలో అనేక మున్సిపాల్టీల్లో ఆదివారం అర పూట, గురువారం అర పూట సెలవు ఇస్తున్నారు. దీని వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదు. వారంలో ఒక్క రోజు (ఆదివారం) తప్పకుండా కార్మికులకు వారంతపు సెలవు ఇవ్వాలి. అత్యవసర పనులనే పేరుతో వాటర్ వర్క్స్లో పని చేస్తున్న వారికి వారాంతపు సెలవులు, క్యాజువల్ సెలవులు ఇవ్వడం లేదు. అదనపు సిబ్బందిని నియమించి అయినా లేదా ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసైనా రొటేషన్ పద్ధతిపై వీరికి కూడా వారాంతపు సెలవులు, ఇతర సెలవులు ఇవ్వాలి.
తొలగింపులే
నల్లగొండ, కోస్గి, గుండ్ల పోచంపల్లి మున్సిపాల్టీలలో 55 ఏండ్లు పై బడిన వారిని తొలగించారు. మిగిలిన మున్సిపాల్టీల్లో కూడా తొలగిస్తామని బెదిరిస్తున్నారు. సుమారు 15-20 సంవత్సరాలు శక్తి ఉన్న సమయాన్నంతా మున్సిపాల్టీలలో పని చేయడానికే కార్మికులు హెచ్చించారు. ఈ పనినే నమ్ముకుని జీవిస్తున్న వారిని అర్థాంతరంగా తొలగిస్తే వారి జీవనోపాధి కోల్పోతారు. 2017, ఆగస్టు 28 నాడు యూనియన్లతో ప్రభుత్వం రాసుకున్న మినిట్స్ ప్రకారం వృద్ధాప్యం, అనారోగ్యంతో పని చేయలేని స్థితిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబం నుండి అతనిపై ఆధారపడిన వారికి (భర్త / భార్య / కుమార్తె / కొడుకు/ మనువడు / మనువరాలు) ఉపాధి కల్పిస్తూ వారికి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలి. వారసులుగాని, ఆ పని చేయగల కుటుంబసభ్యులు గాని లేని వారికి రూ.10 లక్షల, నెలనెలా పెన్షన్ లాంటి రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కల్పించాలి.
అంత్యక్రియల ఖర్చులు
మిర్యాలగూడెం, చొప్పదండీ, వరంగల్ కార్పొరేషన్, వాటితోపాటు అనేక మున్సిపాల్టీల్లో దహన సంస్కారాలకు రూ.10,000/- ఇవ్వడం లేదు. ఈ డబ్బులు మున్సిపాల్టీ చెల్లించారా? కాంట్రాక్టర్ చెల్లించాలా? అనేది సందిగ్ధంలో వుండటం వల్ల కార్మికులు నష్టపోతున్నారు. 2017, ఆగస్టు 28న యూనియన్లతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం దహన సంస్కారాలకిచ్చే ఖర్చులను రూ.10,000/- నుండి రూ.20,000/-లకుపెంచాలి.
భద్రత కరువు
రాష్ట్రంలో 5,6 మున్సిపాల్టీలల్లో మినహా ఎక్కడా భద్రతా పరికరాలు ఇవ్వడం లేదు. సర్య్కులర్ నెం. 6054/2016 ఎం2 2011, ఆగస్టు 13 ప్రకారం భద్రతా పరికరాలు, యూనిఫాం, సబ్బులు, చెప్పులు, నూనెలు, బెల్లం ఇవ్వడం లేదు.
15 రోజుల క్యాజువల్ సెలవులు
సర్య్కులర్ నెం.16238/2010/ఎం3 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు 15 రోజుల క్యాజువల్ సెలవులు ఇవ్వాల్సివుండగా రాష్ట్రంలో ఈ సర్య్కులర్ ఎక్కడా అమలు కావడం లేదు. రాష్ట్రంలో పాత, కొత్త మున్సిపాల్టీలలో ఎక్కడా కూడా సంవత్సరానికి 15 రోజుల క్యాజువల్ సెలవులు ఇవ్వాలన్న ఆదేశం అమలుకావడం లేదు.
గ్రూపుల ఏర్పాటులో నిర్లక్ష్యం
జీఓ నెం.52 ప్రకారం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి ఆ స్థానంలో ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులతోనే యస్డబ్ల్యూజి గ్రూపులు ఏర్పాటు చేయాలి. దీనివల్ల కాంట్రాక్టర్లకిచ్చే కమీషన్ (సర్వీస్ చార్జీ, మున్సిపల్ వర్కర్స్ వేతనాలు, పిఎఫ్, ఇఎస్ఐలలో కోతలు, వేధింపులు నివారించే ఉద్దేశ్యం) తగ్గి మున్సిపాల్టీలను ఆర్థికభారం, కార్మికులకు వేధింపులు తగ్గుతాయని భావించాం. కానీ రాష్ట్రంలో కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కార్పోరేషన్లతో పాటు అనేక మున్సిపాల్టీలలో గ్రూపుల ఏర్పాటు చెయ్యడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని చోట్లల్లో కాంట్రాక్టర్లు మరికొన్ని చోట్లల్లో పొదుపు మహిళా సంఘాల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. కరీంనగర్లో పాత కాంట్రాక్టర్ల ఇస్టానురాజ్యంగా గ్రూపులు ఏర్పాటుచేస్తున్నారు. వారు చెప్పిన గ్రూపులకే పనులు అప్పగిస్తున్నారు. కార్మికులు కలసికట్టుగా, వారి వెసులుబటు ప్రకారం గ్రూపులు ఏర్పాటు చేయడం లేదు. ఏ ఉద్దేశంతో జీఓ తీసుకొచ్చామో ఆ స్ఫూర్తితో దాన్ని అమలు చేయించాలి. దీన్ని వాటర్ వర్క్స్, ఇతర కేటగిరీల కార్మికులను కూడా వర్తింపజేయాలి.
సెలవు పెట్టాలంటే భయంనల్గొండ మున్సిపాల్టీలో వయసు అయిపోయిందని కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా 20, 25 సంవత్సరాల నుండి ఇదే పని చేస్తున్నారు. అర్థాంతరంగా పనిలో నుండి తీసేస్తే ఎలా? వీళ్ళపై ఆధారపడిన కుటుంబ సభ్యులు రోడ్డున పడతారు. కనీసం ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా లేదు. దీనికోసం పోరాటం చేస్తున్నాం. మున్సిపాల్టీలో పని చేసే కార్మికులు పనులు చేసే సమయంలో ప్రమాదాలకు గురైతే వైద్యం కోసం సెలవులు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు కార్మికులను పనిలో నుండి తొలగిస్తున్నారు. అత్యవసరమై ఒక్క రోజు సెలవు పెట్టాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. సెలవు పెడితే పాత వారిని తొలగించి కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారు. చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవి పూర్తిగా పాడయ్యే వరకు రిపేర్లు చేయించరు. వాటికి ఏమైనా జరిగితే డ్రైవర్లపైనే నేరం మోపుతారు. దీని గురించి కూడా అధికారులను ప్రశ్నిస్తున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం కోసం జూన్ 28న ధర్నా చేశాం. కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు.
- రవి, నల్లగొండ
యూనియన్ రాష్ట్ర ట్రెజరర్
కార్మికులంటే విలువ లేదు
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేదు. రాత్రి డ్యూటీలు వేస్తారు. సూపర్వైజర్లు పని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ మాకు ఏం జరిగినా పట్టించుకునే వారు లేరు. ఏదైనా ప్రమాదం జరిగి మేం పని చేయలేకపోతే కనీసం నష్టపరిహారం కూడా చెల్లించరు. మహిళలు శ్రమదోపిడికి గురవుతున్నారు. ప్రసూతి సెలవులు లేవు. ఆ సమయంలో సెలవు తీసుకుంటే వేతనాలు రావు. మున్సిపల్ కార్మికులంటే ప్రభుత్వానికి చిన్నచూపు. మా సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు పని భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
- అనిత, గోదావరిఖని, యూనియన్ రాష్ట్ర ఆఫీస్బేరర్
మరెన్నో సమస్యలు
జీఓ నెం.14 ప్రకారం కేటగిరీలవారీగా పాత మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న పారిశుద్ధేతర కార్మికులకు వేతనాలివ్వాలి. కొత్త మున్సిపాల్టీలో జీఓ నెం.14ని అమలు చేయాలి.
11వ పీఆర్సీలో మున్సిపల్ కార్మికులకు రూ.24,000/-లు వేతనంగా నిర్ణయించాలి.
మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లు లేనందున డీఏ ఎరియర్స్ని నగదు రూపంలో ఇవ్వాలి.
ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ వేతనంపై పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలి.
ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
ప్రమాదాలు జరిగినప్పుడు, మరణించినప్పుడు ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్స్ ఇవ్వాలి.
ప్రమాదాలు జరిగి పని చేయలేని స్థితిలో ఉన్న కార్మికులకు వైద్యం చేయించాలి. డాక్టర్ సలహా మేరకు విశ్రాంతి తీసుకునే రోజులకు వేతనం చెల్లించాలి.
అదనపు వేతనాలు పొందుతున్నారనే పేరుతో వేతనాల్లో కోత విధించిన కార్మికులకు యధావిధిగా వేతనాలు చెల్లించాలి.
Authorization