అంగన్ వాడీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచి 8 నెలలు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. పైగా ఇప్పటికే రాష్ట్రంలో అంగన్ వాడీలకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. పర్మినెంట్ చేయలేదు, కనీస వేతనం ఇవ్వటం లేదు. పెన్షన్, ఇఎస్ఐ, ఉద్యోగభద్రత సౌకర్యాలు కల్పించలేదు. ఇవేవి కల్పించకుండానే ఇచ్చే వేతనం ఏవిధంగా ఎక్కువో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓ పక్క అంగన్ వాడీలను గౌరవప్రదమైన స్థాయికి తెచ్చానని చెప్తూనే మరో పక్క రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని మోసే హమాలీ పని చేయిస్తున్నది. ఇలా అంగన్ వాడీలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ కార్మికుల సమస్యల గురించి సమగ్రంగా...
అంగన్వాడీల పోరాటాల ఫలితంగా మార్చి నెలలో ఐసీడీఎస్ డైరెక్టర్ అంగన్ వాడీ కార్మిక సంఘాలతో జాయింట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో అంగన్ వాడీ కేంద్రాలకు ఓ పూట బడి, వంట చేయడానికి గ్యాస్ సిలిండర్కు అయ్యే ఖర్చులు చెల్లిస్తామన్నారు. కానీ అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యం సప్లైపైన స్పష్టత ఇవ్వలేదు. 2019 ఫిబ్రవరి నుండి రేషన్ షాపుల ద్వారా తెస్తున్న బియ్యానికి ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు కూడా సమావేశంలో నిర్ణయించలేదు. కేంద్రం పెంచిన వేతనాలు మళ్ళీ అడగొద్దని డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కేంద్రం పెంచిన వేతనాలను ఎగ్గొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా అంగన్ వాడీలకు అందుతున్న హక్కులను కాలరాయటం తప్ప మరొకటి కాదు.
అన్యాయంగా మాట్లాడారు
5 సంవత్సరాల పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదు. పైగా డబ్బులెక్కడున్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అదనపు పనులపై స్పష్టత ఇవ్వకపోగా పనుల గురించి వారికేమి తెలియనట్లు 'ఇప్పటినుండి చేస్తున్న పనులను డైరీలో రాయండి. ఆ తర్వాత పరిష్కరిస్తాం' అంటూ అన్యాయంగా మాట్లాడారు. వీటితోపాటు ఇంకా అనేక డిమాండ్స్ను పరిష్కారం చూపకుండానే సమావేశాన్ని ముగించారు. పైగా సమస్యలపై స్పందించిన తీరు, అంగన్ వాడీల సమస్యలను పెంచే విధంగా ఉన్నాయి. ఈ వైఖరిని వెంటనే మార్చుకోవాలి.
సంఘాలను నిలదీయండి
జాయింట్ మీటింగ్లో జరిగిన చర్చలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొన్ని సంఘాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. సమావేశంలో అంగనవాడీలకు వ్యతిరేకంగా, సమస్యలు పెంచే విధంగా ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇంతటి వ్యతిరేకమైన చర్చలను కొంతమంది కప్పిపుచ్చుతున్నారు. అంతా సానుకూలంగా చర్చలు జరిగినట్లు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రచారం చేస్తున్నారు. అంగన్ వాడీలను గందరగోళానికి గురిచేసి పోరాటాలకు సిద్ధం కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంగనవాడీలను మోసం చేయటంతోపాటు, అంగన్ వాడీల పట్ల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి సహకరించటం తప్ప మరొకటి కాదు.
మళ్ళీ బానిసత్వంలోకి
కేేంద్ర ప్రభుత్వం కేవలం జాతీయవాదం, దేశ భద్రత, మతం పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు ప్రజా వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలను మరింత వేగంగా అమలు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నది. అధికారంలోకి వచ్చిన ఈ కొద్దికాలంలోనే 46 ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయటం లేదా ప్రైవేటీకరణ చేస్తామని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజిస్తామని ప్రకటించింది. ఇవి అమలు జరిగితే కార్మికులు మళ్ళీ బానిసత్వంలోకి నెట్టబడతారు.
పరిష్కరించకపోగా...
ఇక రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించకపోగా రోజురోజుకు మరింత పనిభారాన్ని పెంచుతుంది. అనేక ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. పెన్షన్ ఇవ్వకుండానే ఇంటికి పంపాలని చూస్తున్నది. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీల బతుకులను ఆగమాగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంగన్ వాడీలు పోరాడాలి. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో అంగనవాడీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ అంగన్ వాడీ వర్కర్స్ (టీచర్స్) హెల్పర్స్ యూనియన్(సీఐటీయు) విజ్ఞప్తి చేస్తుంది.
డిమాండ్స్
సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేసినందుకు, వేతనాలు కటింగ్ చేసే అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం తక్షణమే ఆపాలి.
ఐసీడీఎస్లో కార్మిక హక్కులు కాపాడాలి. ప్రభుత్వం జారీచేసే సర్క్యులర్లులో కావాలని కొన్ని సంఘాల పేర్లను మాత్రమే పెడుతున్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వం తక్షణమే ఆపాలి. పెడితే అన్ని కార్మికసంఘాల పేర్లు పెట్టాలి లేదా సంఘాల పేర్లు పెట్టడం మానేయాలి.
అంగన్ వాడీ కేంద్రాలకే బియ్యాన్ని సప్లై చేయాలి. ఇప్పటివరకు అయిన ట్రాన్స్పోర్ట్ ఖర్చులను వెంటనే చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలతో సహా 8 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలి.
వేతనాలు ప్రతినెలా మొదటి వారంలోనే చెల్లించాలి. మెసేజ్లో వేతనం చెల్లించే నెల పేరును మెన్షన్ చేయాలి.
పెండింగ్లో ఉన్న 7 జతల యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలి. యూనిఫామ్ కలర్ మార్చలి. క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయాలి.
5 సంవత్సరాల బకాయి స్టేషనరీ డబ్బులు వెంటనే చెల్లించాలి.
5 సంవత్సరాల ఇన్ఛార్జ్ అలవెన్సులు వెంటనే చెల్లించాలి.
4 సంవత్సరాల బకాయి ఇంక్రిమెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలి.
శ్రీమంతాలకు ఒక్కప్రోగ్రామ్ ఖర్చులకు అయినంత ఖర్చులు చెల్లించాలి.
ఇతర ప్రోగ్రామ్ల ఖర్చులకు రూ.1,000/-లకు పైగా, అయినంత ఖర్చులు చెల్లించాలి.
అంగన్ వాడీ కేంద్రంలో చార్జ్ డిజైనింగ్ చేయడానికి ప్రతి సం|| రూ.2,000/-లకు పైగా అయినంత ఖర్చులు ఇవ్వాలి.
జనవరి 26, ఆగస్టు 15, జూన్ 2న జెండావిష్కరణ ఖర్చులకు డబ్బులు చెల్లించాలి.
అవసరమైన రిజిష్టర్లను వెంటనే సప్లై చేయాలి, జిరాక్సులకు డబ్బులు ఇవ్వాలి.
అంగన్ వాడీ కేంద్రాలకు స్టేషనరీ, అవసరమైన వంట పాత్రలు ఇవ్వాలి.
ఆరోగ్యలక్ష్మి మెనూ ఛార్జీలు పెంచాలి. డబుల్ సిలిండర్ ఇవ్వాలి.
అంగన్ వాడీలకు పనిభారాన్ని తగ్గించాలి. అదనపు పనులు చేయించకూడదు.
నాణ్యమైన పోషకాహారం సకాలంలో సప్లై చేయాలి.
పోషకాహారానికి లబ్దిదారుల ఆధార్ లింక్ను తొలగించాలి.
పోషకాహారాన్ని స్వచ్చంద సంస్థలకు అప్పగించకూడదు.
అంగన్ వాడీ సెంటర్లలోనే పోషకాహారాన్ని సప్లై చేయాలి.
అంగన్ వాడీ కేంద్రాలను క్లబ్ చేయకూడదు.
జీఓ నెం.14ను సవరించాలి. అంగన్ వాడీలకు సర్వీస్ రూల్స్ రూపొందించాలి.
జీఓ నెం.19ని సవరించాలి. గ్రాట్యుటీ పెంచాలి. పెన్షన్ నిర్ణయించాలి.
వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి.
గతంలో రద్దుచేసిన 12 జాతీయ సెలవులను పునరుద్ధరించాలి.
అంగన్ వాడీలకు ఆసరా, కళ్యాణలక్ష్మి పథకాలను వర్తింపజేయాలి.
ఉత్తమ అంగన్ వాడీల అవార్డుల్లో జరుగుతున్న అక్రమాలు అరికట్టాలి. అర్హులైన వారికే అవార్డులివ్వాలి. - సూపర్ వైజర్ల ఎగ్జామ్స్ వెంటనే నిర్వహించాలి.
మిగిలిన ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
అయాలకు వేతనం పెంచాలి, ప్రమోషన్ సౌకర్యం అమలుచేయాలి.
మినీ వర్కర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలి. ఆయాలను నియమించాలి.
అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇఎస్ఐ, ఉద్యోగభద్రత కల్పించాలి.
ఐసీడీఎస్లు సంస్థాగతం చేయాలి. నగదు బదిలీ, పోస్టాఫీసుల ద్వారా ఫుడ్ సప్లై నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.
Authorization