బీడీలు చుడితే తప్ప వారికి రోజు గడవదు. అలాంటి కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. కానీ వారికి కనీస వేతనాలు లేవు. ఉపాధి రక్షణ లేదు. వారి బతుక్కి భరోసా లేదు. ఇటు ప్రభుత్వం అటు కంపెనీ యాజమాన్యాల దోపిడికి గురౌతున్న బీడీ కార్మికులు ఎన్నో సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు.
బతికేందుకు మరో దారి లేక బీడీలు చుట్టుకుంటున్న ఆ కార్మికుల
సమస్యలు నేటి కొలువులో...
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొలువుతీరి ఐదేండ్లు దాటిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా కార్మికులకు ఏవేవో చేస్తామంటూ పబ్లిక్ మీటింగ్లో ఊదరగొట్టారు. కానీ బీడీ కార్మికుల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చేసిన అన్యాయాన్నే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాష్ట్రం వస్తే మా బతుకుల్లో మార్పువస్తదని ఆశించిన కార్మికుల ఆశలు ఆడిశల య్యాయి. కనీస వేతనాల జీ.వో41 అమలు కాకుండానే కాలపరిమితి ముగిసింది. తిరిగి పునరుద్దరణ చేయలేదు. రూ. 2016/- జీవనభృతికి అనేక షరతులు పెట్టి ఇంటికి ఒకటే పెన్షన్ అంటున్నారు. ఓపక్క పనిరోజులు తగ్గి పోయి మరోవైపు కనీస వేతనాలు అమలు కాక ఆర్ధికంగా బీడీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియస్ (సీఐటీయు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
సరిదిద్దే ప్రయత్నం లేదు
రాష్ట్రంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి 7 లక్షల మంది బీడీ కార్మికులు జీవిస్తున్నారు. ఇందులో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. నూటికి 90 శాతం మంది మహిళలకు బీడీలు చుట్టడం తప్ప మరొక బతుకుదెరువు లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీడీ కార్మికులకు కనీస వేతనాల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదు.
సమ్మె చేసిన ఫలితంగా...
బీడీ పరిశ్రమ, కనీస వేతనాల షెడ్యూల్డ్ పరిశ్రమ కిందకి వస్తుంది. ఇందులో అన్ని క్యాటగిరీ కార్మికులకు ఎంత వేతనం ఇవ్వాలనేది జీఓ ద్వారా నిర్ణయించాలి. ఇది బీడీ కార్మికులకు వున్న చట్టబద్ధమైన హక్కు. 2010 లో బీడీ కార్మిక సంఘాలన్ని (జెఏసి) ఆధ్వర్యంలో 32 రోజులు సమ్మె చేసిన ఫలితంగా 2011లో కనీస వేతనాల జీఓ నెం. 41 వచ్చింది. అప్పట్లో బీడీ కంపెనీల యాజ మాన్యాల ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల జి.ఓ.నెం. 41 అమలు కాకుండా జీఓ 81ని తెచ్చింది.
కాలపరిమితి ముగిసినా...
ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా జీఓ. 41ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని బీడీ కార్మికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఈ జి.ఓ. 41 ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడేదికాదు. జి.ఓ. అమలు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేసీఆర్ ప్రభుత్వం నుండి ఉలుకూ పలుకూ లేదు. చివరికి ఆ జీఓ అమలు కాకుండానే కాలపరిమితి (5సం||లు) ముగిసింది. దాని స్థానంలో మరొక కొత్త జీఓ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అయినప్పటికీ పాత జీఓ ను సవరించి కొత్త జీవో విడుదల చేయకపోవడం వల్ల బీడీ కార్మికుల బతుకులు దుర్భారంగా మారాయి.
పెరిగిపోతున్న దోపిడి
కనీస వేతనాల జీఓ 41 ప్రకారం కనీస వేతనం బేసిక్ 1000 బీడీలకీ రూ. 130/-లు. దీనికీ కరువు భత్యం వీడీఏ పాయింట్లతో కలుపుకుంటే రూ. 128/-, బేసిక్ విడిఏ కలుపుకుంటే 1000 బీడీలకు రూ.258/-లు ఇవ్వాలి. ప్రస్తుతం 1000 బీడీ లకు ఇస్తున్న వేతనం రూ.173/- దీని వల్ల ఒక కార్మికురాలు రోజుకు నష్టపోతున్న డబ్బు రూ. 85/-, నెలకు రూ. 2210/- సంవత్సరానికీ దీని ప్రకారం మొత్తం 7 లక్షలు. మొత్తం మీద బీడీలు చుట్టే కార్మికులు నష్టపోతున్న డబ్బు సుమారు రూ. 1856 కోట్లు. కనీస వేతనాల జీఓ విడుదల అయిన దగ్గర నుండి అమలు కానందువల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని తరగతుల బీడీ కార్మికులు నష్టపోయిన మొత్తం రూ.12వేల కోట్లు. కార్మికుల నుండి దోపిడీ చేసిన ఈ డబ్బంతా బీడీ కంపెనీల యజమా నులకు కోట్ల రూపాయలు మిగిల్చింది. ఇందులో పెద్ద వాటానే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయ కులకు కమీషన్ రూపంలో అందుతుంది. కార్మికులు, అందునా మహిళలు తమ రెక్కలు ముక్కలు చేసుకుని, తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి, చెమట చిందించి కష్టపడిన డబ్బును ఇంత దారుణంగా దోపిడి చేస్తున్నారు. బహుశా ఇంతటి దారుణమైన దోపిడీ ఏ రంగంలో వుండదేమో? బీడీ కార్మికుల నిరక్షరాస్యత, వెనుకబాటు తనాన్ని అడ్డం పెట్టుకొని ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగుతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించు కోకుండా వుండటం న్యాయమా? అని సీఐటీయూ ప్రశ్నిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీడీ కార్మికుల ఓట్లతో గెల్చిన ఎంఎల్ఎ, ఎంపీలు సిగ్గుపడాల్సిన విషయం ఇది.
జీవించే హక్కుపై దాడి చేయడమే
కనీస వేతనాల జీఓ అమలు చేయకపోవడం అంటే కార్మికుల హక్కులను కాలరాయటం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవించే హక్కుపై దాడిచేయటం. ఈ హక్కుల గురించి మాట్లాడకుండా బీడీ కార్మికులను ఆదుకుంటామని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని, జీవన భృతి రూ. 2016/-లు ఇస్తామని చెప్పి అనేక షరతులు పెట్టి ఇంటికి ఒక్కటే ఫించన్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్ గారి కుటుంబంలో ఎందరికైనా పదవులు ఉండవచ్చు. వారికి మాత్రం లక్షల్లో జీతాలిస్తరు. బీడీ కార్మికులకు మాత్రం ఇంటికి ఒక్కరికి మాత్రమే ఫించన్ ఇస్తారట! ఇదెక్కడీ న్యాయం? చట్టబద్ధమైన హక్కును అమలు చేయకుండా కార్మికులకు జీవన భృతి పేరుతో బిక్షం వేస్తామనటం అన్యాయం.
పోరు తప్ప మరోమార్గం లేదు
ప్రభుత్వం బీడీ కార్మికుల కనీస వేతనాలను సవరించుటకు ఇచ్చిన ముసాయిదా ప్రతిలో ప్రతిపాదించిన వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేవు. ఇప్పుడు ప్రభుత్వం పెంచినట్టు చెప్పుకుంటున్న రూ.2016/- పెన్షన్ కూడా ఇప్పటి వరకు అమలు కావడం లేదు. నిరంతరం పెరుగుతున్న ధరల వల్ల బీడీ కార్మికుల కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. కార్మికుల నిత్యవసర వస్తువుల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వేతనాలను వినిమయ ధరల సూచికి అనుగుణంగా సవరించడం లేదు. పని మాత్రం 12, 14 గంటలకు చేయవల్సి వస్తుంది. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన 7వ వేతన కమిషన్ 18 వేల కనీస వేతనం అమలు చేయాలని సిఫారసు చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు సైతం తీర్పు ఇచ్చింది. కానీ బీడీ కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఏండ్లు గడిచినా పాలకులు మారినా పాలించే వారి బుద్ధి మారటం లేదు. తీవ్ర దోపిడికి గురౌతున్న కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. అందుకే బీడీ కార్మికులంతా ఏకమై తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేంత వరకు యూనియన్ ఆధ్వర్యంలో మన పోరాటాన్ని కొనసాగించాలి.
- ఎస్.రమ, ప్రధానకార్యదర్శి
తెలంగాణ బీడీ డ సిగార్ వర్కర్స్ యూనియన్
డిమాండ్స్
- కనీస వేతనాల జీవోను వెంటనే విడుదల చేయాలి.
- నెలకు 26 రోజుల పని కల్పించాలి.
- వారంతపు సెలవులు ఇవ్వాలి.
- బీడీ కార్మికులకు కనీస వేతనం 18000/-లు నిర్ణయించాలి
- పీఎఫ్, ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
- ప్రభుత్వం ఇస్తున్న రూ.2016/- పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి.