మన ప్రభుత్వానికి ఆశాల సమస్యలు పరిష్కరించటానికి తీరిక లేదు. నెలల తరబడి పారితోషికాలు పెండింగ్లో ఉంటే అషా వర్కర్లు ఎలా బతుకుతారనే స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. జూన్ నాటికి ఐదు నెలల పారితోషికాలు పెండింగ్లో ఉంటే పోరాటం చేస్తేకానీ వాటిని విడుదల చేయలేదు. 'ఇచ్చేదే అతి తక్కువ. అది కూడా నెలల తరబడి పెండింగ్లో వుంటే ఎలా' అంటూ ఆశాలు ఆవేదన చెందుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు మన రాష్ట్రంలో కూడా తమకు ప్రభుత్వం పది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఐదు నెలల పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని పోరాటానికి సిద్ధం కానున్నారు.
ప్రస్తుతం 2019 ఏప్రిల్ నెల నుండి పారితోషికాలు పెండింగ్లో ఉంచారు. దాంతో మళ్ళీ పోరుకు సిద్ధం కాబోతున్నారు ఆశా వర్కర్లు. 2018 సెప్టెంబర్లో ఆసెంబ్లీని రద్దు చేసిన రోజు, ఆశాలకు 15వందల రూపాయలు పారితోషికాలు పెంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సమయానికి మాత్రం ఇవ్వడం లేదు. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. పైగా పారితోషికాలు లేని అదనపు పనులను వీరితో ప్రభుత్వం చేయిస్తున్నది. ఆశాల సమస్యల పట్ల ఇప్పటికే అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. ఆశాల సమస్యలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలి ఆందోన చేపట్టనున్నారు.
అప్పులు చేసి బతుకుతున్నారు
తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 2019 జూన్లో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు, ఛలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించగా స్పందించిన ప్రభుత్వం అప్పటి వరకు పెండింగ్లో ఉన్న పారితోషికాలను విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళీ ఐదు నెలల నుండి పెండింగ్లో ఉంచారు. దాంతో ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు. కుటుంబ అవసరాలతోపాటు, విధి నిర్వహణలో రోజువారీ ఖర్చుల కోసం ఆశాలు అప్పులు చేసి బతుకుతున్నారు. ఈ సమస్యలను ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. అయినా సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం అన్యాయం. తక్షణమే 5 నెలల పారితోషికాల బడ్జెట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
అదనపు పనులకు కూడా పారితోషికం ఇవ్వాలి
పారితోషికం లేని అనేక పనులను ప్రభుత్వం ఆశాలతో చేయిస్తున్నది. కంటి వెలుగు, పార్లమెంట్, అసెంబ్లీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పెంచ్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ డ్యూటీలు, ఎన్సీడీ సర్వే తదితర అనేక పనులను ఎలాంటి పారితోషికం ఇవ్వకుండానే ప్రభుత్వం ఆశాలతో చేయిస్తున్నది. అదనపు పనులకు పారితోషికాలు అడిగితే ఆశాలకు జీతాలు పెంచాము కాబట్టి అదనపు పనులకు డబ్బులు ఇచ్చేది లేదని అధికారులు అంటున్నారు. ఆశాలకు 7,500 రూపాయల పారితోషికంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఫిక్స్డ్ వేతనం కాదు. కేవలం పనిని బట్టి పారితోషికం మాత్రమే. దీని ప్రకారం 7,500 రూపాయలు అందరికీ రావు. మన రాష్ట్రంలో 7,500 రూపాయలు కేవలం 10 శాతం మంది ఆశాలకు మాత్రమే వస్తున్నాయి, మిగతా 90 శాతం మంది ఆశాలకు 3 వేలు ఆపైన వస్తున్నాయి. ఫిక్స్డ్ వేతనం, నిర్ణయించి, ఆశాలు చేసే పనుల బాజ్చార్ట్ను రూపొందించినప్పుడు అదనంగా డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అంటే అర్థం ఉంది. కానీ పనిని బట్టి పారితోషికాలు, అవి కూడా అతి తక్కువ డబ్బులు చెల్లిస్తూ, ఈ డబ్బులకే అన్ని పనులు చేయాలని చెప్పటం ఆశాలతో వెట్టిచాకిరి చేయించుకోవడమే. ఈ పద్ధతిని ప్రభుత్వం తక్షణమే ఉపసంహ రించుకోవాలి. అదనపు పనులకు, అదనపు పారితోషికాలు అమలు చేయాలి.
పోరు తప్ప మరో మార్గం లేదు
కార్మిక, ఉద్యోగ, ప్రజా సమస్యల చర్చను పక్కదారి పట్టించి, జాతీయవాదం, దేశభద్రత, మతం పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి, కేంద్రంలో రెండవసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత 5 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాల సవరణ, స్కీంలకు బడ్జెట్ తగ్గింపు, స్కీమ్ల ప్రైవేటీకరణ తదితర ప్రజావ్యతిరేక విధానాలను ఏ విధంగా అమలు చేసిందో మనం చూశాం. ఇప్పుడు ఈ విధానాలను మరింత వేగవంతంగా అమలు చేసే అవకాశం ఉంది. వీటికి వ్యతిరేకంగా ఆశా వర్కర్లు కార్మిక వర్గంతో కలిసి దేశ వ్యాప్తంగా పోరాడాలి.
హామీలను తుంగలో తొక్కి...
స్వయంగా ముఖ్యమంత్రే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఆరు వేల రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. తర్వాత ఇచ్చిన హమీని తుంగలో తొక్కి పనిని బట్టి పారితోషికాలు నిర్ణయం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరో 15 వందల రూపాయల పారితోషికం పెంచుతూ ప్రకటించారు. కానీ ప్రతినెల సక్రమంగా చెల్లించడం లేదు. స్కీంల ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు పోరాటాలకు సిద్ధం కావాలి.
డిమాండ్స్
- ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లు మన రాష్ట్రంలో కూడా ఆశాలకు ప్రభుత్వం 10 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి.
- 5 నెలలగా పెండింగ్లో ఉన్న పారితోషికాలు వెంటనే విడుదల చేయాలి.
- పారితోషికం లేని పనులు చేయించ కూడదు.
- జాబ్ చార్ట్ ఇవ్వాలి.
కార్యాచరణ
- సెప్టెంబర్ 3న ఆశా డే సందర్భంగా ధర్నా.
- మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు.
- సెప్టెంబర్ 9న ఎమ్మార్వోలకు వినతి పత్రాలు.
- సెప్టెంబర్ 12న డీఎంహెచ్ఓ, కలెక్టర్లకు వినతి పత్రాలు.
- 19, 20 తేదీలలో అన్ని మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు.
- 23న కలెక్టర్ ఆఫీస్ ముందు మహా ధర్నా.