రవాణా రంగాన్ని అభివృద్ధి చేస్తామంటూనే కార్మికుల నడ్డి విరుస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారిస్తామంటూనే వాహన దారులను జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సమస్యలను పక్కన పెట్టి విపరీతమైన పెనాల్టీలు, శిక్షలు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రవాణా రంగ కార్మికులు అంటున్నారు. అందుకే ప్రమాదకరమైన ఎం.వి యాక్ట్ వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
2014 సంవత్సరంలో ప్రారంభమైన రోడ్డు భద్రత బిల్లు 2019 జూలై 31న మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తమకున్న మందబలంతో ఆమోదించుకుంది. ఆగస్టు 8న రాష్ట్రపతి ఆమోదం పొంది సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాలేదు కానీ రానున్న కొద్ది కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.
'రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. లక్షలాది మంది కార్మికులు మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించడమే మా లక్ష్యం' అంటూ ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి. దానికి గల కారణాలు ఏంటి.. అనేది తెలుసుకోకుండా కేవలం డ్రైవర్లను నేరస్తులుగా చూపిస్తుంది ఈ చట్టం. ఇది చాలా పొరపాటు అనేక సర్వేలు చేసిన తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 శాతం ప్రమాదాలు మాత్రమే డ్రైవర్ల తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. 90 శాతం ప్రమాదాలు రోడ్డు నిర్మాణ లోపాల వల్ల జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి
చట్ట సవరణ ప్రకారం
ప్రమాదానికి రోడ్డు నిర్మాణ లోపాలు కారణమైనా డ్రైవర్కి లక్ష రూపాయల పెనాల్టీ. అదే మైనర్ వాహనం నడిపి ప్రమాదానికి గురైతే మూడు లక్షల జరిమానా, జైలు శిక్ష, వాహన లైసెన్సు రద్దు చేస్తారు. అంతేకాకుండా చిన్నచిన్న పొరపాట్లకు సిగల్ జంప్ చేస్తే 2000 రూపాయలు జరిమానా. లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు. హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానాలు వేస్తున్నారు. మరో ముఖ్యాంశం అగ్రి టెటార్స్ పేరా భారీ కంపెనీలను చట్టంలో చేర్చారు. దీనివల్ల రెండు, మూడు వాహనాలు ఉన్న ఆటో, టాక్సీ, లారీ యజమానులు వారి వాహనాలను కంపెనీలకు అప్పజెప్పి వారిచ్చే దయాదాక్షిణ్యాలతో బతకాలి. ప్రభుత్వ రవాణా శాఖను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పడం లాంటివి బిల్లులో చేర్చారు. ప్రమాదాలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే బిల్లులో ఇలాంటి ప్రతిపాదనలు ఎందుకు చేర్చారు.
దేశవ్యాప్త ఉద్యమం తప్పదు
కార్మికుల్ని ప్రజల్ని నమ్మించి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసమే మోటార్ వాహన చట్టంని తీసుకువచ్చింది. ఈ బిల్లు వల్ల సాధారణ ప్రజలపై, కార్మికులపై ఆర్థిక భారాలు పడడమే కాక వాహనాలన్నీ రోడ్లపైన కార్మికులు జైల్లో ఉండే పరిస్థితి వస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని స్తంభింపజేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బిల్లును ఉపసంహరించుకునేలా పోరాటం చేయడమే మార్గం.
అభివృద్ధి చేస్తామంటూనే...
భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టం ద్వారా కోట్లాది మంది స్వయం ఉపాధి పొందుతున్న రవాణా రంగ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రమాదాలను అరికడతాం రవాణా రంగాన్ని అభివృద్ధి చేస్తామంటూ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ బిల్లులో అలాంటి అంశాలు ఎక్కడ కూడా లేవు. పైగా భారీగా పెనాల్టీలు, జైలు శిక్షలు అమలు చేయడం ద్వారానే ప్రమాదాలను అరికట్టడం సాధ్యం అంటుంది. ఇది సరైన ఆలోచన కాదు. ప్రమాదాలకు కారణాలు రోడ్డు నిర్మాణ లోపాల వల్ల జరుగుతున్నాయి తప్ప కార్మిక తప్పిదాల వల్ల కాదని లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ చట్టం పేరుతో కార్మికుల నేరస్తులుగా చూపుతూ బిల్లును తీసుకు వచ్చింది.
జీవనోపాధి దెబ్బతింటుంది
విపరీతంగా పెనాల్టీలు పెంచడంతో ప్రజలు, కార్మికులు నెలంతా సంపాదించిన వేతనం జరిమానా పేరుతో ఒకే ఒక్కరోజులే అధికారులకు చెల్లించాల్సిన స్థితి వస్తుంది. దీంతో వారి జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా జైలు శిక్షలు అమలు చేయడంతో కార్మికులు జైలుకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇంతటి ప్రమాదకరమైన బిల్లును వెనక్కి తీసుకుని కార్మికులను కాపాడాలనీ, రవాణ రంగ కార్మికుల అభివృద్ధి కొరకు వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ సూచనలు అమలు చేయాలని కోరుతున్నారు.
డిమాండ్స్
1) మోటార్ వాహన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి.
2) రవాణా రంగ కార్మికులకు జాతీయస్థాయి సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలి
3) అసంఘటిత రంగంలోని రవాణా రంగ కార్మికులకు కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలి
4) ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలి
5) రవాణా రంగ కార్మికుల పేర్లు లేబర్ కమిషనర్ కార్యాలయంలో నమోదు చేయాలి
సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి
భవన నిర్మాణ కార్మికుల వలె ట్రన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏమీ లేదు. పైగా ఇప్పుడు ఎంవీ యాక్ట్ తీసుకువచ్చి రక్షణ పేరుతో విపరీతమైన చలానాలు వేస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ రోజంత కష్టపడితే వెయ్యి రూపాయలు కూడా సంపాదించలేడు. అందులో పెట్రోల్, డీజిల్కు సగం పోతుంది. ఇక చిన్న చిన్న కారణాలు చెప్పి ఫైన్లు వేస్తుంటే ఇక ఆ కుటుంబం ఎలా బతకాలి. మెట్రో స్టేషన్ వద్ద మెట్రో వాళ్ళే సొంతంగా కాబ్స్ పెట్టి నడిపిస్తున్నారు. అక్కడ వేరే కాబ్స్ వాళ్ళకు పార్కింగ్ ఉండదు. వాళ్ళ పార్కింగ్లో పెట్టినా నో పార్కింగ్ అని ఫైన్ కట్టించుకుంటున్నారు. అసలు ఈ ప్రైవేట్ క్యాబ్లను తొలగించి ప్రభుత్వమే ఓ యాప్ నడపాలి. అప్పుడు క్యాబ్, ఆటో డ్రైవర్లకు ఉపయోగంగా ఉంటుంది. ఎం.వి యాక్ట్ను తొలగించాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుల వలె వీరికి కూడా సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి.
- మల్లేష్, యూనియన్ సెక్రటరీ
గోల్నాక, రాంనగర్
ముందు రోడ్లు బాగుచేయండి
ఆటో డ్రైవర్లకు మీటర్ రేట్లు పెంచి పదేండ్లు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పెరగనే లేదు. కానీ పెట్రోల్, డీజీల్ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు రక్షణ పేరుతో విపరీతంగా చలానాలు వేస్తున్నారు. స్నిగల్స్ వ్యవస్థ సరిగా ఉండదు, రోడ్లు సక్రమంగా ఉండవు, ట్రాఫిక్ సరిగా ఉండదు. ఇవన్నీ సక్రమంగా లేకుండా కార్మికులకు ఫైన్లు వేస్తే రక్షణ ఎలా అవుతుంది. అలాగే అంబులెన్స్కు దారి ఇవ్వాలన్నారు. ఇది మంచిదే. ఇవ్వకపోతే పదివేలు ఫైన్ అంటున్నారు. మన దగ్గర రోడ్ల పరిస్థితి ఎలా ఉంది. ప్రత్యేక దారి ఏమైనా ఉందా? ఇవేవీ లేకుండా ఫైన్లు వేయడమంటే కార్మికుల కడుపు కొట్టడమే. అందుకే వీటన్నింటికీ వ్యతిరేకంగా సీఐటీయూగా కార్మికులంతా కలిసి పోరాటం చేస్తాం.
- బాబర్ఖాన్, యూనియన్ ప్రెసిడెంట్
హైదరాద్ సౌత్ జిల్లా
వి.వి గిరి సూచనలు అమలు చేయాలి
ఏఐఆర్టిడబ్ల్యూఎఫ్ పోరాట ఫలితంగా రవాణా రంగంలోని కార్మికుల స్థితిగతులపై వి. వి గిరి జాతీయ కార్మిక సంస్థ ఆధ్యయనం చేసి ప్రభుత్వానికి అనేక సూచనలతో కూడిన నివేదిక అందించింది. నివేదికలో కార్మికులకు జాతీయస్థాయిలో సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలి. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలి. ఈ విధంగా అనేక ప్రతిపాదనలు చేసింది. కానీ ప్రభుత్వం వీటన్నింటినీ పక్కన పెట్టి రవాణా కార్మికుల సమస్యలను మరింతగా పెంచే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నది. అందుకే కార్మికవర్గం తమ హక్కుల సాధనకు, ఉపాధి రక్షణకు పాలకవర్గాల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఇంతటి ప్రమాదకరమైన బిల్లును వెనక్కి తీసుకొని రవాణ రంగ కార్మికుల అభివృద్ధి కొరకు వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ సూచనలు అమలు చేయాలని 'తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్' (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపు నిస్తుంది.
- శ్రీకాంత్,
Authorization