ఆషా వర్కర్లు... ఎన్నో ఏండ్ల నుండి ప్రజలకు సేవలు చేస్తున్నారు. పేదలకు ప్రాథమిక ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. 'మీ సేవలతోనే మాతా శిశు మరణాల శాతం తగ్గింది'' అంటూ ఉపన్యాసాలు ఊదరగొడుతుంటారు. కానీ వీరి సమస్యలను మాత్రం పట్టించుకోరు. అందుకే తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆషా) యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో ఆషాలు మండలకేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. 23న కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలకు పిలుపునిచ్చిన వారి సమస్యల గురించి నేటి కొలువులో...
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆషాలకు ఫిక్స్డ్ వేతనాలు ఇస్తామని మాట ఇచ్చారు. కానీ మాట తప్పి పారితోషికాలనే చెల్లిస్తూ ఆషాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారితోషికాల పద్దతిని రద్దుచేసి, ఆషాలకు నెలకు రూ.10,000/-లు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆషాలకు నేటికీ పారితోషికాలే చెల్లిస్తుంది. ఈ పారితోషికాలు కూడా సగానికి తగ్గించి 5, 6 నెలలకొకసారి చెల్లిస్తున్నారు. పైగా పైసలిచ్చేటప్పుడేమో కేసులుంటేనే పైసలిస్తా మంటున్నారు. కానీ పని చెప్పేటప్పుడేమో పైసలు లేని, పారితోషికం రాని పనులు చేయిస్తున్నారు. పేరేమో పనిని బట్టి పారితోషికం. పని మాత్రం జీతాలు తీసుకునే కార్మికుల్లాగా ఉదయం నుండి రాత్రి వరకు రోజుకు 12, 13 గంటలు పని చేయిస్తున్నారు.
ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్లో ఆషాలకు రూ.10,000/-లు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 07-08-2019న జీఓ. ఎంఎస్. నెం.87ను జారీ చేసింది. ఎలాంటి షరతుల్లేకుండా ఆషాలందరికి రూ.10,000/-లు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తామని 26-08-2019న ఆషాలు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది. పక్క రాష్ట్రంలో తమ సోదరీమణులు ఫిక్స్డ్ వేతనం అందుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే, తెలంగాణలో నేటికీ ఫిక్స్డ్ వేతనం లేకపోవటంతో రాష్ట్రంలోని ఆషాలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు.
ఎన్ని సార్లు అడిగినా స్పందించని ప్రభుత్వం
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆషాలకు రూ.10,000/-లు ఫిక్స్డ్ వేతనం అమలుచేయాలి. ఆషాలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.18,000/-లు ఇవ్వాలని కోరుతూ 2015 సెప్టెంబర్ 2 నుండి డిసెంబర్ 16 వరకు 106 రోజులు ఆషాలు సమ్మె చేశారు. సమ్మె అనంతరం 18 నెలల తర్వాత తేది: 05-05-2017న ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటుచేసి ఆషాలకు రూ. 6,000/-ల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా కేవలం పారితోషికాలను మాత్రమే పెంచుతూ జీఓ నెం.167ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలని, ప్రకటించిన ఫిక్స్డ్ వేతనం రూ.6,000/-లు అయినా చెల్లించాలని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ప్రభుత్వం పరిష్కరించలేదు.
ఎన్నికల తర్వాత పరిస్థితి దారుణం
2018 సెప్టెంబర్లో అసెంబ్లీని రద్దుచేసిన రోజు ఆషాలకు మరో రూ.1,500/-లు పారితోషికాలు పెంచుతూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆషాలకు రూ. 7,500/-లు ఇస్తున్నామని ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఆషాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పారితోషికాలు సగానికి సగం తగ్గించి చెల్లిస్తున్నారు. ఇవి కూడా 5, 6 నెలలకొకసారి చెల్లించటంతో ఆషాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు. ఆషాలను వెట్టిచాకిరీకి గురిచేస్తున్న పారితోషికాల పద్దతిని ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని.
పారితోషికం లేని పనులు చేయించకూడదు
ఆషాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడం లేదు. కేవలం పనిని బట్టి పారితోషికాలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఆచరణలో దీనికి భిన్నంగా పారితోషికం లేని లెప్రసీ, టిబి, ఎన్గిడి సర్వేలు, కంటివెలుగు, ఎలక్షన్ డ్యూటీలు లాంటి అనేక పనులను ఉదయం 7 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు సమయమంటూ లేకుండా పని చేయిస్తున్నారు. వేతనం చెల్లించే కార్మికులకు చెప్పినట్లుగా రోజూ డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. ఒకవైపు పారితోషికం అంటూ, మరోవైపు జీతం చెల్లించే కార్మికులకు చెప్పినట్లు పని చెప్పడం అత్యంత దుర్మార్గం. ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. పారితోషికం లేని పనులు ఆషాలతో చేయించకూడదు. ఆషాలు ఏమేమి పనులు చేయాలో జాబ్ చార్ట్ ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి.
ప్రభుత్వం పెట్టిన భిక్ష కాదు
ఫిక్స్డ్ వేతనం సాధించుకోవాలంటే పోరాటమే మార్గం. ఆంధ్రప్రదేశ్లో అయినా ఆషాలకు రూ. 10,000/-లు ఫిక్స్డ్ వేతనం ప్రభుత్వం పెట్టిన భిక్ష కాదు. రాష్ట్రం విడిపోయిన నాటి నుండి పారితోషికాలు వద్దని, ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్లో ఆషాలు అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితంగానే అక్కడి ప్రభుత్వం వారికి ఫిక్స్డ్ వేతనం ప్రకటించింది. అయితే ఈ ప్రకటనకే అక్కడి ఆషాలు సంబర పడలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందా? లేదా ? అని ఆలోచించారు. వీళ్ళు ఆలోచించినట్లే అక్కడి ప్రభుత్వం ప్రకటించిన వేతనాన్ని పారితోషికాలకు లింకు పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే దీనికి వ్యతిరేకంగా ఎలాంటి షరతుల్లేకుండా ఫిక్స్డ్ వేతనం రూ.10,000/-లు చెల్లించాలని వేలాదిమందితో ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి పారితోషికాల పద్దతిని రద్దుచేసి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయించింది.
బలహీనతను అధిగమించాలి
మన రాష్ట్రంలో కూడా కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం చెల్లించాలని ఆషాలు 106 రోజులు సమ్మె చేశారు. తర్వాత బ స్వయంగా ముఖ్యమంత్రి గారే రూ. 6,000/-ల ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తామని ఆషాల సమావేశంలో ప్రకటించారు. కానీ తర్వాత దీనికి భిన్నంగా చెల్లించే డబ్బులను మళ్ళీ పారితోషికాలకే ముడి పెట్టారు. ఈ మోసాన్ని గమనించక ఆషాలు పోరాటంలో వెనుకబడ్డారు. అందుకే నేటికీ పారితోషికాలే వస్తున్నాయి. ఇప్పటికైనా ఆషాలు ఈ బలహీనతను అధిగమించాలి. ఆంధ్రప్రదేశ్లోని ఆషాలు వేతనం సాధించుకున్న పద్ధతిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా రూ.10,000/-ల ఫిక్స్డ్ వేతన సాధనకు రాష్ట్రంలోని ఆషాలందరూ పోరాటాలకు సిద్ధం కావాలి.
ఐక్యంగా పోరాడతాం
మా వనపర్తి జిల్లాలో 14 మండలాల్లో వందమంది ఆషాలు ఉన్నారు. ఒక్కరు కూడా డ్యూటీలకు వెళ్ళకుండా అందరూ ఐక్యంగా ఉన్నాము. గతంలో ప్రభుత్వం పిక్స్డ్ వేతనాలు ఇస్తామని మమ్మల్ని మోసం చేసింది. ఈసారి మా సమస్యలు పరిస్కరించే వరకు పిక్స్డ్ వేతనం అమలు చేసే వరకు మా పోరాటాన్ని ఆపేదే లేదు.
- సునీత, ఆషా వర్కర్
పరిష్కరించే వరకు ఆపాం
మా ములుగు పీహెచ్సీలో ఎంత మంది ఆషాలు ఉన్నారో అందరూ ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మా ఆందోళన సాగుతుంది. ఆంధ్రాలో ఇచ్చినట్లు ఫిక్స్డ్ వేతనాలు ఇచ్చే వరకు, హెల్త్కార్డులు ఇచ్చి, జాబ్ చార్టు నిర్ణయించే వరకు మా ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగిస్తాం.
- నీలా దేవి, ఆషావర్కర్
Authorization