Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాట్యం అంటే ఆమెకు ప్రాణం. తనకు ఎంతో నచ్చిన కళ అంతరించిపోకూడదనే తపన. తర్వాతి తరాలకు అందించాలనే కోరిక. అదే లక్ష్యంతో నిత్యం కృషి చేస్తున్నారు. ఎంతో మంది పిల్లలను నాట్యకారులుగా తీర్చిదిద్దుతున్నారు. బుడిబుడి అడుగులతో వారు చేసే నృత్యాన్ని చూసి ఆనందిస్తున్నారు. తన బిడ్డను కూడా ఓ నాట్యకారిణిగా మలుస్తున్నారు. అంతే కాదు కళనే నమ్ముకొని బతుకుతున్న వారికి కరోనా సమయంలో తనకు చేతనైన సాయం చేస్తున్నారు. ఆమే ప్రముఖ కూచిపూడి కళాకారిణి రాజనాల శ్రీదేవి. ఆమె నాట్యకళ గురించి మరిన్ని విశేషాలు...
నేను పుట్టింది ఏలూరు జిల్లాలో. పెరిగింది మాత్రం మిర్యాలగూడలో. మా నాన్న ప్రభాకరరావు, అమ్మ లక్ష్మీదేవి. నాన్న మంచి గాయకులు, తబలా వాయించేవారు. స్టేజ్ ప్రోగ్రామ్లకు బాగా చేసేవారు. చిన్నప్పుడు నాన్నతో పాటు నన్ను కూడా ప్రోగ్రామ్స్కు తీసుకెళ్ళేవారు. అలా స్టేజ్ అలవాటయింది. చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. బాగా చేస్తున్నానని అమ్మ ఎంతో ఆసక్తితో శిక్షణ ఇప్పించింది. డ్యాన్స్ నేర్చుకోడానికి చాలా కష్టపడ్డాను. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేదాన్ని.
కళకు సేవ చేయాలని
నా గురువులతో పాటు చాలా ప్రోగ్రామ్స్కు వెళ్ళే దాన్ని. పెద్ద పెద్ద కార్యక్రమాల్లో నృత్యం చేశాను. హైదరాబాద్ కోటీ దగ్గరలో ఉండే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో డ్యాన్స్కు సంబంధించిన కోర్సు చేశాను. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నా. మన తెలుగు రాష్ట్రంలో పుట్టిన కూచిపూడి కూడా నేర్చుకోవాలనుకున్నాను. ఎంతో ఇష్టంతో కూచిపూడి కూడా నేర్చుకున్నాను. కూచిపూడి ప్రాంతంలోనే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను. మన సొంత కళకు సేవ చేయొచ్చు అనే ఆలోచనతోనే కూచిపూడి నేర్చుకున్నాను. మన వాళ్ళకు కూచిపూడి అంటే ఎంతో అభిమానం.
తర్వాతి తరాలకు అందివ్వాలని
శిల్పారామం, ప్రభుత్వం తరపున జరిగే చాలా కార్యక్రమాలలో నృత్యం చేసేవాళ్ళం. అలాగే ఎన్నో దేవాలయాలలో కూడా నాట్యం చేశాను. ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చూసి చాలా మంది నేర్పించమని అడిగేవారు. నాకు వచ్చిన కళను తర్వాతి తరాలకు అందించాలనే ఉద్దేశంతో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. ఈ కళ మాతోనే అంతరించి పోకూడదు అనే కోరిక. అందుకే 2002 నుండి పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. ప్రస్తుతం 70, 80 మంది పిల్లలకు ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నా.
మాకంటూ ఓ వేదిక లేదు
కోవిడ్ 19 వల్ల లాక్డౌన్ విధించారు. వైరస్ రోజురోజుకు పెరిగిపోతుంది. దాంతో శిక్షణకు కాస్త ఇబ్బంది అయ్యింది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్లు పెడుతున్నాం. కూచిపూడిపైనే ఆధారపడి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు చూసి బాధగా అనిపించింది. కొంతమందికి సాయం కూడా చేశాము. ఈ కళనే నమ్ముకొని దీనిపై వచ్చే ఆదాయంతోనే ఆ కుటుంబాలు బతుకుతున్నాయి. బయటకు వచ్చి మా సమస్యలు చెప్పుకోవాలంటే మాకంటూ ఒక ప్లాట్ఫాం కావాలి. అలాంటి వేదికలేమీ మాకు లేవు. దాంతో మా సమస్యలు బయటకు రావడంలేదు. ఇలాంటి కష్టకాలంలో ఆదుకునే వాళ్ళు లేరు. అందుకే నాకు తెలిసిన కూచిపూడి టీచర్లకు చేతనైన సాయం చేస్తున్నా.
గర్వంగా ఉంది
మా అమ్మాయి నందిత లక్ష్మి. తను అడుగులు మొదలుపెట్టినప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకుంటుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్ట్ అందుకుంది. తను కూడా నా దగ్గరే నేర్చుకుంది. మూడో తరగతి నుండే ప్రోగ్రామ్స్ చేస్తుంది. అంత చిన్న వయసులో అంతమంది ప్రేక్షకుల ముందుకు రావడమంటే మామూలు విషయం కాదు. కానీ తను మాత్రం ధైర్యంగా చేసింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు సోలోగా, గ్రూపు షోలు కూడా ఎన్నో చేసింది. 'నాట్య కిన్నెర', 'నాట్య రత్న' అవార్డులు అందుకుంది. అన్నింటికంటే గొప్ప విషయం 2016లో మన ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ అవార్డుకు ఎంపిక అయ్యింది. అంత మంచి కళాకారిణికి గురువయినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. తను ఇలాగే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొని ఈ నాట్య కళను కొనసాగించాలని నా కోరిక.
నేర్పించడమే ఇష్టం
నాట్య కళకు మంచి ఆదరణ ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలని కోరుకుంటున్నారు. నా కెరీర్లో గానీ, చదువుకు గానీ, జ్ఞాపకశక్తికి గానీ, శారీరక వ్యాయామనికి గానీ, క్రమశిక్షణతో బతికేందుకు నాట్యం ఎంతో ఉపయోగపడింది. అలాగే పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాకుండా ఇలాంటి కళలను పరిచయం చేయడం వల్ల మానసికంగా వారి ఎదుగుదల బాగుంటుంది. అందుకే మా అమ్మాయికి నేను నాట్యం నేర్పించాను. మెదడు ఉత్సాహంగా ఉంటుంది. నలుగురితో ఎలా మెలగాలి, బయట సమాజంలో ఎలా బతకాలి అనేవి పిల్లలకు అలవడతాయి. ఒక పద్ధతిగా, విలువలతో కూడిన జీవితాన్ని పిల్లలు ఈ నృత్యం వల్ల జీవించగలుగుతారు. అందుకే పిల్లలకు నేర్పించడానికే ఇష్టపడతాను. కళ అంతరించకుండా కాపాడాలి. పిల్లల్ని ప్రోగ్రామ్స్కు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళను చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. అది చూస్తే మాలాంటి గురువులకు మరింత సంతోషం.