Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎంచుకున్న లక్ష్యం ఏదైనా.. కావాల్సింది కాస్తంతా కషి, పట్టుదల, ప్రోత్సాహం' అంటున్నారు సివిల్స్ విజేత పెద్దిటి ధాత్రి రెడ్డి. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈ విజయాలు తన ఖాతాలో పడ్డాయని గట్టిగా చెబుతున్న ఆమె ఇప్పటికే అనేక మైలు రాళ్లు దాటారు. గ్రామీణ వాతావరణంలో రైతు కుటుంబంలో పుట్టి ఐఐటీ ఖరగ్పూర్, టాప్లీడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వరకూ ప్రయాణించారు. ప్రతీ నెలా ఐదంకెల్లో జీతం. ప్రశాంతమైన జీవితం. కానీ అవేవీ ఆనందాన్ని ఇవ్వలేదు. సమాజంతో సంబంధాన్ని కలిగి, మనుషుల చిరునవ్వుల్లో తన సంతోషాన్ని వెతుక్కునేందుకే తిరిగొచ్చానంటున్న ఆమె గురించి నేటి మానవిలో...
ధాత్రి సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి. సరిగ్గా వంద గడపలు లేని ఆ ఊరి వైపు దేశం చూసేలా చూసిన పేరు ధాత్రి రెడ్డి. హైవేకు
కొద్ది దూరంలోనే ఉన్నా ఆ జిల్లా వారికి కూడా సరిగ్గా తెలియని గ్రామం ఇప్పుడు ఆమె సాధించిన సివిల్ ర్యాంకుతో హాట్టాపిక్గా మారిపోయింది. ధాత్రి పూర్వీకులు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. సొంతంగా ఎదగాలని భార్యా, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ చేరుకున్నారు ఆమె తండ్రి. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న పిల్లలు మరింత పైస్థాయిలో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాత్రి ఐఐటీ పూర్తి చేస్తే.. ఆమె సోదరుడు ప్రస్తుతం ఐఐటీ చదువుతున్నాడు.
ఐపీఎస్ అనుకుని.. ఐఏఎస్గా మారి..
సివిల్స్లో జాతీయ స్థాయిలో 46 వ ర్యాంకు సాధించడం వెనుక ఆసక్తికర కథనాన్ని వినిపిస్తున్నారు ధాత్రి. ఎన్నో ఏండ్లుగా అనుకుని కష్టపడితే ఈ స్థాయికి చేరుకోవడం సాధ్యకాదని అందరూ అనుకుంటారు. అయితే తాను అనుకునే లక్ష్యాన్ని చేరుకున్నాక కూడా వదిలి మళ్లీ ఐఏఎస్గా మారిపోయారు. చదువుకునే రోజుల్లో ఏమవుతావని ఎవరైనా అడిగితే తడుముకోకుండా ఐపీఎస్ అవుతానని చెప్పేవారు. ఎందుకంటే తనకు కిరణ్బేడి ఆదర్శమని, ఆమె వలే ఐపీఎస్ కావాలన్నదే తన లక్ష్యమని వివరించేవారు ఆమె. అయితే ధాత్రి చదవాలనుకున్నది మాత్రం ఐఐటీ. రెగ్యులర్ విద్యాభ్యాసం ఎలా చేసినా గ్రాడ్యూయేషన్ తర్వాతే కదా సివిల్స్ ఉండేది అంటుంది ఆమె. అనుకున్నట్టుగా ఖరగ్పూర్లో ఐఐటీ పూర్తి చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ సంస్థలో ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్గా పనిచేసింది. మొదటిసారి సివిల్స్ రాసినపుడు 233 వ ర్యాంకు సాధించిన ఆమె ప్రస్తుతం నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. ఐఏఎస్గా మారాలని మరోసారి సివిల్స్ రాయడంతో ఈ సారి 46వ ర్యాంకు వచ్చింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
సివిల్స్లో ర్యాంక్ సాధించిన ధాత్రి విజయం వెనుక ప్రధానపాత్ర పోషించింది తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించి తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్తారు ఆమె. చిన్నపుడు ధాత్రిని తల్లిదండ్రులు పాటలు, డ్యాన్స్ క్లాసుల శిక్షణ కోసం పంపించేవారు. అయితే అవేమీ ఆమెకు ఆసక్తి కలిగించలేదు. దీంతో కరాటే నేర్చుకోవాలన్న తన ఆసక్తిని తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకున్నారు. ఇక అప్పటినుంచి తనకు గుర్తున్నంతవరకూ మంచి విషయాల్లో అమ్మానాన్నలు తనను ఎప్పుడూ ప్రోత్సహించేవారని చెబుతున్నారు ధాత్రి.
అంత కష్టమేమీ కాదు..
సివిల్స్ సాధించడం అంత కష్టమైన పని కాదంటున్నారు ఈ ఆలిండియా ర్యాంకర్. అయితే నిర్ధిష్టమైన ప్రణాళిక, స్పష్టమైన అవగాహన తప్పనిసరిగా విజయంలో పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉన్నా కూడా సివిల్స్లో ర్యాంక్ కోసం కృషి చేశారు. గతంతో పోలిస్తే ఈ సారి అంత ఎక్కువగా చదవలేదు. సివిల్స్ కోసం జాబ్కు రాజీనామా చేసి ఏడాది పాటు కష్టపడ్డారు. ఆ సమయంలోనే సరైన నోట్స్ రాసుకుంటే అదే భవిష్యత్లో ఉపయోగ పడుతుందని ధాత్రి తన అనుభవాన్ని చెప్తున్నారు.
ఐఏఎస్గా నా బాధ్యత
చదువుకునే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉన్న ధాత్రి ఎన్జీఓలోనూ పనిచేశారు. 'ఫీడ్ ఇండియా' పేరుతో వథా చేస్తున్న ఆహార పదార్థాలను సేకరించి అవసరమైనవారికి చేరవేసేవారు. సివిల్స్లో సోషియాలజీని సబ్జెక్టుగా ఎంచుకున్న ఆమె ప్రస్తుత సామాజిక పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చానంటారు. 'మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోతూ వస్తోంది. విదేశాల్లో మాదిరిగా ఇక్కడ ఓల్డేజ్ హౌమ్స్ ఆ స్థాయిలో లేవు. దీంతో వీరి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. అలాగే సమాజంలో అన్ని మార్పులకు విద్య ప్రధాన కారణం. నా విధులతో పాటు విద్యపైనే నా దష్టి' అంటున్నారు ఆమె.