Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరికి నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు, మూడీగా అనిపించడం, చిరాకు వంటివన్నీ సహజం. వీటన్నింటినీ తగ్గించడానికి చాలామంది మందులు వాడుతూ ఉంటారు. కానీ ఇష్టమొచ్చినన్ని మందులు వేసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఓ మహిళ తన జీవితంలో అన్ని రోజులను కలుపుకుంటే కనీసం పది సంవత్సరాల సమయం పిరియడ్లోనే కొనసాగిస్తుంది. మరి ఆ పది సంవత్సరాలను అసౌకర్యంతో.. నొప్పితో గడపడం కంటే వివిధ ఇంటి చిట్కాల ద్వారా నొప్పితో పాటు ఇబ్బంది పెట్టే ఎన్నో సమస్యల నుంచి దూరం అవ్వొచ్చు...
చామంతి టీ : చామంతి టీ ఎన్నో అద్బుతాలు చేస్తుంది. ఇది పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పిని కూడా చాలా వరకూ తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ గుణాలు గర్భాశయ కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. నొప్పి, వాపు వంటివి కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం చేయాల్సిందల్లా మీరు ఉదయాన్నే తాగే టీ బదులుగా చామంతి పూలను తీసుకొని వాటి రెక్కలను తీసి శుభ్రం చేసి దాన్ని నీళ్లలో వేసి మరిగించాలి. అందులో కావాలంటే కాస్త తేనె చేర్చుకొని తాగడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
అల్లం నీళ్లు : అల్లం నీళ్లు తాగడం వల్ల వాంతులు, కళ్లు తిరగడం వంటివి తగ్గుతాయి. ఒక అంగుళం అల్లం ముక్కను నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లు చల్లబడిన తర్వాత తాగితే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో పాటు వాంతులు తగ్గుతాయి. ఇది పిరియడ్ సైకిల్ని రెగ్యులర్ చేస్తుంది. కేవలం పిరియడ్ సమయంలో మాత్రమే కాదు.. మామూలుగా కూడా అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు కడుపుబ్బరం తగ్గడం వంటి ఎన్నెన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి.
నువ్వుల నూనె : నువ్వుల నూనెలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించే గుణాలు చాలా ఉంటాయి. నువ్వుల నూనెతో పొట్టపై బాగా మసాజ్ చేసుకుంటే నొప్పి సులభంగా తగ్గుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం కూడా అందంగా మారు తుంది. మొటిమల వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
విటమిన్ డి: విటమిన్ డి ని రోజూ తీసుకోవడం వల్ల ప్రోస్టాగ్లాండ్లిన్ల ఉత్పత్తి తగ్గుతుంది. నొప్పులు కూడా తగ్గుతాయి. సాధారణంగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం కంటే చేపలు, గుడ్లు, ఛీజ్, నారింజ రసం వంటివాటి ద్వారా పొందవచ్చు. లేదా రోజూ ఉదయాన్నే ఎండలో నిలబడడం.. క్యాల్షియం ఎక్కువగా అందే పదార్థాలు తినడం వల్ల కూడా లభిస్తుంది.
మెంతులు: మెంతులను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే నొప్పి, అసౌకర్యం వంటివన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే మెంతుల్లో లైసిన్, ట్రిప్టోఫాన్ వంటి ప్రొటీన్లు ఉంటాయి కాబట్టి ఇవి మందులా పనిచేసి ఇబ్బందిని తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మరింత మంచిది.
పెప్పర్ మింట్ టీ : మిథనాల్ అనే గుణాలు ఉండడం వల్ల పెప్పర్ మింట్ టీ గ్యాస్ని తగ్గించడంలో చాలా వరకూ తోడ్పడుతుంది. అందుకే పిరియడ్ సమయంలో గ్యాస్ బారిన పడేవారు పెప్పర్ మింట్ టీ తాగడం వల్ల గ్యాస్తో పాటు ఒత్తిడి, అలసట కూడా తగ్గుతాయి.