Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఇంటి గడపదాటి బయటి ప్రపంచం లోకి అడుగుపెట్టి ఏండ్లు గడుస్తుంది. అప్పటి నుండి తమ లక్ష్యాలను చేరుకోడానికి ఎన్నో అడ్డంకులను అధిగమిస్తున్నారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ కొన్ని రంగాల్లో మహిళల సంఖ్య తక్కువే. అలాంటి చోట కూడా తామేంటో నిరూపించు కుంటున్నారు. మనదేశంలో ఉత్పాదక రంగం శ్రామిక శక్తిలో 20 శాతం మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి ఇది ఇతర ఆసియా దేశాల కంటే చాలా తక్కువ. ప్రస్తుతం అనేక సంస్థలు మహిళల శక్తిని గుర్తించి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయినా ఆల్ట్సోమ్ అనే సంస్థ నాలుగు ప్రధాన నగరాల్లోని తమ ఉత్పాదక సంస్థల్లో 18 శాతం మంది మహిళలను నియమించింది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లోనూ వారు అనేక సవాళ్లు ఎదుర్కొంటూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారిలో ఐదుగురు మహిళా ఇంజనీర్ల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం...
మీరా సిన్హా
పాట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ పూర్తి చేసి జూలై 2018లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా ఆల్స్టోమ్లో చేరారు మీరా సిన్హా. ఇరవై అయిదేండ్ల మీరా ప్రస్తుతం మాధేపురలోని ఆల్ట్సోమ్ సంస్థలో సీరియల్ టెస్ట్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. మీరా ప్రస్తుతం 40 మందితో కూడిన బందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో పని చేస్తున్న మొదటి మహిళ ఈమే కావడం గొప్ప విషయం.
ఇష్టమైనది కష్టంగా ఉండదు
''మొదటి నుంచీ, ప్రొడక్షన్, సోర్సింగ్ వంటి వివిధ విభాగాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఇది నాకు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయ పడింది. ప్రస్తుతం టెస్టింగ్ అండ్ కమీషనింగ్ విభాగంలో సీరియల్ టెస్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. ఇలాంటి విభాగంలో పని చేయడం, ఇతర మహిళా ఇంజనీర్లకు ప్రేరణగా పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇలాంటి చోట అవకావం కల్పిస్తే మహిళలు తమ శక్తిని చాటు కుంటారు. మొదటి నుండి ఇంజనీరింగ్ పట్ల నాకు మక్కువ ఎక్కువ. కాబట్టి ప్రస్తుతం నేను చేస్తున్న వృత్తి నాకు కష్టంగా అనిపించడం లేదు. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనే ధైర్యంగా ఎదుర్కొంటాను అనే నమ్మకం ఉంది. వాస్తవానికి ఈ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత చిన్న వయసులోనే చాలా కొత్త విషయాలు నేర్చుకోగలిగాను'' అంటున్నారు మీరా సిన్హా.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
ప్రస్తుతం షిఫ్టులలో పనిచేస్తున్న మీరా అంటున్నారు... కోవిడ్-19 ప్రభావంతో పనిలో లాక్డౌన్ కంటే ముందు ఉన్న వేగం తగ్గించింది. ''నెల రోజుల నుండి మళ్ళీ మా పనిని ప్రారంభించాం. పనిని వేగవంతం చేస్తే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాణిజ్య కార్యకలాపాల కోసం భారతీయ రైల్వేలకు ఆల్ట్సోమ్ సంస్థ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను సరఫరా చేయడం ప్రారంభించింది. కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని పనిప్రదేశంలో ఫేస్ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడకం వంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సంస్థ కూడా మా భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇబ్బంది పడుతున్న విషయం ఏమిటంటే కరోనా వల్ల గతంలో వలే తరచూ ఇంటికి వెళ్ళలేను. అదొక్కటే కాస్త కష్టంగా అనిపిస్తుంది'' అంటున్నారు ఆమె.
విశాఖ చౌదరి
23 ఏండ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన విశాఖ చౌదరి కోల్కతలోని ఎన్సిఆర్ కో-ఆర్డినేటర్, ఎస్ఐపి క్వాలిటీ కీ యూజర్ పని చేస్తున్నారు. అలహాబాద్లోని ఎంఎన్ఐటి నుండి చదువు పూర్తి చేసిన ఈమె గత ఏడాది ఆల్ట్సోమ్లో చేరారు. ''ఇది నా మొదటి ఉద్యోగం. ఆల్ట్సోమ్లో భాగమైనందుకు గర్వపడుతున్నా. మూడు నెలల ట్రైనింగ్ తరువాత ఇండిస్టీయల్ క్వాలిటీ టీంలో చేరాను. సైట్ క్వాలిటీ జీఎస్ఐ (గ్లోబల్ సింగిల్ ఇన్స్టాన్స్) కీ యూజర్గా మొదటి బాధ్యత అప్పగించారు. తర్వాత కోల్కతాలోని ఆల్ట్సోమ్కి ఎన్సిఆర్ కోఆర్డినేటర్, ఎస్ఏపీ క్వాలిటీ కీ యూజర్గా మారాను. కోల్కతా సైట్లో మొదటి మహిళా ఉద్యోగిగా పనిచేయడం చాలా గర్వంగా ఉంది. నిరంతరం నేర్చుకోవటానికి, నన్ను నేను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సంస్థలో ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాను'' అంటున్నారు విశాఖ.
ఆమె అతిపెద్ద విజయాలలో ఒకటి.. ఆమె పనిచేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్. కోల్కతా ప్లాంట్లో విజయవంతమైన జీఎస్ఐ అమలు, ఆటో క్వాలిటీ మ్యాట్రిక్స్ విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఐశ్వర్య ప్రతాప్ సింహా
శ్రీ సిటీలో టెస్టింగ్ అండ్ కమీషనింగ్ ఇంజనీర్గా పని చేస్తున్నారు ఈమె. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన ఐశ్వర్య ఆల్ట్సోమ్లో చేరారు. ఆమె మూడేండ్లుగా టెస్టింగ్ అండ్ కమీషనింగ్ విభాగంలో పని చేస్తున్నారు. దీనిని ఆమె గొప్ప అభ్యాస కేంద్రంగా చెప్పుకుంటారు. ఇప్పటివరకు ఐశ్వర్య మూడు ప్రాజెక్టులలో పనిచేశారు. రాత్రి షిఫ్టులు చేయడం తప్ప అంతకు మించి పెద్ద సవాలును ఎదుర్కోలేదని అమె అంటారు.
టీం వర్క్ వల్ల ఎంతో ఉపయోగం
''కొన్ని సంవత్సరాల కిందట చెన్నై మెట్రోలో ప్రయాణించడానికి మా తాతయ్య, మామయ్యను తీసుకొని వెళ్ళినప్పుడు ఈ రైలు తయారీలోనే నా భవిష్యత్ ఉందని చెప్పాను. అంతకు ముందు వారు మెట్రోను చూడలేదు. వారి మనవరాలు అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం అవుతుందని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు వారి ముఖంలోని ఆనందం అమూల్యమైనది. నా కుటుంబ సభ్యులు నన్ను చూసి గర్వపడుతున్నారు. ఇది నాకు మొదటి విజయం. మేము ఇక్కడ ఓ బృందంగా పని చేస్తాం. టీం వర్క్ మాకెంతో ఉపయోగపడుతుంది. ఒకరినొకరు సహకరించడానికి, విభిన్న ఆలోచనలపై పనిచేయడానికీ, వేరే వాళ్ళ పని విధానాన్ని తెలుసుకోవడానికి మాకు అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అందరితో కలిసి పనిచేసేటప్పుడు ఆ అనుభవాల్లో ఎన్నో నేర్చుకోగలుగుతాము'' అంటున్నారు ఐశ్వర్య.
రమ్య పెచిముత్తు
కోయంబత్తూర్లో ఇండిస్టియల్ క్వాలిటీ ఇంజనీర్గా పని చేస్తున్నారు రమ్య. 2013లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ పూర్తి చేసిన ఈమె 2014లో ఆల్ట్సోమ్ సంస్థలోని తయారీ విభాగంలో ట్రైనీగా చేరారు. శిక్షణ తర్వాత సీఎంఆర్ఎల్, కేఎంఆర్ఎల్ ప్రాజెక్టులలో పనిచేశారు. తరువాత 2016లో ఇండిస్టియల్ క్వాలిటీ విభాగానికి ఇంజనీర్గా వెళ్లారు. ఆ విభాగంలో క్యాబినెట్ల నాణ్యతా తనిఖీ, ఉత్పత్తి శ్రేణిలో నాణ్యమైన యానిమేషన్లు, కస్టమర్ల నిర్వహణతో పాటు నిరంతర వాటిలో వస్తున్న మార్పులను చూసుకోవడం ఆమె బాధ్యత.
గౌరవాన్ని పొందుతున్నాను
''ఇండిస్టియల్ క్వాలిటీ ఇంజనీర్గా ఉత్పత్తి తనిఖీలు, అంతర్గత ఆడిట్లు, కస్టమర్ల నిర్వహణకు బాధ్యత వహించే క్రాస్ ఫంక్షనల్ టీంతో నేను పని చేస్తాను. నేను ట్రామ్ ట్రైన్ న్యూ జనరేషన్ ప్రాజెక్టులో పనిచేయడం ప్రారంభించి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇది ఎంతో ప్రాధాన్యంతో కూడుకున్న బాధ్యత. ప్రస్తుతానికి క్రాస్ ఫంక్షనల్ మెటియరల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు, క్యాబినెట్లకు నేను మాత్రమే బాధ్యత వహిస్తాను. ఇంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఓ మహిళగా టీం సభ్యులందరితో కలిసి పని చేయడం నా బాధ్యత. పని చేస్తున్న చోట ఎప్పుడూ వివక్షను ఎదుర్కోలేదు. పైగా నాతో పని చేసే వారి నుండి ఎంతో గౌరవాన్ని పొందుతున్నాను. నా టీం సభ్యుల మద్దతుతో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాను. వారి సహకారం వల్లనే ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా రోజువారీ కార్యకలాపాల మాదిరిగానే చిన్నవిగా కనిపిస్తాయి'' అంటున్నారు రమ్య.
లాక్డౌన్ తర్వాత తిరిగి పనిని ప్రారంభించినప్పుడు వారి భద్రత, ఆరోగ్యం కోసం సంస్థ తీసుకున్న విస్తతమైన చర్యలపై ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ఇది తనకు ఎంతో తోడ్పడుతుందని అంటున్నారు.
శ్రిష్టి గుప్తా
2018లో ఎన్ఐటి కురుక్షేత్రంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్న సమయంలో ఆల్ట్సోమ్ యంగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి ఎంపికయ్యారు. ఈవిధంగా 24 ఏండ్ల శ్రిష్టి గుప్తా సహారన్పూర్లోని ఫ్లీట్ పెర్ఫార్మెన్స్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు.
ఎంతో ప్రోత్సహించారు
''నేను సహారన్పూర్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఆ ప్రాజెక్ట్ ముగింపు దశలో చేరాను. అప్పుడు అక్కడ 40-45 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మా అందరికీ అది కొత్త అనుభవం. ప్రాజెక్ట్ ముగిసే సరికి మేమంతా ఎంతో అనుభవం గడించాం. మా టీంలో మేము ఐదుగురు మహిళలు మాత్రమే ఉన్నాము. మమ్మల్ని సంస్థ ఎప్పుడూ వివక్షతో చూడలేదు. పైగా మా అభివృద్దికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. చదువు పూర్తి చేసిన తర్వాత వెంటనే ఇందులోనే చేరాను. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఇక్కడ ఓ మంచి వాతావరణం వుంది. అద్భుతమైన ప్రతిభావంతులైన నిర్వాహకుల మధ్య పని చేయగలుగుతున్నారు. తోటి ఇంజనీర్లు, సహచరుల నుండి చాలా నేర్చుకున్నా'' అంటున్నారు శ్రిష్ట.