Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నలతో తయారు చేసిన పదార్థాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. బరువు పెరగకుండా ఉండాలనుకునే వారికి జొన్నలు మంచి ఎంపిక. అయితే చాలామంచి జొన్నపిండిని కేవలం రొట్టెలకే పరిమితం చేస్తుంటారు. జొన్నరెట్టెలు కొందరికి అస్సలు నచ్చవు. కాస్త ప్రయత్నిస్తే జొన్నలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. రుచిగా తినొచ్చు... వాటిలో కొన్ని ఈ రోజు నేర్చుకుందాం...
దోశ
కావల్సిన పదార్థాలు: జొన్నపిండి - రెండు కప్పులు, బియ్యప్పిండి - అరకప్పు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు - ముప్పావుకప్పు, పచ్చిమిర్చి ముక్కలు - కొన్ని, జీలకర్ర - అరచెంచా, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - అరకప్పు.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో జొన్నపిండి, బియ్యప్పిండీ, తగినంత ఉప్పు తీసుకుని నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ ముక్కలూ, పచ్చిమిర్చి ముక్కలూ, జీలకర్ర, కొత్తిమీర తరుగూ వేసుకుని బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. తర్వాత పెనం వేడిచేసి అరచెంచా నూనె రాసి ఈ పిండిని దోశలా వేసుకోవాలి. మళ్లీ కొద్దిగా నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని కొబ్బరి లేదా అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
జొన్న చుడువా
కావలసిన పదార్ధాలు: జొన్న అటుకులు - 1 కప్పు, జీలకర్ర - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూను, నూనె - 3 టీ స్పూన్లు, సెనగ పప్పు - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, పల్లీలు - 1 టేబుల్ స్పూను, ఎండు మిర్చి - 3, కొత్తిమీర తరుగు - 1 టీ స్పూను, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
జొన్నల కార బూందీ
కావలసిన పదార్ధాలు: జొన్న పిండి - 1 కప్పు, జీడిపప్పులు - 10 గ్రా, గోధుమ పిండి / సెనగ పిండి - 1 కప్పుకి కొద్దిగా తక్కువ, కారం - 1 టీ స్పూను, నూనె - తగినంత, నీళ్లు - తగినన్ని, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి లేదా సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద వెడల్పాటి బాండీలో నెయ్యి వేసి వేడిచేయాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక సర్వింగ్ చీసుకోని తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు.
లడ్డూ
కావల్సిన పదార్థాలు: జొన్నపిండి - కప్పు, చక్కెర పొడి - కప్పు, ఎండుకొబ్బరిపొడి - అరకప్పు, యాలకుల పొడి - అరకప్పు, నెయ్యి - రెండు మూడు చెంచాలు, కిస్మిస్, జీడిపప్పు పలుకులు - కొన్ని, గోరువెచ్చని పాలు - అరకప్పు.
తయారు చేసే విధానం: బాణలిలో చెంచా నెయ్యి కరిగించి కిస్మిస్, జీడిపప్పు పలుకుల్ని వేయించుకుని తీసి పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిని కరిగించి అందులో జొన్నపిండిని వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు పలుకులూ, చక్కెర పొడీ, యాలకుల పొడీ, కొబ్బరి పొడీ వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత పాలు చల్లుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి చూడ్డానికి రవ్వలడ్డూలా ఉంటాయి. కొన్ని రోజులు నిల్వ ఉంటాయి.