Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నొక్కిచెప్పిన సర్వేలు
కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హౌం... అనే మాట వినడానికి ఎంత అందంగా ఉందో కదా.. కానీ వాస్తవానికి ఇది కుటుంబాలలో కనిపించని కల్లోలాన్ని రేపుతోంది. ప్రత్యేకించి మహిళల జీవితాలపై మరింత భారం మోపుతోంది. ఈ విషయాన్ని అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ రంగానికే పరిమితమైన వర్క్ ఫ్రం హౌం ఇప్పుడు అనేక రంగాలకు విస్తరిస్తున్నది. ఆయా రంగాల్లో ఉన్న వర్కింగ్ ఉమెన్ అనుభవాలతో పాటు ఇటీవల విడుదలైన ఓ సర్వే ఫలితాలను ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
కరోనా -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో పనిచేసే మహిళల్లో దాదాపు 50 శాతం మంది తీవ్రమైన ఒత్తిడికి గురౌతున్నారని ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ నిర్వహించిన ఓ సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో శ్రామిక మహిళలు తమ మానసిక శక్తిని ఈ మహమ్మారి కారణంగా నష్టపోతున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 47 శాతం మంది ఈ మహమ్మారి కారణంగా ఎక్కువ ఒత్తిడి లేదా ఆందోళనను ఎదుర్కొంటున్నారని లింక్డ్ఇన్ తెలిపింది. పురుషుల్లో ఈ సంఖ్య 38 శాతం మాత్రమే ఉంది.
అసమాన ప్రభావం
సర్వే ప్రకారం ఈ విపత్కర సమయం మహిళలపై అసమాన ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశంలో 2,254 మంది నిపుణుల సర్వే ఆధారంగా జూలై 27 నుండి ఆగస్టు 23 వరకు సమచారాన్ని సేకరించారు. ఇంటి నుండి పని చేసే తల్లులు, శ్రామిక మహిళలపై మహమ్మారి ప్రభావంతో పాటు వ్యక్తిగత ఆర్థిక, వత్తిపరమైన అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇందులో తెలియజేశారు. అదే విధంగా మహమ్మారి సమయంలో పిల్లల సంరక్షణ, సవాళ్లను కూడా ఈ సర్వే నొక్కిచెప్పింది. సర్వేలో పాల్గొన్న ముగ్గురు (31 శాతం) పని చేసే తల్లులు ప్రస్తుతం పిల్లల సంరక్షణను పూర్తి సమయం అందిస్తున్నారని తెలిపింది. అదే మగవారి విషయానికి వస్తే ఐదుగురిలో ఒకరు (17 శాతం) మాత్రం పని చేసే తండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నట్టు సర్వే తెలిపింది.
పనిపై దృష్టిపెట్టలేకపోతున్నారు
బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఐదుగురిలో (44 శాతం) పని చేసే తల్లులు పిల్లల సంరక్షణ కోసం పని గంటలను తగ్గించుకోవల్సి వస్తుందని తెలియజేశారు. అదే మగవారిలో చూస్తే ఈ శాతం 25 శాతం మాత్రమే ఉందని తెలిపారు. 46 శాతం మంది పని చేసే తల్లులు ఆఫీస్ పని కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని నివేదించారు. అలాగే 42 శాతం మంది మహిళలు ఇంట్లో పిల్లలతో కలిసి వుండడంతో పని పై దష్టి పెట్టలేకపోతున్నారని తెలిపింది. ఇక ఆర్థిక విషయానికి వస్తే నలుగురిలో ఒకరు తాము సంపాదించిన ఆదాయం (25 శాతం), వ్యక్తిగత పొదుపులు (27 శాతం), ముగ్గురిలో ఒకరు (31 శాతం) వారి పెట్టుబడుల సంఖ్య మరో ఆరు నెలల్లో పెరిగే అవకాశం ఉందని ఆశావాహాన్ని వ్యక్తం చేశారు.
ఒత్తిడి తీవ్రంగా పెరిగింది
శ్రీలక్ష్మి (ఫోరం ఫర్ ఐటి ప్రొఫెషనల్స్) మాట్లాడుతూ 'వ్యక్తిగత జీవితానికి వృత్తి జీవితానికి తేడా ఉండటం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయితే పని ఒత్తిడి మరీ ఎక్కువ. ఇద్దరూ ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ కూడా పాపకు టైం కేటాయించలేక పోతున్నాం ఫ్యామిలీ టైం మిస్ అవుతున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొ||రమాదేవి మాట్లాడుతూ 'డిజిటల్ డివైడ్ ఉంటున్నది. ఫోన్ లేనివారు అప్పు చేసి మరీ కొంటున్నారు. నెట్వర్క్, సిగెల్ సమస్యలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక పక్క ఎకడమిక్ షెడ్యూల్ దెబ్బ తినకూడదు. దీంతో చాలా ఒత్తిడికి గురౌతున్నాం' అంటున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న సిహెచ్. విజయ మాట్లాడుతూ 'ప్రస్తుత పరిస్థితులు వర్కింగ్ ఉమెన్కి మరింత భారంగా మారిపోయాయి. హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే సరిపోతుంది, అది లేకపోతే కష్టంగానే ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి. మహిళలు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి' అంటున్నారు.
మహిళలపైనే తీవ్ర ప్రభావం - వసంత అర్జున్, మేనేజర్, ఐటీ
లాక్నాటి నుండే దాదాపు అన్ని ఐటీ కంపెనీలు వర్క్ఫ్రం హోం అవకాశం కల్పించాయి. ఇంట్లో సిస్టమ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుండి ఇంటర్నెట్ బిల్స్ కూడా కొంతమంది పే చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇంట్లో ఉండి పని చేయడంతో ఎప్పుడూ పని చేస్తున్న భావనే ఉంటుంది. ఆఫీసులో అయితే కాఫీ కోసం బ్రేక్ తీసుకోవచ్చు. కానీ ఇంట్లో తిండి కూడా వర్క్ టేబుల్పైనే చేస్తున్నట్టు వుంటుంది. అన్నీ ఫోన్లోనే కావడంతో ఎక్కువ సేపు కూర్చోనే వుండాలి. దాంతో అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఒకపక్క ఆన్లైన్ మీటింగ్, ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ వంటివి జరుగుతుంటాయి. మరోపక్క పిల్లలు ఏడుస్తుంటారు. ఇలాంటి సమస్యలు మా స్నేహితుల నుండి వింటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటే మహిళలకు కొంత భారం తగ్గుతుంది. కొన్ని రంగాలలో పని చేస్తున్న మహిళలు అప్పటి వరకు ఉన్న ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయారు. కరోనా నుండి బయటపడాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గింది. దాంతో మహిళలపైన హింస కూడా పెరిగింది.
మేనేజ్ చేయడం కష్టంగా వుంది - మంజు, ఐటీ ఉద్యోగి
ఇంటినుండే వర్క్ చేస్తుండడంతో ట్రావెల్ టైం లేదు కదా అని వర్క్ లోడ్ పెంచుతున్నారు. పని గంటలకు కూడా పెరిగాయి. ఈ మహమ్మారిని కారణంగా చూపిస్తూ కంపెనీలు తమ ఆదాయం తగ్గిపోయిందని జీతాలు తగ్గించేశారు. పెంపుదల అసలే లేదు. వారాంతరాలలో కూడా వర్క్ ఉంటుంది. పని పెరిగింది కానీ దానికి తగ్గట్టు జీతం మాత్రం పెంచడం లేదు. ఒకపక్క పిల్లల్ని ఆన్లైన్ క్లాసులకు అటెండ్ చేయిస్తూ, హెల్పర్ లేకుండా ఇంటిని మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది.
ఉన్న వర్క్కే టైం చాలటం లేదు- సాహితీ, ఐటీ ఉద్యోగి ;స్వేచ్ఛ(ఫ్రీ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్)
కరోనా కాలంలో వర్క్ లోడ్ బాగా పెరిగింది. 13 నుంచి 16 గంటల పని చేయాల్సి వస్తుంది. ఉదయం ఎనిమిది గంటలకి లాగిన్ అయితే రాత్రి 11:30 అవుతుంది వర్క్ పూర్తి కావటానికి. అదనపు పనికి అదనపు అలవెన్సులు లేవు. షిఫ్ట్ అలవెన్సులు అడిగితే జాబ్స్ సెక్యూరిటీ లేదు. ఉన్న వర్క్కే టైం చాలకపోతే... 'కొత్తగా ఇన్నోవేటివ్గా కంపెనీ కోసం ఏం చేస్తున్నావు' అని అడుగుతున్నారు. ప్రమోషన్స్ ఆపేస్తున్నారు
బాధ్యతలు మరింత పెరిగాయి- ప్రవల్లిక, ఐటీ ఉద్యోగి
మామూలు రోజుల్లోనే మహిళలకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మహమ్మారి కాలంలో ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంది. ఇంట్లో ఉండి కూడా కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నారు చాలా మంది. వాళ్లకు ఆరోగ్యం బాగోలేకున్నా చూసుకోలేని పరిస్థితి. వారాంతరాల్లో కూడా పిల్లల దగ్గరికి రావడం లేదు. నైట్ కాల్స్ కచ్చితంగా అటెండ్ చేయాల్సి వస్తున్నది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది జాబ్ వదిలేస్తున్నారు. పనిగంటలు తగ్గించాలి. కొంత వెసులుబాటు ఇవ్వాలి.
Half the sky half the earth
ఎక్కువగా ఆశించకూడదు - వనిత, అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. మామూలు కంటే కూడా ప్రిపరేషన్ ఎక్కువ కావాలి. గతంలో లాగా షెడ్యూల్ లేదు, మీటింగ్స్ టైమింగ్స్ ఉండటం లేదు. ఈ విషయంలో యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలి. వర్కింగ్ డేస్లోనే మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం జాబ్స్ సెక్యూరిటీ ఉండాలి. అలాగే కుటుంబం నుంచి సహకారం ఉండాలి. ఇంట్లో ఉంటున్నాము కదా అని మరీ ఎక్కువ ఆశించకూడదు. దీని వల్ల పని భారం మరింత పెరుగుతుంది. ఇదే మరింత సమస్యలకు దారితీస్తుంది.
గుర్తించి అరికట్టకపోతే...- అమ్మాజి, సైకాలజిస్ట్.
సాధారణంగానే మగవారితో పోల్చితే ఆడవారిలోనే మానసిక సమస్యలు ఎక్కువని నిపు ణులు చెబుతున్నారు. మగవారిలో మానసిక ఒత్తిడికి గురయ్యేవారి శాతం 34 ఉంటే, ఆడవారిలో 57 శాతంగా గుర్తించబడింది. ఈ మహమ్మారి కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో 60 శాతానికి పైగా మగవాళ్ళకి వంటగది అంటేనే తెలీదు. అంటే కుటుంబంలో వారి పాత్ర కేవలం సంపాదన వరకే పరిమితం అవుతోంది. దానివల్ల ఆడవాళ్ళపైనే భారం పెరుగుతోంది. ఆఫీసు పనితో పాటుగా ఇంటిపని, వంటపని, పిల్లల సంరక్షణ, పిల్లల ఆన్లైన్ క్లాసులకు వాళ్ళకి అవసరమైన గైడెన్స్ ఇవ్వాల్సిరావడం, దానికి తోడు ఇంట్లో పెద్ద వాళ్ళ సంరక్షణ బాధ్యత ఇవన్నీ కూడా ఆడవాళ్ళల్లో మానసిక, శారీరక ఒత్తిడిని పెంచుతున్నాయి. అంటే ఏకకాలంలో ఎన్నో బాధ్యతలు మహిళలు నిర్వర్తించాల్సి వస్తుంది. దానికి తోడు మహమ్మారి వల్ల పనిగంటలు, పని ఒత్తిడి కూడా పెరిగింది. పనిలో ఏ చిన్నపొరపాటు జరిగినా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం వుంటుందో, పోతుందో అని మరోపక్క టెన్షన్. ఇంత కష్టపడ్డా అటు ఆఫీసులో గానీ, ఇటు కుటుంబంలోగానీ సరైన సహకారం లేకపోవడం వారిని మరింత మానసికంగా కుంగదీస్తుంది. స్త్రీలకు ఉన్న మరో సమస్య ప్రతినెలా వచ్చే పిరియడ్స్. సహజంగానే ఆ సమయంలో హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల కొంత మానసిక, శారీరక ఒత్తిడికి గురౌతుంటారు. దానికి తోడు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కలిసి ఒత్తిడి మరింత పెరిగి మానసిక రుగ్మతలకి దారితీస్తుంది. ఇదే పరిస్థితి గర్భతులలో కూడా వుంటుంది. ఇవన్నీ మగవారికి వుండే సమస్యలు కావు. నిజానికి ప్రెగెన్సీ టైంలో స్త్రీలు మంచి ఆహారం తీసుకుంటూ, మానసికంగా, శారీరకంగా విశ్రాంతి పొందాలి. కానీ ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఆ అవకాశం వుండదు. దాని ప్రభావం డెలివరీ తర్వాత చాలా తీవ్రంగా వుంటుంది. సహజంగానే కొందరు ఆడవాళ్ళు డెలివరీ తర్వాత కొంత ఒత్తిడికి గురౌతుంటారు. అది కూడా హార్మోన్స్కి సంబంధించినవే. దాని తీవ్రతని తగ్గించుకోవాలంటే గర్భిణిగా వున్నప్పుడు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి చాలా అవసరం. కానీ ఈ మహమ్మారి వల్ల పని ఒత్తిడి పెరిగిపోయి విపరీతమైన మానసిక సమస్యలకు గురౌతున్నారు. ఇక మహమ్మారి వల్ల ఉద్యోగం పోయిన భర్తల వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళ కోపమంతా ఇంట్లో భార్య మీద చూపిస్తారు. ఈ కారణాల వల్ల స్త్రీలు ఓసీడీ, తీవ్ర ఒత్తిడి వంటి మానసిక రుగ్మతలకు గురౌతున్నారు. వీటిని మొదట్లోనే గుర్తించి అరికట్టకపోతే స్కిజో ఫ్రేనియా, ఆల్జైమర్స్ వంటి తీవ్రమైన రుగ్మతలకు దారితీసే అవకాశం వుంది.
- సలీమ, అనిల