Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్త్రీలు తమ లక్ష్యాలను సాధించుకోవాలంటే కొన్ని యుక్తులు నేర్చుకోవాలి. ఓర్పు, చాకచక్యం, తెలివీ, మేధా కలిగి పురుషుడెప్పుడూ తనమీద ఆధారపడేలా చేసుకోవాలి. అతని షర్టు గుండీలు కుడుతూ కులకాలి. రొట్టెలు చేస్తూనే చివరి శ్వాస విడవాలి. నౌకర్లతో అయ్యే చిన్న చిన్న పనులు కూడా స్వయంగా చేయాలి. అమ్మ చెప్పే స్త్రీత్వం ఒట్టి బూటకం. పిరికితనం. అలసత్వం. కాపట్యం. మోసపూరిత పనులు నాకు నచ్చవు.' ఈ మాటల్లోని విశ్వాసం, ఆలోచనల్లోని స్పష్టత చూసి ఇదేదో ఈమధ్య కాలంలో రాసిన మాటలు అనుకునే అవకాశాలు ఉన్నాయి కదూ! ఎంతమాత్రమూ కాదు. ఉర్దూ సాహిత్యంలో ప్రఖ్యాత రచయిత్రిగా కీర్తిప్రతిష్టలు పొందిన ఇస్మత్ చుగ్తారు అభిప్రాయం. ఇవి మాత్రమే కాదు...
పై వ్యాఖ్యలు చేసిన కాలం బ్రిటిషర్లు మనలను ఏలుతున్నప్పటి నుంచి స్వాతంత్య్రం వచ్చే సమయం నాటికి. ఆ తరువాత మరికొద్ది కాలం కావొచ్చు. 1930-1940ల నాటి కాలం అంటే ఆడవారికి పల్లెత్తు మాట అనే స్వేచ్ఛ లేని రోజులు. కనీసం కుటుంబంలోని పురుషులతోనైనా సమానంగా చర్చించే అర్హతలేని రోజుల్లో ఇస్మత్ చుగ్తారు ఇటువంటి బలమైన వ్యాఖ్యలు చేయగలిగారు. సామాజిక అసమానతల ఆడవారిపై జరిగే అన్యాయాలను ఎంతో సున్నితంగా పాఠకుల మెదళ్ళలోకి చొప్పించి ఆలోచనల్లోకి నెట్టగల సామర్థ్యం ఉన్న రచయిత్రి ఆమె. అప్పటి గొప్ప రచయితలుగా పేరొందిన సాదత్ హసన్ మంటో, కిషన్ చందర్, అహ్మద్ అలీ, రాజేందర్ సింగ్ బేడి, అహ్మద్ నదీమ్ ఖాసిం తదితర రచయితల సరసన ఇస్మత్ చుగ్తారు పేరు కూడా నమోదవుతూ ఉంటుంది. ఈ పేరు రావడంకోసం ఆమె ఎంతో కష్టపడ్డారని 'ఇస్మత్ చుగ్తారు కథలు'లోని ముందుమాటలో చెబుతారామె. 'జీవన యాత్రలో ముళ్ళూ పూలూ' శీర్షికన రాసిన ముందుమాట కూడా ఆమె రాసిన కథలంత ఆసక్తిగా ఉంది. భావాలు, అక్షరాలతో ఆమె విన్యాసం చేశారని చెప్పవచ్చు.
మన చుట్టూ తిరుగాడుతాయి
ఉర్దూ భాషలో సాగిన ఆమె రచనలు తెలుగు పాఠకులకు చేరాలంటే ముందుగా మరో మాధ్యమంలోకి అనువదితమై ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇస్మత్ చుగ్తారు రచనలను ఎక్కువగా పాకిస్తాన్కు చెందిన రచయిత్రి తాహిరా నఖ్వీ ఆంగ్లంలోకి అనువదించారు. ఆ అనువాదాన్ని ఇటీవలే అనువాదం విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న పి.సత్యవతి తెలుగులోకి అనువదించి ఇస్మత్ను తెలుగు పాఠకులకు చేరువ చేశారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన రచయిత్రి కావడంతో అక్కడి కుటుంబాల సామాజిక సాంస్కృతిక జీవితాలను సునాయాసంగా ఆవిష్కరించారు. కానీ భారత దేశంలోని ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ సాధారణంగా ఉండే సంఘర్షణలు, సంక్షోభాలు ఈ కథల్లో కనిపిస్తుంటాయి. ప్రతి పాత్రా మన కుటుంబంలోని వ్యక్తినో, మన పొరుగింట్లో ఉండే పెద్దమ్మగానో మన చుట్టూ తిరుగాడుతుంటుంది.
అసమానతలను ఎత్తిచూపారు
ఈమె రాసిన కథను చదవడం మనం ప్రారంభించినప్పటికీ కథల్లోని పాత్రలన్నీ సినిమాలోని దృశ్యాల రూపంలో మనలను అలుముకుని, మనమూ ఆ కథలోని ఒక పాత్రగా రూపొందుతాము. అంతేకాదు ఆ పాత్రల స్వరూప స్వభావాలను మనమూ అంచ నావేసేందుకు ప్రయత్నిస్తూ చివరిదాకా సాగు తూపోతాము. అయితే కథను చదివి పక్కన పెట్టిన తరువాత కూడా ఆ కథ తాలూకు ఆలోచనలు వెంటా డుతుం టాయి. వాక్స్వాతంత్య్రం ఉందని చెప్పుకుంటూనే ఎన్నో అంశాలను చర్చిం చేందుకు జంకుతున్న నేటి కాలా నికి భిన్నంగా ఎన్నో లోపాలను, అసమానతలను కథల ద్వారా ఎత్తి చూపారు.
స్త్రీలపై జరుగుతున్న హింసను, అన్యాయాలను వ్యతిరేకిం చారు. 1944లో ఆమె రచించిన 'లిహాఫ్' కథ సంచలనమైంది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు స్త్రీల గురించిన కథ కావడంతో ఆమెకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కథలో ఎక్కడా అశ్లీలమైన పదజాలం లేదని గుర్తించి కేసు కొట్టి వేసారు.
సహజ పరిమళంతో...
ప్రస్తుతం తెలుగు పాఠకులకు అందుబాటులో ఉన్న పుస్తకం 'ఇస్మత్ చుగ్తారు కథలు'. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచు రించిన ఈ పుస్తకంలో మొత్తం పదిహేను కథలు ఉన్నాయి. ప్రతి కథా దేనికదే కథలకు ఉండే సహజ పరిమళంతో రూపుదిద్దుకుని ఉన్నాయి. 'ఎంతటి నిష్ణాతు లైనా మూల కథలోని సౌంద ర్యాన్ని, పరిమళాన్నీ నూటికి నూరుపాళ్ళు పట్టు కోలేరు' అని ఈ కథలన్నింటినీ అనువదించిన సత్యవతి తన అభిప్రాయాన్ని వెలి బుచ్చారు. కథలు చదువు తున్నా కొద్దీ ఇస్మత్ చుగ్తారు రచనా కౌశలమే మనకు కనిపిస్తుంది తప్ప ఎక్కడా అది అనువాద కథ అనే ఆలోచన రానివ్వదు. ఇది సత్యవతి ప్రతిభ.
దేనికదే వెంటాడుతూంటుంది
ఈ పుస్తకంలో ఇంకా పుట్టుమచ్చ, మేలి ముసుగు, దేవుడి దయ, ఒక ముద్ద, చేతులు, చిన్నక్క, పవిత్ర కర్తవ్యం, అమృతలత, గరళం.. తది తర కథలు ఉన్నాయి. ప్రతి కథా దేనికదే వెంటాడుతూం టుంది. 'స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ, సంప్రదాయాలూ, పితృ స్వామ్యమూ కలిసి కట్టుగా సృష్టించిన విధ్వంసం ఈ కథల నిండా పరుచుకుని ఉంది' అంటారు తెలుగు అనువాదకురాలు పి.సత్యవతి. ఇంకా 'అంతా చదివేసి పక్కన పెట్టేసి, హాయిగా ఉండడం కుదరదు. బేగమ్ జాన్, కుబ్రా తల్లి, ఆమె చెల్లీ, రుఖ్సానా, హలీమా, గోరీబీ, సరళాబెన్, బిచ్చూ అత్తయ్య, వదిన, షబ్నమ్, ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్... అంతా చాలాకాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు' అని స్వీయ అనుభవాన్ని రాసారు.
కుటుంబంలోని సంఘటనలే
తన పెద్ద కూతురికి వరుణ్ణి వెతకడానికి ఎన్నో పాట్లు పడే కుబ్రా తల్లి కథ 'చౌతీ కా జోడా'. భర్త క్షయ వ్యాధితో చనిపోగా, ఇద్దరు ఆడపిల్లల ఆలనాపాలనా చూసు కుంటున్న నిరుపేద తల్లి తన బాధ్యతలు ఎలా తీర్చుకోగలిగిందనే ఇతివృత్తంతో రాసిన కథ గుండెలను పిండేస్తుంది. తన అన్నతో ఎప్పుడూ పోట్లాడే చెల్లెలు కథ 'బిచ్చూ అత్తయ్య'. ఒక స్త్రీ జీవిత కాలం తన పుట్టింటి వారిని ఎందుకు ద్వేషిస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ. ఆమె కుటుంబంలోని సంఘటనలనే కథగా మలిచారు.
పురుషుల దాష్టికాలను ఎండగట్టారు..
తాననుకున్న విషయాన్ని అక్షరీకరించడంలో వెనుకంజ వేయలేదు ఇస్మత్ చుగ్తారు. సొంత ఇంటిలో జరుగుతున్న అన్యాయాలను చాలామంది దాచినట్లు ఆమె మరుగుపరచలేదు. ఆమె అన్నయ్య భార్య అంటే వదినకు జరిగిన అన్యాయాన్ని కథ(శిల)లా మలిచి పురుషుల దాష్టీకాలను ఎండగట్టారామె. నవాబుల ఇళ్ళలో దాసీలుగా పని చేసే ఆడవారి దయనీయ స్థితిని 'అలముకున్న పరిమళం' కథతో కళ్ళకు కట్టారు. కల్లూ మరో కథ. నిండా ఏడేండ్లయినా లేని ఒక బాలుడు మరో నవాబుల ఇళ్ళలో పనివాడు. ఆ ఇంటిలో తన ఈడు పిల్లలు బడికి వెళ్తుంటే తాను వారికి కావాల్సిన యూనిఫామ్, బూట్లు, సాక్సులతోపాటు ఆహారం అందిస్తూ ఉంటాడు. కడుపుకింత తినడానికైనా సమయం ఉండదు ఆ బాలుడికి. అలా మగ్గిన బాలుడు కల్లూ అనుకోని పరిస్థితుల్లో తల్లి వెంట తన వూరికి వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళ తరువాత ప్రభుత్వాధికారి హౌదాలో తాను బాల్యంలో పని చేసిన ప్రాంతానికే వెళతాడు. అప్పుడు తనతో సేవలు పొందిన తన తోటి బాలల్లో ఒకరిని కల్లూకి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటుంది ఆ పిల్లల తల్లి. అంటే కల్లూ పూర్వపు యజమానురాలు. ఇలా అసమానతలను ఎంతో చాకచక్యంగా కథలుగా మలిచిన ప్రతిభాశాలి ఆమె.
ఏకైక గొంతు
'స్త్రీలు సామాజికంగానూ సాహిత్యపరంగానూ శృంఖలాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కాలంలో వినపడిన ఏకైక గొంతు ఇస్మత్ చుగ్తారు' అంటూ ప్రఖ్యాత ఉర్దూ సాహిత్య విమర్శకుడు ఎహతేషామ్ హుస్సైన్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు, ఇస్మత్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన తాహిరా నఖ్వీ. 'ఆ కాలంలో స్త్రీలపై సామాజికంగా జరుగుతున్న అణచివేత, దానికి వ్యతిరేకంగా వారి పోరాటం, స్త్రీల మనస్తత్వం, వారికే స్వంతమైన అనుభూతులు ఆమె కథావస్తువులు. ఇంత సంవేదనతో స్పృహతో పఠనీయత చెడకుండా రచనలు చేసిన రచయిత్రులు అరుదేమో' అని ఆమె తన అభిప్రాయాన్ని రాసారు. ఇస్మత్ చుగ్తారు అద్భుతమైన కథలు మాత్రమే కాదు. మరెన్నో నవలలు, నవలికలు, నాటికలు రచించారు. కొన్ని సినిమాలకు కథలను అందించారు. ఈమె 1915 ఆగస్టు 15న ఉత్తర ప్రదేశ్లోని బుడావ్లో జన్మించారు. 1991లో మరణించారు.
పుస్తకం గురించి :
పేరు : ఇస్మత్ చుగ్తారు కథలు
రచయిత్రి: ఇస్మత్ చుగ్తారు
అనువాదకురాలు : పి.సత్యవతి
ప్రచురణ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్
లభించు స్థలం : అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో
వెల: రూ.100/-
- నస్రీన్ ఖాన్, 9652432981