Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొబైల్ ఫోన్ నేటి జీవన విధానంలో ఒక భాగమైంది. మొబైల్ ఫోన్లను ఇప్పుడు నిత్యావసర వస్తువులుగానే చూస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్లో స్మార్ట్ ఫోన్ లేని జీవితాలను ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ స్మార్ట్ ఫోన్లపై అతిగా ఆధారపడుతున్నామని చాలామంది గుర్తించరు. దీని మితిమీరిన వాడకం వల్ల తలనొప్పి, కంటి సమస్యలు ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యాలను కూడా ప్రభావితం చేస్తాయి.
క్రిములకు ఆవాసం : మొబైల్ ఫోన్ తెరపై అనారోగ్యానికి గురిచేసే అనేక సూక్ష్మక్రిములు ఉంటాయి. 2001లో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దాని ప్రకారం యుకేలో ఉన్న ప్రతి 6 మొబైల్ ఫోన్లలో ఒకదానిపై మలంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్టు తేల్చారు. టాయిలెట్కు వెళ్లిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోవడంతో ప్రమాదకర ఈ-కోలీ బ్యాక్టీరియా చేతుల ద్వారా ఫోన్పై చేరుతుందని వారు వివరించారు. ఇది విరేచనాలు, జ్వరాలను కలగజేస్తుంది. హెల్త్ కేర్ వర్కర్ల ఫోన్లపై ఇలాంటి ప్రమాదకర సూక్షజీవులు ఉన్నట్లు మరో అధ్యయనం తెలిపింది.
నిద్రలేమి : మన శరీరానికి ప్రత్యేకమైన జీవ గడియారం ఉంటుంది. దాని ప్రకారమే మనం రాత్రి నిద్రపోతాం. ఉదయం మేల్కొంటాం. మెలటోనిన్ అనే హార్మోన్ ఈ స్లీప్ సైకిల్ను నియంత్రిస్తుంది. మనం వాడే స్మార్ట్ ఫోన్లు ప్రమాదకరమైన బ్లూ లైట్ను విడుదల చేస్తాయి. ఫోన్ అతిగా వినియోగిస్తే, బ్లూ లైట్ కారణంగా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నిద్రలేమి ఎదురవ్వొచ్చు.
మెడ, వెన్నెముక సమస్యలు : మొబైల్ ఫోన్ మితిమీరిన వాడకం వల్ల మనకు తెలియకుండానే మెడ, వెన్నెముక ప్రభావితమవుతాయి. ఫోన్ల వల్ల మెడ, వెన్నెముకకు అయ్యే గాయాలను 'టెక్స్ట్ నెక్' అంటున్నారు. చాలాసేపు కదలకుండా ఒకేదగ్గర కూర్చోవడం వల్ల ఇవి ఎదురవుతాయి. మన వెన్నెముక సగటున 4.5 నుంచి 5 కిలోగ్రాముల బరువును మోస్తుంది. ఫోన్ వాడుతున్నప్పుడు అదేపనిగా తల వంచి, ముందుకు వంగి ఉండటం వల్ల వెన్నెముకపై ఒత్తిడి ఐదు రెట్లు పెరుగుతుంది. దీంతో మెడ, వెన్నెముకకు గాయాలు అయ్యే అవకాశం ఉంది.
కంటి సమస్యలు : ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక కంటి సమస్య. దీని కారణంగా కండ్లు పొడిబారటం, ఎరుపుగా మారడం, దురద, మంటతో పాటు కండ్లు మసకబారినట్లు కనిపిస్తాయి. దీంతో కొంత దూరంలో ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించవు. దీని కారణంగా మెడ, భుజాల నొప్పి కూడా రావొచ్చు.
వేళ్లకు గాయాలు : కొంతమంది స్మార్ట్ ఫోన్లలో అదేపనిగా ఆటలు ఆడతారు. మరి కొంతమంది కొన్ని గంటల పాటు చాటింగ్ చేస్తూ కూర్చుంటారు. దీంతో చేతి వేళ్లు ఒత్తిడికి గురవుతాయి. ముఖ్యంగా బొటనవేలు, చూపుడు వేళ్లకు ఒత్తిడి కారణంగా గాయాలయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా వాపు, జాయింట్ల మధ్యలో మంట వంటివి ఎదురుకావొచ్చు. మణికట్టు, ముంజేతుల నొప్పి, అరచేతులు తిమ్మిరి పట్టడం వంటి సమస్యలు రావొచ్చు. అందుకే ఫోన్లను వాడేవారు నిర్ణీత సమయం మించి వాడకూడదనే నియమం పెట్టుకోవాలి.