Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువుకోవాలనే కోరిక వుండి ఆర్థికంగా వెనకబడిన పేద పిల్లలకు చదువు చెప్పించేందుకు ఆమె ముందుకు వచ్చారు. ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన దేశ గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దీని కోసం తన సోదరుడు విజరు శేఖర్ సహకారం తీసుకుంటున్నారు. ఆమే ఉమా పాథక్.. చదువులకు దూరమవుతున్న పిల్లలకు విద్యను అందిస్తూ వారికి బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు. ఆమె గురించి మరిన్ని వివరాలు ఈ రోజు మానవిలో...
ఉత్తర్ ప్రదేశ్లోని అలీగ ప్రాంతానికి చెందిన ఉమా నలుగురు తోబుట్టువులలో అందరికంటే పెద్దది. ఆమె తండ్రి ఓ పాఠశాలకు ప్రిన్సిపాల్గా పని చేసేవారు. దాంతో చిన్నతనం నుండి విద్య ప్రాధాన్యతను గుర్తిస్తూ పెరిగారు. సరైన విద్యా అవకాశాలు లేక తన చుట్టూ ఉండే పిల్లలు ఎంతగా ఇబ్బంది పడ్డారో కళ్ళారా చూశారు. దేశ అభివృద్ధిలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది అని ఆమె గట్టి నమ్మకం. మన దేశంలో యువత ముందుకు వెళ్ళాలంటే అత్యంత ముఖ్యమైన సాధనాల్లో విద్య కూడా ఒకటి. ఈ ఆలోచనే ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. అందుకే చదువుకోవాలని తపించే పేద విద్యార్థులకు సాయం చేయడం తన నైతిక బాధ్యతగా భావించారు.
ఎస్ పిఎస్ ఫౌండేషన్ ద్వారా
కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందిన తర్వాత నగంలోని ఒక పాఠశాలలో ఉచితంగా పాఠాలు బోధించడం మొదలుపెట్టారు. 2018 లో ఆమె తన జీవితాన్ని విద్య కోసం అంకితం చేశారు. పేదలరికంతో బాధ పడుతున్న పిల్లల జీవితాల్లో విద్యను అందించి వారి కళ్ళల్లో వెలుగు చూడాలనుకున్నారు. ఆ లక్ష్యం తోనే తన తండ్రి పేరుతో ఎస్పిఎస్ అనే ఫౌండేషన్ని స్థాపించారు. ఈ ఫౌండే షన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు విద్య, ఆహారం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత లాంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలోనే తను కూడా వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు.
అమ్మాయిలకు చదువుపై...
తమ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యపట్ల అవగాహన కల్పించడమే కాకుండా అలీగ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను మంచి వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించే విధంగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆమెకు తమ్ముడు విజరు శేఖర్ ఆర్థికంగా నిధులు సమకూరుస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విద్యపై ఆమె అత్యంత శ్రద్ధ పెడతారు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు ఇంటర్ వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ చేయాలంటే గ్రామాలను వదిలి నగరాలకు వెళ్ళాల్సి వస్తుంది. అలాటప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిలను నగరాలకు పంపించేందుకు భయపడతారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత ఆడపిల్లలు ఉన్నత చదువులకు దూరమైపోతున్నారు.
విద్యా వ్యవస్థలో మార్పు వచ్చే వరకు...
ఉన్నత చదువులకు దూరమవుతున్న ఆడపిల్లలను ప్రస్తుతం తన ఫౌండేషన్ ద్వారా నగరాలకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నత విద్యావ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని ఉమా భావిస్తున్నారు. 'గ్రామీణ ప్రాంతాలలోనే కళాశాలలు ఏర్పాటు చేస్తే నగరాలకు వెళ్ళాల్సిన అవసరం వుండదు. అమ్మాయిల విద్యకు ఏర్పడుతున్న ఆటంకాలకు ఇదే శాశ్వితమైన పరిష్కారం. అప్పుడే సమస్య మూలాల నుండి పరిష్కారమవుతుంది. అమ్మాయిలు తమ అభిరుచులను కొనసాగించాలి. కళాశాలల్లో ఉన్నత చదువులు చదవాలనే వారి కోరిక తీరాలి. దీనికి దూరం, ప్రాంతం లాంటివి అడ్డంకిగా ఉండకూడదు. అలాంటి రోజు వచ్చే వరకు నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను' అంటారు ఉమా.
ఎలాంటి మార్పూ లేదు
అమ్మాయిలను విద్యావంతు లుగా తీర్చిదిద్దడంలో, వారి జీవి తాల్లో వెలుగులు నింపడంలో ఉమా చొరవ ప్రశంసనీయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత అవసరం కూడా. ఎందుకంటే పిల్లల హక్కుల పరిరక్షణ కోసం పని చేసే నేషనల్ కమిషన్ 2018లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం 15 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలికలలో దాదాపు 40 శాతం మంది పాఠశాలలకు హాజరు కావడం లేదని, వారిలో దాదాపు 65 శాతం మంది ఇంటి పనులకే పరిమితమవుతున్నారని వెల్లడించింది. మరో అధ్యయనం ప్రకారం భారతదేశ జీడీపీలో 18 శాతం మాత్రమే మహిళల శ్రమ ఉంది. అలాగే భారతదేశ శ్రామికశక్తిలో 25 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ప్రధాని 'బేటీ బచావో, బేటీ పఢావో' అనే నినాదం ద్వారా అమ్మాయిల విద్య కోసం పెద్ద ఎత్తున ముందుకు వచ్చినా ఈ సంఖ్యలో ఎలాంటి మార్పూ రాలేదు. ఈ సంఖ్యలను మార్చాలని ఉమా కోరుకుంటునన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ మంది మహిళ లను భారతదేశ ఆర్థికవ్యవస్థ పరిధిలోకి తీసుకు రావాలని ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు.
విద్యే ఏకైక మార్గం
ప్రస్తుతం అమ్మాయిల విద్య పట్ల కొంత వరకు అవగాహన మారుతోంది. చాలా మంది తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను ఉన్నత చదువుల కోసం నగరాలకు పంపించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రత్యే కంగా ఉమా ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ఓ మహిళ తమ ఆడపిల్లలను సురక్షితంగా చూసుకో గలదు అనే నమ్మకం వచ్చింది. వారి బిడ్డల ఎదుగు దలకు భరోసా దొరికినందుకు ఆనందిస్తున్నారు. ఇలా ఎంతో మంది యువతకు ప్రేరణగా ఉన్న ఆమె ఏమం టారంటే 'విద్య యువత సాధించాల్సిన విజయానికి కీలకం మాత్రమే కాదు, పేదరికం నుండి బయటపడేందుకు ఏకైక మార్గం' అంటారు.
కరోనా యోధులకు సహకారంగా
ఆమె సేవలను కేవలం విద్యకే పరిమితం చేయలేదు. కరోనా కాలంలో పేదలకు సాయం చేయడం కూడా తన కర్తవ్యంగా భావించారు. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన లాక్డౌన్ సమయంలో ఆమె తన తమ్ముడు విశాల్ శేఖర్ శర్మ సహాయంతో ఉత్తర ప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మహారాష్ట్రలోని ఆర్థికంగా వెనుకబడిన వేలాది మందికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. అలాగే తమ సొంత గ్రామాలకు చేరేందుకు కాలినడక బయలుదేరిన వలస కార్మికులకు వేల సంఖ్యలో మంచినీళ్ళ బాటిళ్ళు, భోజనం, ఆహార ప్యాకెట్లు, బిస్కెట్లు అందించారు. అలాగే కరోనా రోగులకు సేవలు చేసే వారికి గ్లౌజులు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆమె తీసుకున్న మరో బాధ్యత వలస కార్మికులకు, వారి కుటుంబాలకు సాయం చేయడం. అలాగే తనకు వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంతో జీవిస్తున్నారు.
సంతృప్తి ఉండదు
''మా నాన్నగారి పేరుతో మేము ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ఒక్క బిడ్డ జీవితంలో మార్పు తీసుకురాగలిగిన నాకు చాలా ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే సంతోషం ఉంటుంది కానీ సంతృప్తి మాత్రం ఉండదు. ఎందుకంటే మన చేసే పని పట్ల సంతృప్తి చెందినప్పుడు ఇక ఆ పనిని మనం కొనసాగించలేం. పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే పనిని నేను నిరంతరం కొనసాగించాలనుకుంటున్నాను. వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు విద్య అందించాలని భావిస్తున్నాను. అందుకే సంతృప్తి చెందను'' అంటారు ఉమా.