Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రి స్టేజ్ ఆర్టిస్ట్ కావడంతో చైల్డ్ ఆర్టిస్టుగా కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కండ్లతోనే హావభావాలు పలికిస్తూ ఎంతోమంది అభిమానాన్ని పొందారు. తనతో పాటు కలిసి నటించిన జై ధనుష్ను వివాహం చేసుకుని ఇండ్రస్టీలోనే స్థిరపడ్డారు. ఆమె కీర్తి జై ధనుష్. భవిష్యత్లో మరిన్ని ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని కోరుకుంటున్న ఆమెతో మానవి చిట్చాట్...
మాది బెంగళూరు. అక్కడే పుట్టి పెరిగాను. ఎడ్యుకేషన్ కూడా అక్కడే. మా మాతృభాష కన్నడ. అమ్మ పుష్ప. నాన్న శివశంకర్. మేం నలుగురం ఆడపిల్లలం. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. అలాగే స్టేజ్ ఆర్టిస్టు కూడా. దాంతో చిన్నప్పటి నుండి నాకూ నటన పట్ల ఆసక్తి వుండేది. తొమ్మిదేండు ఉన్నప్పుడు ఇండిస్టీకి పరిచయం అయ్యాను. చైల్డ్ ఆర్టిస్టుగా కన్నడలో ఒక సినిమా, ఒక సీరియల్ చేశాను. తర్వాత చదువుపై దృష్టి పెట్టా. పదో తరగతిలో ఉన్నప్పుడు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కన్నడలోనే 'ఓ గులాబి', 'వీఐపీ 5' అనే సినిమాలు చేశాను. ఇక సినిమాల్లోనే చేస్తే చదువు పాడైపోతుంది, అసలే పదోతరగతి అని ఇక సినిమాలు చేయడం ఆపేశాను.
దాసరిగారి బ్యానర్ లో...
మా రెండో అక్క మంజుల కూడా ఆర్టిస్టే. నేను పదో తరగతి చదివేటప్పుడే అక్కకు తెలుగు సీరియల్ 'చంద్రముఖి'లో నటించే అవకాశం వచ్చింది. దాంతో తను హైదరాబాద్ వచ్చింది. నా పదోతరగతి పూర్తయి ఇంటర్ చేరే సమయానికి అక్కతో కలిసి నేనూ హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకూ అవకాశాలు వచ్చాయి. చదువు కోసం మొదట్లో వద్దనుకున్నాను. కానీ దాసరి నారాయణగారి సీరియల్ 'తూర్పూ పడమర' లో అవకాశం వచ్చింది. మంచి బ్యానర్ కదా అని ఒప్పుకున్నా. అది తెలుగులో నా మొదటి సీరియల్. అయితే ఆ టైంలోనే కన్నడలో మంచి అవకాశం వచ్చింది. కానీ అప్పటికే సినిమాలపై ఆసక్తి పోయి వద్దనుకున్నాను. కానీ అప్పుడు ఆ సినిమాలో చేసి వుంటే ఇప్పుడు సినిమాల్లోనే వుండేదాన్ని. అయితే సీరియల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది.
నెగిటివ్ పాత్రలే వస్తున్నాయి
'తూర్పూ పడమర' ద్వారా 2009 లో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాను.తర్వాత 'అభిషేకం', 'పుత్తడిబొమ్మ', 'మనసూ మమత', 'ఆడదే ఆధారం'లో చేశాను. హీరోయిన్గా రెండు మూడు మాత్రమే చేశాను. 'పుత్తడి బొమ్మ' సీరియల్ నుండి నెగిటివ్ పాత్రలే వచ్చాయి. నా కండ్ల హావభావాలు నెగిటివ్ పాత్రలకు బాగుంటాయని అలా అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుండి అన్నీ నెగిటివ్ పాత్రలే వస్తున్నాయి. మామూలుగా ఇండిస్టీలో ఒక్కసారి ఏదైనా పాత్ర చేశామంటే ఇక ఆ పాత్రలే వస్తాయి. నాకూ అలాగే జరిగింది. కానీ నెగిటివ్ పాత్రలు చేసినా మంచి గుర్తింపు వచ్చింది.
ఒక్కసారి మాట్లాడితే...
ప్రేక్షకులు ఎవరైనా బయట నన్ను చూసినప్పుడు మొదట మాట్లాడటానికి భయ పడేవాళ్ళు. ఎందుకంటే నా పాత్రలు చూసి ఉంటారు కదా.. అందుకు. కానీ ఒక్కసారి మాట్లాడిన తర్వాత 'మీరు ఇంత సాఫ్ట్గా ఉన్నారు. నెగిటివ్ పాత్రలు ఎలా చేయగలుగు తున్నారు' అని అంటారు. వచ్చిన కొత్తలో తెలుగు మాట్లాడడం వచ్చేది కాదు. ఇక్కడకు వచ్చిన తర్వాతే రాయడం, మాట్లాడటం నేర్చుకున్నాను. సీరియల్స్లో చేస్తూనే దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశాను.
ఇతర భాషల్లో కూడా...
తెలుగులో చేసేటప్పుడే తమిళంలో కూడా అవకాశం వచ్చింది. తమిళంలో నాలుగుసీరియ ల్స్ లో చేశాను. అలాగే మలయాళంలో కూడా నటించాను. అక్కడ కూడా నెగిటివ్ పాత్రలే చేశాను. తెలుగులో నటించి చాలా రోజు లయింది. తెలుగు ప్రేక్షకులను మిస్ చేస్తున్నాను. దాంతో ఇప్పుడు మా బావ నిరుపమ్ (మంజుల అక్క భర్త) చేస్తున్న 'హిట్లర్ గారి పెళ్ళాం'లో నటిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నింటిలో ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. గతంలో బావతో కలిసి 'కలియుగ రామయణం' అనే సీరియల్లో హీరోయిన్గా చేశాను. ఇప్పుడు ఆయనకు కోడలిగా చేస్తున్నాను.
ధనుష్ తో పరిచయం...
మా వారు జై ధనుష్. వీళ్ళది వైజాగ్. ఆయన కూడా ఇండిస్టీలోనే ఉన్నారు. ఆయనతో కలిసి 'తరంగాలు'లో చేశాను. మొదటి నుండి ఏ ప్రాజెక్ట్ చేసినా అక్కా, బావ, మా వారు ఇలా ఎవరో ఒకరు కలిసి వుండేవాళ్ళం. మా వారితో కలిసి మలయాళంలో కూడా చేశాను. నా మొదటి తెలుగు సీరియల్ 'తూర్పూ పడమర' చేస్తునపుడు ఆయనతో పరిచయం. 2015లో పెండ్లి చేసుకున్నాం. మొదట మా పెండ్లికి ఇంట్లో ఒప్పు కోలేదు. తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీ.
బయట స్నేహితులు తక్కువ
కాస్త ఖాళీ దొరికినా ఫ్యామిలీతో గడుపుతాను. నాన్న రిటైర్ అయ్యారు. దాంతో అమ్మానాన్న కూడా మాతోనే ఉంటున్నారు. నాకు బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ. మా అక్క, మావారు వీళ్ళే నా స్నేహితులు. నాకు ఎలాంటి సలహా కావాలన్నా వీళ్ళనే అడుగుతాను. కుదిరితే మా వారితో బయటకు వెళతాను. ఆయన షూటింగ్లో బిజీగా ఉంటే అక్కతో కలిసి షాపింగ్కి వెళతాను. నా సపోర్ట్ అంతా నా ఫ్యామిలీనే. నలుగురం ఆడపిల్లలమైనా మా నాన్న మా గురించి ఎప్పుడూ బాధపడలేదు. మమ్మల్నే మగపిల్లల్లా పెంచారు. మమ్మల్ని చూసి నాన్న గర్వపడతారు. మమ్మల్ని ఇలా ధైర్యంగా పెంచినందుకు నాన్నను చూసి మేం గర్వపడతాం.
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి
మనం మనలాగే ఉండాలి. వేరే వాళ్ళ కోసం మారకూడదు. మన నిర్ణయాలు మార్చుకోకూడదు. స్థిరంగా ఉండాలి. అప్పుడు ఎదుగుతూనే ఉంటాం. ముఖ్యంగా భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి. ఏం చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో చెయ్యాలి అనుకొని తప్పు దారిలో వెళ్ళకూడదు. మంచి దారిని ఎంపిక చేసుకుంటే కచ్చితంగా ఎదుగుతాము. కుటుంబం మాట వినాలి. కుటుంబం కూడా అమ్మాయిల ఎదుగుదలకు సపోర్ట్ ఇవ్వాలి.
ఛాలెంజింగ్ పాత్రలు చేయాలి
మా అక్క కూడా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుటుంబంలో అందరం ఇండిస్టీలోనే ఉన్నాం కాబట్టి భయం లేదు. పైగా చాలా ఇష్టం ఏర్పడింది. చాలా హ్యాపీగా ఉంటుంది. అంతా కూల్గా సాగిపోతుంది. రమ్యకృష్ణగారు 'నరసింహ' సినిమాలో చేసిన ఛాలెంజింగ్ పాత్రల వంటివి చేయాలని నా కోరిక.