Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యతో పాటు విషయ పరిజ్ఞానం ఉన్న మహిళలు తమ సమస్యలనే కాకుండా సమాజంలో తన లాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించగలుగుతారు. ఆ సమస్యలను చర్చిస్తూ పరిష్కారాలను సూచిస్తూ అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయత్నమే చేశారు ప్రముఖ రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ. స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆరోజుల్లోనే పాటుపడిన ఆదర్శ మహిళ. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఒక్కసారి ఆమెను మననం చేసుకుందాం...
శారదా లేఖలు పేరుతో ప్రచురితమైన శీర్షిక ద్వారా మహిళల సమస్యలను చర్చిస్తూ వారిలో చైతన్యం కలిగించారు. సామాజిక మార్పే లక్ష్యంతో సాగే ఆమె రచనలు ఎందరినో ప్రభావితం చేశాయి. తన రచనలకు గాను 1934లో స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ. అంతేకాదు మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొట్ట మొదటి మహిళ కూడా ఈమే. ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి కూడా వరలక్ష్మమ్మనే కావడం మహిళా లోకానికి గర్వకారణం.
ఉత్తమ రచయితగా....
1896లో అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, బాపట్లలో జన్మించారు వరలక్ష్మి. తల్లిదండ్రులు హనుమాయమ్మ, శేషయ్య. ఆమెకు ఏడుగురు తోబుట్టువుల ఉన్నారు. చిన్నతనంలోనే సాహిత్యంపై ఆసక్తితో పుస్తకాలు విపరీతంగా చదివేవారు. పదమూడేండ్ల వయసులో హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేసే కనుపర్తి హనుమంతరావుతో 1909లో ఈమెకు వివాహం జరిగింది. పెండ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో ఎన్నో రచనలు, అనువాదాలు చేశారు. ఎన్నో పదవులు అలంకరించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ రచయితగా సత్కారం అందుకున్నారు.
స్త్రీలను చైతన్యవంతం చేసేందుకు
వరలక్ష్మమ్మ తొలి నవల 'వసుమతి'. అప్పుడు ఆమె వయసు 14 ఏండ్లు, ఒక దీనురాలు తల్లితో చెప్పుకుంటున్న హదయవిదారకమైన చరిత్ర విని, మనసు ద్రవించి ఆకథ రాయాలని చాలా వేదన పడ్డారట. ఆ తరవాత మరో నాలుగేండ్లకి దాన్ని పూర్తి చేశారు. కానీ ప్రచురించడానికి చాలా అవస్థలు పడవలసివచ్చింది. ఆఖరికి 1925లో సాధించారు. అప్పటికి ఆమె వయసు 29. వరలక్ష్మమ్మ మొదటి కథ అయిన 'సౌదామిని'ని 1919లో ఆంగ్లంలో అనువాదం చేశారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ మాస పత్రిక గహలక్ష్మిలో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు అన్న పేరుతో ఒక శీర్షిక రాశారు. ఆ కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, వాటికి పరిష్కారాలు సూచిస్తూ సాగే ఆ శీర్షికకు పాఠకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత ఆ లేఖలన్నింటినీ కలిపి 'శారద లేఖలు' అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆధునిక భావాలు గల శారదా పాత్ర ద్వారా స్త్రీలను చైతన్యవంతం చేయడానికి ఈ లేఖలు ఎంతో దోహదం చేశాయి. ఓ రచయిత్రి ఒక పత్రికలో అంత కాలం ఒకే కాలమ్ నిర్వహించడం అదే మొదటి సారి. తన రచనలతో సమస్యలపై అవగాహన కల్పించిన రచయిత్రిగా ఆమె మహిళా పాఠకుల్లో అభిమానం
అనేక ప్రక్రియల్లో...
సంపాదించు కున్నారు.
సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహౌదయం, పునఃప్రతిష్ఠ వంటి నాటికలు, ద్రౌపది వస్త్ర సంరక్షణ అనే ద్విపద కావ్యం, సత్యా ద్రౌపది సంవాదం, నాదు మాట మొదలైన పద్య రచనలు చేశారు. గేయాలు రాశారు. గాంధీ మీద దండకం కూడా రచించారు. ఇవే కాకుండా పిల్లల కోసం అనేక పాటలు, నవలలు, కథలు రచించారు. ప్రముఖుల జీవిత చరిత్రలు, కథలు రచించారు. ఈమె రచనలు కొన్ని తమిళ, కన్నడ, హిందీ భాషలలోకి కూడా అనువదించారు.
ఆఖరి క్షణం వరకు
రచయితగానే కాదు స్వాతంత్ర సమరంలోనూ ఆమె పాల్గొన్నారు. 1921లో విజయవాడ వచ్చిన మహాత్మా గాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తాను స్వయంగా వడికిన నూలును అలాగే ఒక ఉంగరాన్ని బాపూజీకి సమర్పించారు. అది స్వీకరించిన బాపూజీ ఆమెతో ''రోజూ నూలు పడుతున్నావా'' అని అడిగారు . ఆమె అవునని చెప్పారు ''అయితే ఈరోజు ఖద్దరు కట్టుకుంటావా'' అని ఆమెను తిరిగి ప్రశ్నించారు. దానికి ఆమె ''కట్టుకుంటాను'' అని సమాధానం చెప్పారు. ఆ నాటి నుంచి చివరి క్షణం వరకు బాపూజీకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఖద్దరు వస్త్రాలను ధరించేవారు. ''నా జీవము, ధర్మము, నా మతము నా లక్ష్యం సతీ శ్రేయము.. ఈ మూడింటినీ సమర్ధించుటకే నేను కలము బూనితిని'' అని చెప్పుకున్న రచయిత్రి. తన రచనలతో మహిళల్లో పోరాట పటిమను పెంచారు.
మహిళలను జాగృతం చేసేందుకు
సామాజిక సేవా రంగంలోనూ విశేష కషి చేశారు వరలక్ష్మమ్మ. బాపట్లలో స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, మహిళా చైతన్యానికి మార్గదర్శిగా నిలిచారు. సమాజం స్త్రీల పట్ల అనాదిగా చూపుతున్న వివక్షతను ఖండిస్తూ మహిళా అభ్యుదయానికై 1931లో 'స్త్రీ హితైషిణి' మండలిని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మహిళా చైతన్యం రగిలించారు. అంతే కాకుండా మండలికి అనుసంధానంగా 'సీతా పుస్తక సదనాన్ని' ఏర్పాటు చేశారు. 1952 నాటికి మండలికి సొంత భవనాన్ని ఏర్పాటు చేశారు. దానికి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిలో కుల, మత తేడా లేకుండా మహిళలకు కుట్లు, సంగీతం, హిందీ తరగతులు నిర్వహించారు. స్త్రీ జనాభ్యుదయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలను సమాజం పట్ల జాగతం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఆమె మార్గంలో...
గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా కొనసాగారు. గుడివాడ ప్రజలు ఆమెను ప్రేమగా 'కవితా ప్రవీణ' అని పిలుచుకునేవారు. సాహిత్య రంగంలో రాణించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా అభ్యర్థుల కోసం పనిచేసిన ఆమె 1978 ఆగస్టు 13న మరణించారు. నేడు కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ.. ఆమె చూపిన మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తూ....
- పాలపర్తి సంధ్యారాణి