Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలామందికి పెద్దగా తెలియదు. అప్పట్లో ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉంటే ఆఫీస్కు వెళ్లడానికి, అక్కడి నుంచి ఇంటికి వచ్చేందుకు పట్టే సమయం ఆదా అవుతుందని అనేక మంది ఉద్యోగులు భావించేవారు. కానీ కరోనా, లాక్డౌన్ తర్వాత వర్క్ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో ఉద్యోగులు అంతగా సంతృప్తి చెందట్లేదని సర్వేలు చెబుతున్నాయి. దీనిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థ లింక్డ్ఇన్ పరిశోధనలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల వర్క్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ మెంటల్ హెల్త్ పేరుతో ఆ సంస్థ ఈ సర్వే చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం...
భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఉద్యోగులు వర్క్ఫ్రమ్ హోమ్ కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. కరోనా కారణంగా చాలా కంపెనీలు ప్రతి ఒక్కరినీ ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించాయి. దీని కారణంగా ప్రతీ ఐదుగురిలో కేవలం ఒక్కరు మాత్రమే వారి శ్రేయస్సు కోసం ఎక్కువ సమయం కేటాయించుకోగలుగుతున్నారట.
ఆర్థిక ఒత్తిడి
లింక్డ్ఇన్ వర్క్ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 'మెంటల్ హెల్త్' ఎడిషన్ సర్వే మరిన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. భారతదేశంలో 16,199 మంది కార్మికులు, నిపుణులపై ఈ సర్వే చేశారు. భారత్లోని ప్రతీ నలుగురు ఉద్యోగుల్లో ఒక్కరికే సౌకర్యవంతమైన పని గంటలు, శ్రేయస్సు(వెల్ బీయింగ్) కు సంస్థల నుంచి సహ కారం లభిస్తుంది. ప్రతీ ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరికి మాత్రమే సెలవులు లేదా లాస్ ఆఫ్ పే సెలవుల ద్వారా ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుందట. భారతీయ నిపుణులలో 40శాతం మంది ఆర్థిక ఇబ్బందుల (ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ)ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీస్తోంది.
తల్లులకు ఉపయోగం లేదు
తల్లిదండ్రులకు.. ముఖ్యంగా తల్లులకు కూడా వర్క్ ఫ్రమ్హోమ్ వల్ల పెద్దగా ఉపయోగాలు లేవని సర్వేలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. పనిలో ఉన్నప్పుడు పిల్లల కారణంగా ఎక్కువగా అంతరాయం కలుగుతుందని వారు చెప్పారు. వర్కింగ్ మథర్స్లో 36శాతం మంది, పిల్లల కారణంగా పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. పని చేసే తండ్రుల్లో 25 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మగవాళ్లలో 31శాతం మంది, తమ పిల్లల సంరక్షణ కోసం స్నేహితులు, కుటుంబసభ్యులపై ఆధార పడుతున్నారు. వర్కింగ్ మథర్స్లో ఇది 23 శాతంగా ఉంది.
కారణాలు ఇవే
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనకు మూడు 'ఆర్' లు కారణమవుతున్నాయని లింక్డ్ ఇన్ సర్వేలో తేల్చారు. అవి రిమోట్ వర్క్, రిటర్న్ టూ వర్క్, రిస్క్ ఆఫ్ వర్క్. ఇవి భారతీయ ఉద్యోగులు, నిపుణుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని లింక్డ్ఇన్ తెలిపింది.
సంతృప్తి లేదు
భారతదేశంలో 41శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగుల్లో ఒత్తిడి, ఆందోళ పెరిగినట్లు సర్వే స్పష్టం చేసింది. పనికి, వ్యక్తిగత జీవితాల మధ్య తేడాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఉద్యోగులు భావిస్తున్నారు. సహోద్యోగులతో పెరిగిన కమ్యూనికేషన్, నిర్ణీత పనిగంటలు లేకపో వడం, ఎక్కువ సమయం పనిచేయడం ఫలితంగా ఉద్యోగులు అసంతృప్తి చెందుతున్నారు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు ఎక్కువ మీటిం గ్లు, పనిపై సరిగా దృష్టి పెట్టేందుకు తగినంత సమయం లేకపోవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు 23 శాతం మంది ఉద్యోగులు సర్వేలో చెప్పారు.