Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారిన జీవన శైలికి అనుగుణంగా ప్యాక్ చేసిన ఆహారం, నూడుల్స్, పిజ్జాలు, బేకరీ పదార్థాలు, సాఫ్ట్ డ్రింకులకు అలవాటు పడిపోయాం. ఏది పడితే అది తిస్తున్నాం. దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిని రక్తపోటుకు కారణమవుతోంది. పర్యవసానంగా గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి. ప్రస్తుతం ఈ వ్యాధి 40 ఏండ్లు పైబడిన వాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్య 20-30 ఏండ్ల వయసున్న యువతీయువకులనూ ఈ సమస్య వేధిస్తోంది. అయితే ఇలాంటి ఆహారం వల్ల భవిష్యత్లో పిల్లలూ బీపీ బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ట్యులేన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 3940 మంది పిల్లలను పరీక్షించగా క్రమంగా సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్న వారిలో బీపీ ఆనవాళ్లు కనిపించాయట. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కూడా ఒక కారణమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుత జీవనశైలిని అనుసరించి పిల్లలకు కూడా బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. పిల్లల్లో పరీక్ష చేస్తే తప్ప బీపీ ఉందా.. లేదా.. అన్నది నిర్ధారణ కాదని, అందువల్ల మూడేండ్లు దాటిన తర్వాత రెగ్యులర్గా బీపీ పరీక్ష చేయించాలని సూచించారు. బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి సోడియం వుండే పదార్థాలను చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే సోడియం వల్ల రక్తపోటు ఇంకా అధికం అయ్యే అవకాశాలున్నాయి. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పు అధికంగా తింటే శరీర ద్రవాల అసమతుల్యత పెరిగి ద్రవాలు అధికమై రక్తపోటును అధికం చేస్తాయి. అందువల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. బీ.పి. ఉన్నవారు రోజుకి 2-3 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. బీ.పి. మరీ ఎక్కువగా ఉంటే రోజుకి ఒక గ్రాము ఉప్పును మాత్రమే వినియోగించాలి. సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలైన పచ్చళ్ళు (నిల్వ చేసినవి), ఫాస్ట్ ఫుడ్స్ (న్యూడుల్స్, ఫ్రైడ్ రైస్), ఎండు చేపలు, ఆలూ చిప్స్, కేకులు, సాఫ్ట్ డ్రింక్స్, క్యానెడ్ ఫుడ్స్ వీటికి దూరంగా ఉండాలి.