Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాటిమాటికీ గొంతు సవరించుకోవడం, కఫాన్ని ఉమ్మివేయడం కష్టమే. కొంతమందైతే కఫాన్ని మింగేస్తారు కూడా. అది చాలా ప్రమాదకరం. అందుకే ఈ గొంతు గరగరకు మనం చెక్ పెట్టాలి. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే దానర్థం... మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా వస్తున్నాయనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతోందని. అయితే వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూకస్ (కఫం లేదా శ్లేష్మం) ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. జలుపు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలి. లేదంటే అది దగ్గుగా మారుతుంది. ఆ దగ్గు రెండు వారాల కంటే ఎక్కువసేపు ఉంటే... ప్రాణాంతకమైన క్షయ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం గొంతులో కిచ్ కిచ్ అంతు చూద్దాం. అందుకు మందులతో పనిలేదు. కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
అల్లం, దాల్చినచెక్క : అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.
అల్లం టీ : అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి అల్లాన్ని మెత్తగా నూరి టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగండి. గొంతులో కిచ్ కిచ్ మొత్తం మాయమవుతుంది.
పుదీనా టీ : పుదీనా చేసే మేలు మనందరికీ తెలుసు. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, ఆకులు తీసివేసి నీరు తాగాలి. అంతే... గొంతు బాధ తగ్గిపోతుంది.
చామంతి టీ : ఇది పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. నిజానికి ఇది కూడా బాగా పనిచేస్తుంది. కొన్ని చామంతి రేకుల్ని నీటిలో వేసి మరిగించి తాగడమే. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ టీ బ్యాక్టీరియాను చంపేస్తుంది.