Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బ్రతుకంతా ఇది నీ కోసం... నా ప్రతి అడుగూ నిను చేరుట కోసం' అంటూ సుమధుర లలిత గీతాలెన్నో రచించి ఆకాశవాణి శ్రోతల హృదయాలను రసప్లావితం చేసిన కవితా గంగాఝరి గంగ రాజు సుశీలా దేవి ఆఖరి అడుగు వేస్తూ ఈ నెల 22న వెళ్లిపోయారు. ఈ తరం పాటల ప్రేమికులకు ఆమె గురించి తెలుసో లేదో గానీ నాలుగయిదు దశాబ్దాల వెనక ఆకాశవాణిని వింటూ పెరిగిన తరానికి ఆమె పేరు సుపరిచితం. ప్రేమ, విరహం, వియోగం వంటి అనుభూతి ప్రధానమైన లలిత గీతాలతో పాటు రైతులు, శ్రామికులు, స్త్రీలు, ప్రకృతి ఆరాధన, సమ భావన వంటి కవితా వస్తువులతో ఆమె రాసిన ఎన్నో గీతాలు లలిత సంగీతాభిమానులను ఆనంద డోలికలూగించాయి. పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్ వంటి మహామహుల సంగీత దర్శకత్వంలో ఆకాశవాణి గాయకులెందరో ఆమె రచించిన గీతాలను ఆలపించారు. ఎన్నో గేయ రూపకాలు పలు ప్రత్యేక సందర్భాలలో రచించిన సుశీలా దేవి రేడియోతో చిన్నప్పటి అనుబంధం ఉన్న వారెందరికో అభిమాన కవయిత్రి. వారం కిందట ఫోన్ చేసినపుడు ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. 'మీ గురించి రాద్దామనుకుంటున్నాను అన్ని విషయాలూ ఓ సారి చెపుతారా?' అంటే 'నన్ను గుర్తు పెట్టుకునే వాళ్ళు ఇంకా ఉన్నారంటావా తల్లీ!' అన్నారు. కనిపించీ కనిపించని నిస్పృహ తెలిసింది ఆ విస్మృత కవయిత్రి కంఠంలో... ఆమెతో నా సంభాషణ సాగిందిలా ....
మీరు కుటుంబ వివరాలు చెబుతారా?
నేను పుట్టింది 1936, ఆగష్టు అనుకుంటాను.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ దగ్గర్లోని కోడూరు మా స్వస్థలం. మాది కలిగిన కుటుంబమే. అమ్మ యశోద, నాన్న రంగరాజు శ్రీనివాస రావు. నాన్నకు ముందు తొమ్మిది మంది పుట్టి పోవడంతో మా నాయనమ్మ, తాతయ్య నాన్నను 'ఆగయ్య' అని పిలిచారట. అందరికీ ఆ పేరుతోనే నాయిన పరిచయం. నాకు ఒక అన్నయ్య వెంకటేశ్వర రావు, తమ్ముడు కిషన్ రావు, చెల్లెలు సుజాత. అన్నయ్య చాలా ఏండ్లు జనగామలో వకీలుగా చేసి కొన్నేండ్ల కిందట చనిపోయాడు. తమ్ముడు జనగామలోనే ఉంటాడు. ఇక చెల్లెలు భర్త శ్యాంబాబు (నెల్లుట్ల శ్యాం సుందర్ రావు) మంచి కవి, గాయకుడు, చిత్రకారుడు కూడా. ఆయనా చనిపోయాడు.
అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కదా! మీ బాల్యం ఎలా గడిచింది?
మా ఇండ్లల్లో ఆడపిల్లలు బయటికి పోయే అవకాశమే లేకుండే. ఎప్పుడూ ఆటలూ, బొమ్మల పెండిండ్లూ వీటితోనే కాలక్షేపం. సాతాని వైష్ణవులు గానీ, భట్రాజులు గానీ ఖానిగీ (ప్రైవేట్) బడి నడిపే వారు. మాకు ఇంటికే ఇద్దరు పంతుళ్లు వచ్చి వీధి అరుగుల మీద చదువు చెప్పే వాళ్ళు. అది నా విషయంగా ఎక్కువ సాగలేదు .
ఎందుకని?
ఆడీ పాడీ ఎగిరీ దుంకే వయసు.. చదువు మీద శ్రద్ధ లేదు. దానికి తోడు ఓ రోజు మా పంతులు గారు పెంపుడు జంతువుల గురించి చెబుతూ 'పిల్లి కండ్లు ఎట్లుంటయో తెలుసునా?' అని అడిగారు. ఆయనవి కొంచెం తేనె కళ్ళు. అసలే ఆట పైన మనసుండి.. వెళ్లనీయలేదన్న కోపం తోనో ఏమో... టక్కున 'మీ కండ్ల తీరుగనే ఉంటయి కదా!' అని బదులు చెప్పా. దాంతో ఆయనకు కోపం వచ్చి నా చెంప చెళ్లుమనిపించారు. మా తాతయ్యకు విషయం తెలిసి 'ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా?' అని కోప్పడి ఆయన్ని మాన్పించారు. దాంతో నా చదువు చెట్టెక్కింది.
మరి మీకు కవిత్వం రాసేంత తెలుగు భాషా జ్ఞానం ఎలా వచ్చింది ?
అప్పట్లో కమ్యూనిష్టు ఉద్యమం తీవ్రంగా సాగుతుండేది. విస్నూరు రామచంద్రారెడ్డి దేశముఖ్ దౌష్ట్యాలను అందరూ చెప్పుకునేవారు. దొరల కుటుంబాల్లోని చదువుకున్న యువకులు కమ్యూనిస్ట్ ఉద్యమానికి చేయూత నిచ్చారు కూడా. అయితే వర్గపోరాటంలో భాగంగా భూస్వాములందరి మీదా దాడులు జరిగాయి. అలాంటి ఒక దాడిలో మా తాతయ్య చేతి వేళ్ళు విరగ్గొట్టారు. ఆయన వేళ్ళకు పట్టు పోయి ఏది పట్టుకున్నా వణుకుతుండేవి. దాంతో ఆయన వాలు కుర్చీలో పడుకుని నాతో భారత, భాగవత, రామాయణాలతో బాటు ఇతర పుస్తకాలను చదివి వినిపించుకునేవారు. అలా నాకు తెలుగు భాష మీదా, కొత్త పదాలు, అర్థాలూ నేర్చుకోవడం మీదా ఆసక్తి కల్గింది. మా చిన్న తాతయ్య పట్టాభిరామారావు గారికి నేనంటే పంచ ప్రాణాలు. ఆయన కూడా నాకు ఎన్నో విషయాలు తెలియచెప్పేవారు .
మీ బాల్యం కొంత కాలం ఆంధ్రా ప్రాంతంలో గడిచిందంటారు. నిజమేనా?
నిజమే.. రజాకార్ల అత్యాచారాలు, ఆగడాలు, దాడులు పెచ్చరిల్లిన నేపథ్యంలో ఉన్న కొద్దిపాటి నగదూ, బంగారం తీసుకొని మా కుటుంబమంతా మచిలీపట్నం వెళ్లిపోయాము. మేము అక్కడ ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ సందర్భంగా 1947 ఆగష్టు 15 రోజున ఒక పాట రాసి నేనే స్వరం కట్టి అందరితో పాటు వీధుల్లో పాడాను కూడా! ఆ తరువాత పోలీస్ యాక్షన్ జరిగి యూనియన్ పోలీస్ పరిస్థితులను కంట్రోల్ చేశాక మళ్ళీ తిరిగి వచ్చాం.
మీ పెండ్లి, ఆ తరువాత జీవితం ....?
నా ఏడేండ్ల వయసులో నాన్న చనిపోవడంతో మా తాతయ్య వాళ్లే నా పెండ్లి చేశారు. నాకప్పుడు ఎనిమిదేండ్లు. మాది దొంగ పెండ్లి. అంటే మేమే చేసుకున్నామని కాదు. అప్పట్లో ఎంత దగ్గరి వాళ్లయినా ఓ సారి అనుకున్నాక పెండ్లి ఆలస్యం చేసేవారు కాదు. చుట్టపు చూపుగా అబ్బాయి వస్తే ఆడపిల్ల తరఫు వాళ్ళు అతడ్ని అట్లాగే ఆపేసి పిల్లనిచ్చి పెండ్లి చేసే వారు. కొన్ని సార్లు పెండ్లి కొడుకు వాళ్లకు కబురు చేసేవారు. ఇంకొన్ని సార్లు అదీ లేదు. తర్వాత తెలిసేది. ఏ కారణంగానైనా అబ్బాయి తరపు వాళ్ళు మనసు మార్చుకుంటారనో, మరెందుకో.. అట్లా చాలా పెండిండ్లు జరిగేవి. అబ్బాయి వాళ్ళు దానికి కట్టుబడి ఉండేవారు. చాలా రోజులు వరకట్నం ఇవ్వలేదని నన్ను అత్తవారింటికి తీసుకెళ్లలేదు. చివరికి నా పదవ ఏట మెట్టినింట అడుగు పెట్టాను. ఆలేరు దగ్గరలోని కొలనుపాక మా ఊరు. మా వారు గంగరాజు హనుమంతరావు. చాలా కాలం నాకు పిల్లలు కలగలేదు. మా వారికి సులోచనతో మళ్ళీ పెండ్లి జరిగింది. వాళ్లకి ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ నేనంటే ప్రాణం పెడతారు. వాళ్ళమ్మని 'కన్నా' అనీ, నన్ను 'అమ్మా' అనీ పిలుస్తారు. ఆ పెండ్లి తరువాత కాస్త తీరిక చిక్కి, చదువు పట్ల కోరికతో 1965లో 'భాషా ప్రవీణ' రాసి పాస్ అయ్యాను.
ప్రముఖ రచయిత్రి, రేడియో ప్రయోక్త తురగా జానకీ రాణి గారు మీకు అత్యంత ఆప్తురాలు కదా! వారితో మీ పరిచయం ఎలా జరిగింది ?
అదొక మధుర జ్ఞాపకం. జానకి ఇరవయ్యవ ఏట నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఏదో స్టడీ టూర్ కోసం మా ఊరికి వచ్చింది. మాది సంపన్న కుటుంబం, మంచి పేరుండేది. పైగా మా వారు కరణం గనుక ఊరికి ఎవరు వచ్చినా ఉండేది మా ఇంట్లోనే. అలాగే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నాకప్పుడు పదిహేడేళ్ళుంటాయేమో! అప్పటికే చాటుమాటుగా చిన్న చిన్న కవితలూ, గేయాలూ రాస్తూండేదాన్ని. నేను తనకి బాగా నచ్చి తన అడ్రెస్ ఇచ్చి ఉత్తరాలు రాయమని జానకి చెప్పి వెళ్ళింది. మేము ఒకర్నొకరు చూసుకున్న వేళ ఎలాంటిదో గానీ మా మధ్య గాఢ మైత్రి ఏర్పడింది. నా రూపం, సంస్కారం, ప్రేమా తనకు ఎంతో నచ్చాయని జానకి చెప్పేది. తన సహృదయత, ఆప్యాయత, సహాయపడే తత్త్వం నన్ను ఆకర్షించాయి. తనను జానకీ అనీ, ఆమె జీవిత భాగస్వామి తురగా కృష్ణ మోహన్ గారిని అన్నయ్యా అనీ పిలిచేదాన్ని. ఆయన ఎంతో సహృదయులు. వాళ్ళ పిల్లలు నన్ను సొంత అత్తగా స్వీకరించారు. జానకి దగ్గర్నుండి ఉత్తరం వస్తే చాలు.. వెంటనే జవాబు రాయాల్సిందే! మా అత్తగారు వాళ్ళు కాస్త వెనకటి మనుషులు. ఆచారాలూ అవీ ఎక్కువే. ఈ కవిత్వం, ఉత్తరాలూ రహస్యంగానే రాసేదాన్ని. ఓ సారి జానకికి ఉత్తరం రాద్దామని చెద్దరు కప్పుకుని ఎక్క దీపం లోపల పెట్టుకుని ఆ వెలుగులో రాస్తుంటే ఆ దుప్పటి అంటుకుని నానా గోల అయింది. ఇప్పుడు జ్ఞాపకం వస్తే నవ్వొస్తుంది.
మీ ఆకాశవాణి ప్రవేశం ఎలా జరిగింది?
జానకి వల్లనే! నేను చిన్న చిన్న గేయాలు రాయడం చూసి 'ఇంత బాగా సరళమైన భాషలో రాస్తున్నావు. వీటిని ఆకాశవాణికి పంపు' అని ప్రోత్సహించింది. ఆమె అప్పటికే ఆకాశవాణిలో చిన్న పిల్లల ప్రోగ్రామ్స్కి ప్రొడ్యూసర్గా ఉండేది. అలా మొదలు పెట్టి ఎన్నో బాల గేయాలు, దేశభక్తి గేయాలు, భక్తి పాటలు, ప్రకృతి గీతాలు రాసాను. నా కవిత్వం లయలో ఒదుగుతుందని మొదట గుర్తించింది తనే! పాలగుమ్మి విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు నా పాటలనెన్నింటినో స్వరపరిచారు. ఏ మాటైనా లయలో ఒదగక పొతే అప్పటికప్పుడు వేరే మాట రాసేదాన్ని.
సంక్రాంతి, శివరాత్రి, దసరా, ఉగాది వంటి పండుగల సందర్భాలలోనూ, 'వచ్చింది శ్రావణి', 'వ్యవసాయంలో మహిళ' వంటి ఎన్నో గేయ రూపకాలనూ రచించానంటే ఆకాశవాణి ప్రోత్సాహం, మరీ ముఖ్యంగా జానకి సహకారం వల్లనే.
ఇన్ని మంచి పాటలు రాసిన మీరు సినిమా పాటలు రాయడానికి ప్రయత్నించలేదా?
ఆ ప్రయత్నమూ జానకి వదల్లేదు. నన్ను ఓ సారి ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరికి మద్రాసు తీసుకెళ్లింది. నా పాటలు ఆయనకు నచ్చాయి కూడా. అయితే, సినిమాల్లో ఆయా సందర్భాలకు తగ్గట్టుగా పాటలు రాయాలంటే కొన్నాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుందని అన్నారు. అన్ని రోజులు వేరే ఊరిలో.. అందునా ఒంటరిగా ఉంటూ సినిమా వాళ్ళ మధ్య పని చేయడానికి మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరని వెనక్కు వచ్చేశాం.
మీ రచనలేవైనా ముద్రణలో ఉన్నాయా?
తురగా కృష్ణ మోహన్ అన్నయ్య గారు, జానకి ప్రారంభించిన 'ప్రత్యూష ప్రచురణలు' ద్వారా వాళ్ళ ప్రోత్సాహంతోనే 'ఆర్ద్ర హృదయం' కవితా సంపుటి, 'చిట్టి ముత్యాలు' బాల గేయాలు వెలువరించాను. దీనికి ఉమ్మడిరాష్ట్రంలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గేయ రూపకాల రాత ప్రతులు నా వద్ద లేవు. ఆకాశవాణిలో దొరుకుతాయేమో చూడాలి. 'నేను - నా జీవన ప్రస్థానం' పేరుతో ద్విపదలో రాసుకున్న నా జీవిత చరిత్రను అమెరికాలో ఉంటున్న మా పెద్దబ్బాయి రఘు ప్రచురించి నా 84వ పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు.
మీరు మంచి వ్యవసాయదారులు అని చెప్పుకుంటారు. ఘోషాలో, తెర చాటున పెరిగిన మీకు ఇదెలా సాధ్యమయింది?
నాకు మొదటినుండీ వ్యవసాయం ఇష్టమే! రైతు బిడ్డనే... కష్టమైనా అద్భుత సృష్టి కదా అది! ఊరికే కూచుని తినడం నాకు నచ్చదు. జనగామ పక్కన సిద్దెంకి గ్రామంలో మాకు వ్యవసాయ భూములుండేవి. ఇరవై ఏండ్ల పాటు అదే ఊర్లో ఉంటూ రైతు కూలీల సహాయంతో వ్యవసాయం చేసాను. వరిలో 'చిట్టి ముత్యాలు' అనే రకం అప్పట్లో బాగా ప్రసిద్ధి. నేను వాటిని ఎక్కువ దిగుబడి తీసుకు వచ్చాను. అందుకే నేను రచించిన బాల గేయాలకు 'చిట్టి ముత్యాలు' పేరు పెడితే బాగుంటుందని జానకి సూచించింది .
తెలంగాణను కలలు కన్నారు కదా! ఇప్పుడు ఎలా ఉంది?
అవును.. మన నీళ్లు, మన నిధులు, మన నదులు, మన ఉద్యోగాలు, మన యాస, మన సంప్రదాయం మనకు కావాలి. నిర్లక్ష్యం చేయబడ్డ రంగాలు అభివృద్ధి పొందాలి అని ఆశించాం. ప్రాంతంగా విడిపోయినా, మనుషులుగా కలిసుండాలి. రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు మహాసభల సందర్భంలో అప్పటి జనగామ కలెక్టర్ శ్రీదేవసేన నన్ను సత్కరిస్తూ 'బాలానందం'లో నా పాటలు పాడేవాళ్ళం అని చెప్పడం ఓ మధుర జ్ఞాపకం.
తెలంగాణా రాష్ట్ర స్థాయిలో ఆమెను మర్చిపోయినా, తన జీవిత చరిత్ర సభా ముఖంగా విడుదలవడం చూడకుండానే... తనను వరించిన అమృతలత అపురూప అవార్డు కరోనా కారణంగా వాయిదాపడి స్వీకరించకుండానే అదే కరోనాకు బలై నిష్క్రమించిన మనసున్న కవయిత్రి, మానవి గంగరాజు సుశీలా దేవి తన పాటలు ఉన్నంత కాలం మన మధ్య ఉంటారు.
- నెల్లుట్ల రమాదేవి