Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా, కారంకారంగా తినాలనిపిస్తుంది. రోజూ ఒకే రకం కూరగాయలు తినీ తినీ బోరుకొట్టి వుంటుంది. కొంతమంది స్పెషల్ వంటకాల కోసం రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుంటారు. అసలే కరోనా కాలం.. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రుచుల కోసం బయటకు వెళ్ళడం కంటే ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. రాజ్మా మసాలా, దమ్ ఆలూ, జీరా ఆలూ, చోలే మసాలా వంటి రెస్టారెంట్ల రుచులను ఇంట్లోనే చేసుకోవచ్చు. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం...
రాజ్మా మసాలా
కావల్సిన పదార్థాలు : రాజ్మా - రెండు కప్పులు, నీరు - నాలుగు కప్పులు, ఉప్పు - టీస్పూన్, వంట నూనె - మూడు టేబుల్ స్పూన్లు, టమాటాలు - నాలుగు (సన్నగా కట్ట చేసుకోవాలి), ఉల్లిగడ్డ - రెండు (సన్నగా తరిగినవి), సన్నగా తరిగిన పచ్చిమిర్చి - రెండు, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, ధనియాల పొడి - టేబుల్ స్పూను, కసూరి మేథి - టేబుల్ స్పూను, జీలకర్ర - టీస్పూను, కారం - టీస్పూను, గరం మసాలా - టీస్పూను, పసుపు పొడి - టీస్పూను, తరిగిన కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి - టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం : రాజ్మాను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టండి. ఉదయం నీటిని వంపేసి కడగాలి. బీన్స్లో రెండు కప్పుల నీరు, టీస్పూన్ ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత సన్నని మంట మీద మరో 15 నిమిషాలు ఉడికించి దించుకోవాలి. రాజ్మా చల్లారిన తర్వాత ఓ పాన్లో నూనె పోసి వేడి చేసి జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి సన్నని మంట మీద వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి వేయాలి. ఈ తర్వాత టమాటా ముక్కలు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పసుపు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరువాత గరం మసాలాతో పాటు కారం కూడా వెయ్యాలి. మసాలాను సరిగ్గా కలిపి, నూనె గిన్నె అంచుల వద్ద వేరుకావడం ప్రారంభమయ్యే వరకు సన్నని మంట మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఉడికించిన రాజ్మా వేసి బాగా కలపాలి. గ్రేవీ కొరకు రెండు, మూడు కప్పుల నీరు పోయాలి. పాన్పై మూతపెట్టి 20-30 నిమిషాలు ఉడికించాలి. తర్వాత నెయ్యి వేసి బాగా కలపాలి. చివరగా పిండి చేసిన కసూరి మెథీ, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. దీన్ని అన్నంతో వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
దమ్ ఆలూ
కావల్సిన పదార్థాలు: గ్రేవీ కోసం: లవంగాలు - మూడు, ఆవాలు - టేబుల్ స్పూన్, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి - రెండు, దాల్చిన చెక్క - అంగుళం, బే ఆకు - ఒకటి, కొత్తిమీర - టేబుల్ స్పూను, జీలకర్ర - టీస్పూన్, సోపు గింజలు - టీస్పూను, నల్ల మిరియాలు - టీస్పూను, ఏలకులు - మూడు, జీడిపప్పు - పది, తరిగిన టమోటా - ఒకటి, తరిగిన ఉల్లిగడ్డ - ఒకటి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను.
ఆలు తయారీ కోసం : ఆలూ - పది, నీరు - రెండు కప్పులు, నూనె - 2-3 టేబుల్ స్పూన్లు, కారం - టీస్పూను, పసుపు - టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
దమ్ ఆలూ కర్రీ కోసం : ఆవ నూనె - 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతిని చూర్ణం చేసింది - టీస్పూను, పెరుగు - కప్పు, కారం - టేబుల్ స్పూను, పసుపు - కొద్దిగా, ధనియాల పొడి - టీస్పూన్, జీలకర్ర - టీస్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం : మొదట ఆలూను ప్రెజర్ కుక్కర్లో 1-2 కప్పుల నీరు, కొద్దిగ ఉప్పు వేసి ఉడకబెట్టాలి. రెండవ సారి విజిల్ వచ్చిన తర్వాత దించేయాలి. ఆలూ తోలు తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ ఆలూ గ్రేవీ కోసం ఓ బాణలిలో నూనె పోసి నూనె వేడి చేయాలి. తర్వాత పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, జీడిపప్పు, ఏలకులు, జీలకర్ర, సోపు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, లవంగాలు, నల్ల మిరియాలు వేసి వేగించాలి. తరిగిన ఉల్లిగడ్డ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటాలు వేసి సన్నని మంట మీద మరో మూడు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. బాణలిలో కొంచెం నూనె వేడి చేసి పసుపు, కారం వేసి ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ వేసి 5-7 నిమిషాలు వేయించాలి. ఓ టిష్యూ పేపర్పై ఆలూ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి కాస్త వేడెక్కాక జీలకర్ర వేయాలి. పక్కన పెట్టుకున్న టమాటా పేస్టును కూడా అందులో వేయాలి. 3-4 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆ పేస్ట్లో కారం, పసుపు, కొత్తిమీర వేసి పేస్ట్ నుండి నూనె వేరు అయ్యే వరకు కదిలించాలి. తర్వాత మంటను ఆపేసి అందులో పెరుగు వేసి తిప్పాలి. దాంతో గ్రేవీలో ముద్దలు ఉండవు. మళ్ళీ స్టౌమీద పెట్టి ఒకటి రెండు నిమిషాలు వేడి చేస్తూ కదిలించాలి. గ్రేవి కాస్త ఎవ్కువ కావాలనుకుంటే కొద్దిగ నీరు పోసి ఓ మరుగు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత వేయించిన ఆలూ వేసి మూతపెట్టేయాలి. తక్కువ మంట మీద 15-20 నిమిషాలు ఉడికించాలి. చివరగా పిండిచేసిన కసూరి మెథీని వేసి దింపేయాలి. ఫుల్కా, పులావ్తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
చోలే మసాలా
కావల్సిన పదార్దాలు : తెల్ల శెనగలు - ఒక కప్పు, నీరు - ఆరు కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, టీ బ్యాగ్ - ఒకటి, ధనియాలు - టేబుల్ స్పూన్, సోపు గింజలు - టేబుల్ స్పూన్, జీలకర్ర - టేబుల్ స్పూన్ - టీస్పూన్ బిర్యాని ఆకు - ఒకటి, కారం - టీస్పూను, ఏలకులు - ఒకటి, దాల్చిన చెక్క - అంగుళం, లవంగం - ఒకటి, నల్ల మిరియాలు - మూడు, పొడి దానిమ్మ గింజలు (అనార్ ధన) - టేబుల్ స్పూన్, టమాటా (సగానికి కట్ చేయాలి) - రెండు, అల్లం తురుము - ఒక స్పూన్, వెల్లుల్లి - మూడు రెబ్బలు, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ (తరిగినవి) - ఒక కప్పు, వాము - టీస్పూన్, పచ్చిమిర్చి ముక్కలు - టీస్పూన్, కొత్తిమీర - గార్నిష్ కోసం.
తయారు చేసే విధానం : శెనగలు బాగా కడిగి నాలుగు కప్పుల నీరు పోసి 10-12 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో నీటితో పాటు నానబెట్టిన శెనగలు, రెండు టీస్పూన్ల ఉప్పు, టీబ్యాగ్ వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత టీబ్యాగ్ తీసేయాలి. తర్వాత అదే కుక్కర్లో రెండు కప్పుల నీరు కలిపి 8-10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. అది చల్లారే వరకు ఓ పాన్లో నూనె వేడి చేసి ధనియాలు, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు, కారం, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండిన దానిమ్మ గింజలు వేసి కలపాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మిక్సర్లో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, వెల్లుల్లి, తురిమిన అల్లం, చిటికెడు ఉప్పు కూడా వేసి పేస్ట్ చేయాలి. ఓ పాన్లో నూనె వేడి చేసి అందులో జీరాను గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తర్వాత తరిగిన ఉల్లిగడ్డ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేగించాలి. అందులోని నీరు అంతా ఆవిరైపోయి, నూనె మసాలా నుండి వేరు అయ్యేవరకు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా ఒక టేబుల్ స్పూను, కారం, వాము, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండుమూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న శెనగలను
మసాలాలో వేసి బాగా కలిపి కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించి దించేయాలి. చివరిలో కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.
జీరా ఆలూ
కావల్సిన పదార్థాలు : నూనె - టేబుల్ స్పూన్, జీలకర్ర(జీరా) - రెండు స్పూన్లు, ఉడికించి ఆలూ (ఒలిచి ముక్కలుగా కట్ చేసినవి) - రెండు పెద్దవి, ఉప్పు - రుచికి సరిపడా, కారం - టీ స్పూన్, పసుపు - కొద్దిగా, ధనియాల పొడి - రెండు స్పూన్లు, మామిడి పొడి (అమ్చుర్) - టీస్పూన్, గరం మసాలా - టీస్పూన్, ఎండిన మెంతి ఆకులు (కసూరి మెథి) - అలంకరించడం కోసం.
తయారు చేసే విధానం : ఓ బాణనీలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర వేయాలి. తర్వాత ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేసి సుమారు రెండు నిమిషాలు బాగా కలపాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి తిప్పాలి. పచ్చివాసన పోయాక ధనియాల పొడి, అమ్చుర్ కూడా వేసి బాగా కలపాలి. చివరగా గరం మసాలా పొడి వేసి మరోసారి కలపాలి. దించే ముందు కసూరి మేథితో అలంకరిస్తే జీరా ఆలూ రెడీ.