Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సవితా శాస్త్రి... ఒకప్పుడు న్యూరో సైంటిస్ట్... భరత నాట్యం కళాకారిణి... తనకు నచ్చిన, వచ్చిన కళారూపాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని తపిస్తుంది. నృత్యం కోసం న్యూరో సైన్స్ వృత్తిని వదులుకుంది. తన భర్తతో కలిసి డిజిటల్ మాధ్యమం ద్వారా భరతనాట్యాన్ని విస్తృత పరిచేందుకు విశేషంగా కృషి చేస్తుంది. ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
2000 సంవత్సరంలో సవితా కార్పొరేట్ ప్రపంచంలో వృత్తిని విడిచిపెట్టి తన పూర్తి సమయాన్ని నృత్యానికే అంకితం చేయాలని నిర్ణయించుకుంది. న్యూరో సైంటిస్ట్గా ఉన్న ఆమె ఒక నర్తకిగా తాను కోరుకుంటున్న ప్రపంచంలోకి తిరిగి రావడానికి ఇదే సరైన సమయంగా భావించింది. ఇరవై ఏండ్ల పాటు ఉద్యోగం చేసి కుటుంబానికి కావల్సిన ఆర్ధిక చేయూతను అందించింది. ఇక ఇప్పుడు భరతనాట్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆమె తన నాట్యానికి ఎప్పుడూ విరామం ఇవ్వలేదు. ఐదేండ్ల వయసులో భరతనాట్యంలోకి ప్రవేశించింది. కుటుంబ బాధ్యతల్లో, వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా నాట్యం మాత్రం ఎప్పుడూ ఆమె హృదయానికి దగ్గరగానే ఉండేది.
వృత్తి జీవితం
హైదరాబాద్లో ఒక తమిళ కుటుంబంలో జన్మించించి సవిత. ముంబై, చెన్నైలో పెరిగిన ఆమె చివరకు అమెరికాలో స్థిరపడింది. అక్కడే న్యూరోసైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ''ఎప్పుడూ చేస్తున్న పనిలో పరిశోధన చేయడానికే ఆసక్తి చూపుతాను. నా పని ప్రధానంగా అల్జీమర్స్, పార్కిన్సన్, హంటింగ్టన్ మొదలైన న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులతో సంబంధించి ఉండేది. పీజీ పూర్తి చేశాక యుఎస్లోని ఓ పెద్ద సంస్థలో ఆర్ అండ్ డి విభాగంలో ఉద్యోగం చేసాను'' అంటూ ఆమె తన వృత్తి జీవితం గురించి చెబుతున్నారు. చెప్పింది.
నర్తకిగా...
''నా జీవితంలో నృత్యం నిత్యం కొనసాగుతూనే ఉంది. ప్రవాస భారతీయ పిల్లలకు నృత్యం నేర్పిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పుడు కేవలం వారాంతరాల్లో మాత్రమే నేర్పించేదాన్ని. 2000 సంవత్సరం నుండి పూర్తి స్థాయి ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయ్యాను'' అంటుంది ఆమె. సవిత తన కృషిని మూడు భాగాలుగా వర్గీకరించుకుంది. మొదటిది సాంప్రదాయ కచేరీలను చేయడం.. ఇది ఆమె యుక్తవయసులో చేసిన కృషి. రెండవ దశలో... 2008 నుండి సాంప్రదాయక కచేరీలను వదిలి పెట్టి వాటికి బదులుగా తన భర్త, రచయిత అయిన ఎ.కె.శ్రీకాంత్ రాసే కథల ఆధారంగా డ్యాన్స్ థియేటర్ ప్రొడక్షన్స్ చేయడం ప్రారంభించింది. దీనికోసం పురాణాలు, మతం ప్రస్తావన లేని కథలనే ఎంపిక చేసుకుంది. మూడవ దశలో అంటే 2018 నుండి డిజిటల్ మీడియా ద్వారా నృత్యాన్ని సినిమాలుగా తీయడం. ఎంతో శక్తివంతమైన డిజిటల్ మాధ్యమం ద్వారా భరతనాట్యాన్ని ఈ విశాల ప్రపంచానికి పరిచయం చేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రేక్షకులకు అందుబాటులో
''2018లో చిత్రాలన్నీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. భరతనాట్యం అందరిలోకి వెళ్ళడానికి డిజిటల్ మాధ్యమం ఓ చక్కని వేదిక. రంగస్థల ప్రదర్శనలు ప్రస్తుతం ఎన్నో సవాళ్ళతో కూడుకొని ఉన్నదని నా భావన. అయితే నృత్యం చూసే వారి సంఖ్యను బట్టి ఇది నిర్ధారించబడదు. చక్కటి రంగస్థల ప్రదర్శన వేల మంది ప్రేక్షకుల ఆధరణ పొందుతుంది. అయితే స్టేజ్ వద్దకు వచ్చి చూడడం కంటే ఆన్లైన్లో అయితే కొన్ని నిమిషాల్లో ప్రేక్షకులు నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు'' అని ఆమె వివరిస్తుంది. ఈ భార్యాభర్తలు మొదట భారీ చిత్రాలు చిత్రీకరించారు. 2019లో శ్రీకాంత్ ఒక యువ మిలీనియల్ను కలిసినప్పుడు ''ఐదు నిమిషాల్లో ఒక కథను వివరించగలరా?'' అని అడిగారు. ''శ్రీకాంత్ మొదట కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఈ సవాలు ఓ చక్కటి కథ తయారీకి దారితీసింది. ఇదే మా మొట్టమొదటి డిజిటల్ ఫిల్మ్. విజయం ఈ దిశగా మా వద్దకు చేరుతుం దనిపించింది. ఆ విధంగా మేలు కొలుపు, అపరాజిత, కలర్స్ త్రియలాజీ వంటి లఘు చిత్రాలు చిత్రించాము. ఇవన్నీ కూడా 15 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో భరతనాట్యం ద్వారా ఒక కథను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తాం.''
ఉచితంగా నేర్పేందుకు
సవిత, శ్రీకాంత్ కలిసి ఇన్నర్ సర్కిల్ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్లో భరతనాట్యాన్ని ఉచితంగా నేర్పేందుకు ఒక ఆన్లైన్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఈ కమ్యూనిటీలో సుమారు 1,800 మంది వరకు ఉంటారు. భరతనాట్య విద్యార్థులు వారి పద్ధతులను మెరుగు పర్చడానికి, సుదీర్ఘకాలం తమ నృత్యాన్ని కొనసాగించడానికి అవసరమైన ఫిట్నెస్ పద్ధతులను తెలుసు కోవడానికి ఇది రూపొందించబడింది. ఇందులో భరత నాట్యానికి సంబంధించిన అనేక వీడియోలను ఉంచుతారు. అన్ని తరగతుల ప్రజలకు, అన్ని వయసుల వారికి ఇవి ఉపయోగపడతాయి.
మరిచిపోలేని సంఘటన
సవిత ఇప్పటి వరకు ఐదు ఖండాలలో 100 లైవ్ షోలను ప్రదర్శించింది. ఓ నృత్య ప్రదర్శన లో ఎదురైన తన అనుభవాన్ని వివరిస్తూ... అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన అంటుంది ఆమె. ''థీమాటిక్ స్టేజ్ టూర్ ప్రారంభించిన రోజులలో మేము కోల్కతాలో ప్రదర్శిస్తున్నప్పుడు ఇది జరిగింది. ప్రదర్శన తర్వాత ప్రేక్షకుల్లో నుండి ఒక మహిళ వచ్చి నన్ను కలుసుకుంది. ఆమె క్యాన్సర్తో పోరాడుతున్నట్టు చెప్పింది. అయితే మా నృత్యాన్ని చూసిన ఆ గంటలో ఆమె తన నొప్పి, కెమోథెరపీ, ఒత్తిడి గురించి మరచిపోయింది. నృత్యం ప్రారంభించినప్పటి నుండి ఈ కళారూపంలో ప్రతి క్షణాన్ని తను ఆస్వాదించినట్టుగా చెప్పింది'' అంటూ తన అనుభవాన్ని పంచుకుంది.
సాంప్రదాయ గొలుసుల నుండి...
ఈ చిత్రాలను భార్యాభర్తలు కలిసి నిర్మించడమే వారి బలం. సవిత చెప్పిన ప్రకారం శ్రీకాంత్కు భరతనాట్యం పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ''సాంప్రదాయ ప్రదర్శనలు.. ఎప్పుడూ అవే పునావృతం కావడంతో వాటితో శ్రీకాంత్ విసుగ్గా భావించేవారు. అయితే నృత్య రూపకంలోని అందాన్ని మాత్రం ఆస్వాదిస్తారు. భరతనాట్యాన్ని దాని సాంప్రదాయ గొలుసుల నుండి వేరు చేయాలని అతని ఆలోచన. నవల ఆధారంగా ఆ కథలను నృత్యంతో జోడించి ప్రదర్శించడం ద్వారా అది నెరవేరుతుందని నమ్మాడు. ''గత పదేండ్ల నుండి నేను చేస్తున్న ప్రతి పనికీ రచయిత, దర్శకుడు, నిర్మాత అతనే. తన అన్ని ప్రాజెక్టులలో నన్ను ప్రధాన నర్తకిగా ఎన్నుకున్నాడు. ఈ ప్రొడక్షన్స్ వెనుక ఉన్న సంగీతం ఎక్కువగా ప్రశంసించబడింది'' అని సవిత చెప్పింది.
చిన్న పిల్లల కోసం
భరతనాట్యంలోని అందాన్ని అందరికీ తెలియ జేయడం, యువ నృత్యకారులకు మార్గనిర్దేశం చేయడం వీరిద్దరి అతిపెద్ద ప్రాజెక్ట్. తమ ఇన్నర్ సర్కిల్ ద్వారా కళకు విశేష సేవలు అంది స్తున్నారు. అలాగే వీరిద్దరు చిన్న పిల్లలకు కథలు చెప్పే డ్యాన్స్ సిరీస్ను కూడా నిర్మించాలని యోచిస్తున్నారు.