Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం వేగవంతం కావడం వల్ల మనుషుల మధ్య మాటలు కరువయ్యాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతానురాగాలు అదృశ్యమై పోతున్నాయి. చెట్టు, చేమ, పశువులు, కోళ్ళు, కుక్కలు మొదలైన జీవజాలంతో సంబంధాలు తెగిపోయి, కేవలం యంద్రాలతో సహజీవనం చేస్తున్నాడు ఈనాటి మనుషులు. యంత్రాలతో సహవాసం వల్లనే తోటివారి కష్టాలకూ, బాధలకూ స్పందించలేకపోవటం అలవాటైంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో పిల్లలకూ, తల్లిదండ్రులకూ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కాస్త ఎక్కువయింది. దాని వల్ల అనేక సమస్యలు ఎదురౌతున్నాయి.
పెద్ద కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వచ్చాయి. ఈ చిన్న కుటుంబంలో కూడా నలుగురూ కలిసి ఉండటం అనేది అరుదుగా కనిపిస్తున్నది. పిల్లలున్న సమయం లో పెద్దలుండరు. పెద్దలకు సెలవున్న రోజు పిల్లలకు సెలవు ండదు. నలుగురు సభ్యు లున్న చిన్న కుటుంబంలో కూడా నలుగురూ కలిసి కూర్చోని భోజనం చేయ టం ఎన్ని రోజులకొక సారి వీలవుతున్నది. ఇలా మనుషులు సంవత్స రాల తర బడి మాట్లాడుకోకుండా యంత్రాల్లా పని చేసుకుంటూ ఉంటే మనుషుల్లో ఉండే మనసు అనేది చచ్చిపోతుంది. మనిషి కూడా ఓ రోబోగా మారిపోతాడేమో కొన్నాళ్లకు ఎక్కువగా వాడుకలోలోని అవయవం క్రమంగా అవశేషావయవంగా మారుతుందని డార్విన్ చెప్పినట్టుగా ముందు ముందు మనుషులకు మనసు అనేది అవశేషావయంగా మారుతుందేమో! భవిష్యత్తులో మనసు అనే సాఫ్ట్వేర్ను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలేమో, ఏదైనా మనకు ఫారెన్ వస్తువుల మీద మోజు ఎక్కువ కదా!
మోయలేని బాధ్యతలు
ఇంట్లో భార్యాభర్తలిరువురూ ఏదో సంపాదించెయ్యాలనే ఆరాటంలో పిల్లల్ని ఏం చేస్తున్నారో పట్టించుకోవడం లేదు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించెయ్యాలనే ఆశ ఇప్పటి తరంలో ఎక్కువగా కనిపిస్తున్నది. విలువల కోసం చూడటం లేదు. ఎలాగైనా సంపాదించి కార్లు, ఫ్లాట్లుకొనెయ్యాలి. ఇద్దరూ పిల్లల్ని వదిలేసి బయటికెళ్ళాలి కాబట్టి మనుషులను పెట్టుకోవడం లేదా పిల్లలకే తాళాలు ఇవ్వటం చేస్తున్నారు. పిల్లలు స్కూళ్ళ నుండి వచ్చి తాళాలు తీసుకొని స్నానాలు చేసి డ్రెస్సులు మార్చుకొని ఫ్రిజ్లో ఉన్నదేదో తిని హౌం వర్కులు చేసుకుంటూ కూర్చోవాలి. పిల్లలు స్కూళ్ళలో ఉన్న టెన్షన్లతో పాటు ఇంటి బాధ్యతలు కూడా మోస్తున్నారు. స్కూళ్లలోనే అధిక ఒత్తిడి అనుభవిస్తున్న పిల్లలకు ఇంటిపని కూడా అప్పజెప్పడం ఎంత వరకు న్యాయం?
అవసరాలకు అంతం లేదు
''మేం ఇంత కష్టపడి సంపాదిస్తున్నది ఎవరి కోసం! పిల్లల కోసమే కదా! ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఫెసిలిటీస్ పిల్లలకు అందించే అవకాశం ఉంది కదా! ఖరీదైన బట్టలు, ఖరీదైన తిండి కావాలంటే ఇద్దరూర కష్టపడకపోతే ఎలా! అవసరాలు ఉన్నాయి కనుకనే ఇలా కష్టపడుతున్నాం'' తల్లిదండ్రుల అభిప్రాయం ఇది. కానీ పసితనంలో అమ్మానాన్నల అప్యాయత, దగ్గరితనం ముఖ్యం కానీ ఖరీదైన వస్తువులు కాదు. పసితనంలో అమ్మ కొంగు పట్టుకుని అమ్మా! అమ్మా! అంటూ తిరుగుతారు కానీ పెద్దవారయ్యాక కాదు కదా! అమ్మ చేత్తో తినిపించే కారం అన్నమైనా అమృతంలా ఉంటుంది. పంచభక్ష్య పరమాన్నాలైనా ఒంటరిగా కూర్చుని తినాలనిపించదు. ఇకపోతే అవసరాల అంతేమున్నది. సైకిలు ఉన్నవారికి స్కూటరు అవసరంగా కనిపిస్తుంది. స్కూటలు ఉన్నవారికి కారు అవసరంగా కనిపిస్తుంది. కారు ఉన్నవారికి మరోటి అవసరంగా కనిపిస్తుంది. ఇలా ఒకటి లభించగానే మరొకటి కావాలనే కోరిక మొదలవుతుంది. ఇలా ఒకటి లభించగానే మరొకటి కావాలనే కోరిక మొదలవుతుంది. అందుకే కోరికలకు అంతులేదు. అటు పరుగెత్తి ఇటు పరిగెత్తి మనం పొందే లాభం ఎంత ఉందో పోగొట్టుకునే ఆనందం కూడా అంతే ఉంటుంది. ఇలాంటి వాటి వలనే ఇళ్లలో మానసిక ప్రశాంతత తగ్గి, ఇంతకు ముందెప్పుడూ మనం వినని డిప్రెషన్, యాంగ్జైటీ న్యూరోసిస్ వంటి వ్యాధుల పేర్లు రోటీన్గా వినిపిస్తున్నాయి.
అతిగా వద్దు
పిల్లలను ఆనందంగా అపురూపంగా పెంచేవాళ్ళ కన్నా బరువుగా భావించే వాళ్ళు ఎక్కువవుతున్నారు. కెరీర్ పట్ల దృష్టిని ఎక్కువగా పెట్టి పిల్లల్ని క్రెష్లలో వదిలేసి తల్లిదండ్రులను ఆ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు కూడా కెరీర్కు ప్రాముఖ్యమిచ్చి తల్లిదండ్రులను ఓల్డేజి హౌంలో చేర్పిస్తే వాళ్ళను నిలదీసే అధికారం మనకు ఎక్కడిది? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? మనం చూపిన బాటలోనే కదా వారు ప్రయాణిస్తారు. మనం ఏ విలువలు అయితే నేర్పుతామో పిల్లలు అవేకదా నేర్చుకుంటారు. అంటే దీని ఉద్దేశము కెరీర్ పట్ల దృష్టి పెట్టవద్దని కాదు. అసలు పెట్టకపోవడం ఎంత తప్పో అతిగా పెట్టడమూ అంతే తప్పు. ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ కాకూడదు.
ప్రశాంత వాతావరణంలో
ఉదయాన్నే లేచి తయారై టిఫిన్ క్యారేజీలు, వీపున బ్యాగులు తగిలించుకొని స్కూళ్లలోనూ చదివి, రాసి టీచర్ల ఆంక్షలన్ని తట్టుకొని మళ్ళీ బస్సులు పట్టుకొని అలసిన మొహాలతో ఇళ్ళకు చేరిన పిల్లలకు అమ్మ చిరునవ్వుతో ఎదురొచ్చి రెండు మాటలు చక్కగా మాట్లాడి మొహం కడిగి వేడి వేడిగా పాలు తాగించి టిఫిన్ తినిపించిందనుకోండి అప్పుడు ఆ పిల్లలు స్కూలులో పడిన బాధంతా మర్చిపోతారు. ప్రతిరోజూ ఒక్క గంటైనా టీవీనీ వదిలిపెట్టి తల్లిదండ్రులు పిల్లలతో సరదాగా ఆడుకోవాలి. కొంచెం సేపు ఆట తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు హౌం వర్క్ చేయిస్తూ చదివిస్తూ ఉంటే అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఇంటి వాతావరణం ఈ రోజుల్లో ఎక్కడన్నా కనిపిస్తున్నదా? ఇలాంటి వాతావరణం వల్ల తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, భార్యాభర్తల మధ్య 'కమ్యూనికేషన్ గ్యాప్' అనేది తరిగిపోతుంది. ఫలితంగా అందరి మనసులో ఏర్పడే వెలితి అసంతృప్తి, మాయమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య తగ్గిపోతున్న ఆప్యాయతానురాగాలు పెంపొందించటం కోసం మాటలు, ఆటలు అవసరం. ఇది పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళలో ఉండే మొనాటనీని కూడా దూరం చేస్తుంది. చుట్టూ మనుషులున్నా ఎవరితోనూ మాట్లాడే సమయం మిగుల్చుకోకుండా ఒంటరులుగా మిగలొద్దు.
- సృజన