Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నీ బాగుండి పరిస్థితులు కాస్త అనుకూలించకపోయినా కుంగిపోతారు కొందరు. అలాంటిది శారీరక వైకల్యం ఉన్నా నలుగురికీ స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నారు సాయి పద్మ. వైకల్యంతో ఏమి చేయలేనని, జీవితం వ్యర్ధమని అనుకుంటూ అక్కడే ఆగిపోలేదు ఆమె. మనసు దఢంగా.. ఆత్మ విశ్వాసం నిండుగా ఉంటే ఏదైనా సాధించ వచ్చు అనేది రుజువు చేస్తున్నారు. విమర్శించిన వారు, వివక్షను చూపిన వారే మెచ్చుకునేల తానేంటో నిరూపించుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో...
విజయనగరం జిల్లా గణపతి నగరం సాయి పద్మ సొంత ఊరు. తల్లి డా. బి ఆదిశేషు, తండ్రి డా. డి.ఎస్. ఆర్ మూర్తి. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి, అందరిలో పెద్దవారు సాయి పద్మ. ఈమె 45 రోజుల పసిపాపగా ఉన్నప్పుడు పోలియో బారిన పడ్డారు. తల్లి తండ్రులు దగ్గరలోని హాస్పిటల్కి తీసుకుని వెళ్లే లోపల శరీరం మొత్తం పక్షవాతం వచ్చి గొంతు కూడా దెబ్బతిన్నది. 52 సార్లు వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తుండగా ఎనిమిది నెలల అనంతరం చేతులలో కదలిక, గొంతు మాములు స్థితికి వచ్చాయి. కానీ నడుము కింది భాగం మాత్రం కదలిక లేకుండా అలాగే పక్షవాతంతో ఉండి పోయింది. పసిగుడ్డుకు ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్ను చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేక పోయేవారు. తల్లి ఎంతో మానసిక వేదనకు గురై ఐదు సంవత్సరాలు తన వైద్య వత్తిని మానేశారు.
అమ్మమ్మ ఇచ్చిన ధైర్యంతో
కొంత కాలానికి నడుము పైభాగానికి కదలికలు వచ్చాయి. అయితే లెక్కలేనన్ని ఆపరేషన్లు జరిగాక గ్రాస్ స్కోలియోసిస్ అనే 18 గంటల పెద్ద ఆపరేషన్ వెన్నెముకకు చేశారు. చివరకి బ్రేస్సెస్ సహాయంతో నడవగలిగే స్థితికి వచ్చారు. శస్త్ర చికిత్సలు జరుగుతున్న సమయాల్లో అమ్మమ్మ ఆ బాధలన్నీ తట్టుకునేలా చేయటమే కాక, మనవరాలికి తోడుగా నిలిచి ఎన్నో కబుర్లూ, కథలు వినిపిస్తూ ధైర్యాన్ని నింపేది. ఆవిడ అందించిన ధైర్యం వల్లే ఈ రోజున తన పనులు తాను చేసుకోగలిగే ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకున్నారు.
చదువుపై ఆసక్తితో
చిన్నతనం నుండి చదువు పట్ల మక్కువ ఉండటంతో చదువులో బాగా రాణిస్తూ ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.కామ్, ఎల్.ఎల్.బి, ఎంబీఏ చేశారు. చార్టెడ్ అకౌంటెన్సీలో ఇంటర్ వరకు చేశారు. పోలియో సోకినా శస్త్ర చికిత్స అనంతరం తిరిగి వచ్చిన గొంతుతో గాత్రసంగీతం అభ్యసించి డిప్లమా కూడా పొందారు. కంప్యూటర్స్లో డిప్లోమా చేశారూ. కవిత్వం అంటే ఎంతో ఇష్టపడే ఈమె తన కవితల అన్నిటినీ ఓ సంకలనంగా కూడా ఆవిష్కరించారు.
తన వంతు సేవ చేయాలని
తన వంతుగా సమాజం కొసం ఏదో చెయ్యాలి అనే తపన నిత్యం ఆమెను వేధిస్తూ ఉండేది. ఒకసారి అమెరికాలో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంది. తన సంగీతంతో అప్పటికప్పుడు విరాళంగా 20 లక్షలు సేకరించారు. ఆ మొత్తాన్ని డెహ్రాడూన్లోని పోలియో బాధితులకు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు తన వంతు సాయంగా అందించారు. 2007లో 'గ్లోబల్ ఎయిడ్' అనే సొంత సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా వికలాంగులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం ఆమె ముఖ్య ఉద్దేశం. దానితో పాటుగా చుట్టుపక్కల గ్రామలోని వికలాం గులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. 17 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ హాస్టల్ మరుసటి సంవత్సరానికి 37 మందికి పైగా పిల్లలు చేరారు. తమ సంస్థ తరఫున అమెరికా పర్యటించారు.
ఆనంద్ తో వివాహం
ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో కన్సల్టెంట్గా వచ్చిన ఆనంద్తో పరిచయం ఏర్పడింది. అతడు ఉన్నాడనే ధైర్యంతోనే ఆమె తల్లిదండ్రులు, పిన్నీ, బాబాయిలు ఆమెను అమెరికా పంపించారు. హిల్లరీ క్లింటన్ నిర్వహించిన రాజకీయ నిధి సమీకరణకు వాలాంటీర్గా ఎంపికయ్యారు. ఆ సమయంలో వారి స్నేహం మరింత దఢ పడింది. తన ఆప్తుల కోరిక మేరకు ఆనంద్తో పెండ్లి ప్రస్తావన వచ్చింది. అతడు సంతోషంగా అంగీకరించాడు. అతని తల్లి కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. వివాహం ఘనంగా జరిగింది. ఆనంద్తో ఆమె జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.
తమ సంస్థ ద్వారా...
'ఎబిలిటీ డైరెక్టరీ' అనే వికలాం గులకు సంబంధించిన ఓ సంకలనం తయారు చేస్తున్నారు. ఇందులో వారికి సబంధించిన విషయాలు, వివరాలు, వారికోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులు, విద్య, వ్యాపార సంస్థల వివరాలు ఉంటాయి. ఎంప్లాయాబిలిటీ సర్వీసెస్లో భాగంగా వికలాంగ వ్యక్తులు, అర్హత, శారీరక అందుబాటు ఆధారంగా తగిన వత్తి, ఉద్యోగాలకు సంబం ధించిన సలహా, సహాయ సహకారాలు అందిస్తారు. వికలాం గులకు కావలసింది సమాజంలో ఆదరణ, గౌరవం. అంతేకాని బతుకు భారంగా ఈడుస్తున్న మనుషులుగా కాదు. మొదట వారిని మనిషిగా చూడాలి, ఆదరించాలి, వారికి కావల సింది ప్రేమ పూర్వక మనుగడ అంటారు సాయిపద్మ. 'మనపై మనము నమ్మకం ఉంచుకుంటే విజయం మనల్ని వెతు క్కుంటూ వస్తుంది'
అని ఎంతో విశ్వాసంతో చెబుతున్నారు.
నా జీవితాశయం
అంగవైకల్యం గురించి తనకు ఎలాంటి బాధ లేదు. మన శరీరం ఎలా ఉన్నా మన దేహాన్ని మనం గౌరవించుకోవాలి. ఎంతో మంది వికలాంగులు తమ కనీస అవసరాలు తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి జీవితాలను కొంత వరకైనా మెరుగుపరచడమే నా జీవితాశయం. అలాగే హెచ్ఐవి/ఎయిడ్స్ రోగుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. అంగవైకల్యం గల వారికి, వారి వికాసం కోసం మరిన్ని సమకూ ర్చాలని అనుకుంటున్నాను. అంగ వైకల్యం గురించి అపోహలు దూరం చేయటానికి 'గ్లోబల్ ఎయిడ్' సంస్థను స్థాపించాను. ఎన్నో సంస్థలు అంగవైకల్యం ఉన్నవారికి అనుకూలంగా వాహనాలను పరికరాలను సమకూరు స్తున్నాయి. అలాంటివి వికలాంగుల అందరికీ అందు బాటులో ఉండేలా చూడడమే మా సంస్థ ఉద్దేశం.
- సాయి పద్మ
- పాలపర్తి సంధ్యారాణి