Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారనేది అక్షర సత్యం. కుటుంబ సభ్యులంతా పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే పిల్లల్లో కూడా పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచి అలవడుతుంది. పెద్దల చేతిలో ఎప్పుడూ టీవీ రిమోట్, ఫోన్, ల్యాప్ టాప్ ఉంటే అది చూసిన పిల్లలు దాన్నే ఫాలో అవుతూ అదే కాపీ కొడతారు. దీంతో పిల్లల్లో గ్యాడ్జెట్ల పట్ల ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అస్తమానం మొబైల్ ఫోన్లో ఆడుతూ, ఏదో వీడియో చూస్తూ గడపడం అలవాటుగా మారిపోయి చివరికి అదే రొటీన్ అయిపోతుంది. మరి దీనికి చెక్ పెట్టే ఉపాయమే లేదా అంటే ఉంది.. అదేంటో చదువుదాం...
పెద్దలకు సమయం లేక : ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేక పిల్లల చేతిలో ఏ ఫోనో పెట్టి, వీడియో లేదా గేమ్ ప్లే చేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత క్రమంగా పిల్లలు దాన్నే ఇష్టపడుతుంటారు. ఇదే వ్యసనంగా మారిపోతుంది. ప్రస్తుతం చిన్న కుటుంబాల వల్ల అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. ఇక పిల్లలు ఫోన్తోనే ఇరవైనాలుగు గంటలు గడిపేస్తున్నారు.
గంటకు మించితే: పిల్లల్లో స్క్రీన్ టైం విపరీతంగా పెరగడానికి కారణం వారికి ఇక వేరే లోకం లేక డిజిటల్ ప్రపంచంలో కాలం వెళ్లదీయాల్సి రావడమే. ప్రస్తుతం కరోనా ఉన్నందున బయటకు కూడా వెళ్లలేకపోతున్న పిల్లలకు టైం పాస్ అంటే గ్యాడ్జెట్సే. ఇంట్లో ఏమూలకు వెళ్లినా వైఫై వస్తుంది. ఇక ఎక్కడ చూసిన మొబైల్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్, ట్యాబ్లెట్, ఐప్యాడ్ వంటివి కనిపిస్తూ ఊరిస్తుంటాయి. వీటిని చూడగానే వారికి తాము చూడాలనుకున్న యూటూబ్ వీడియో లేదా ఆడాలనుకున్న వీడియో గేమ్ గుర్తుకు వచ్చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న సూచనల ప్రకారం ఐదు సంవత్సరాల్లోపున్న మీ చిన్నారి రోజంతా కలిపితే గంటకు మించి గ్యాడ్జెట్ స్క్రీన్ చూడడం అస్సలు మంచిది కాదు అంటున్నారు.
ఫోన్ అలవాటు ఇలా: అసలు చిన్నారులకు ఫోన్ ఎలా అలవాటు అవుతుందంటే వారు ఏడ్చినప్పుడు.. లేదా వారు అటూ ఇటూ కలియతిరుగుతూ ఉంటే ఒక చోట స్థిమితంగా కూర్చోమని పెద్దలు ఫోన్ ఇస్తారు. దీంతో వారికి ఇల్లంతా చురుగ్గా తిరిగే అలవాటు ఆదిలోనే పోతుంది. అంతే ఓ చోట అలా కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తూ గడపడం ఊహ తెలియని వయసులోనే వారికి అలవాటు అయిపోతుందని 'వాట్ పేరెంట్స్ ఆస్క్' సంస్థ పేరెంటింగ్ కన్సల్టెంట్ అండ్ ఫౌండర్ డాక్టర్ దేబ్ మిత్ర దత్తా చెబుతున్నారు.
యుక్త వయసు వారికి ప్రమాదం: ఆన్ లైన్ గేమ్స్కు అలవాటు పడిన టీనేజర్లలో ప్రాణాంతకంగా మారింది. శారీరకంగా, మానసికంగా టీనేజర్లంతా మొబైల్ పైనా ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో ఫోన్ చేతిలో లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే వారికి ఊపిరాడనంత పనవుతుంది. మహారాష్ట్రలోని ఆనందవన్ అనే ఇంటర్నెట్ డీ అడిక్షన్ సెంటర్కు ఒక్క జూన్ నెలలోనే ఏకంగా 2028 ఫోన్ కాల్స్ వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. వీటిలో 1,112 కాల్స్ తల్లిదండ్రులవి కాగా.. తమ పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం ఎలా అని అడిగారంటా. రాత్రీపగలు సోషల్ మీడియాలో నిమగమైన టీనేజర్లు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులకు ఒక దశలో తెలియడం లేదట.
ఈ ప్రపంచమే బాగుంది: సాధారణ ప్రపంచం కంటే ఇంటర్నెట్ ప్రపంచం పిల్లల కంటికి అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీనేజర్లు తరచూ తల్లిదండ్రులతో తిట్టించుకోవడాన్ని ఇష్టపడరు. పైగా తమను మరెవరితోనో పోల్చి మాట్లాడితే అసలు సహించరు. అందుకే వర్చువల్ వల్డ్లో సంతోషాన్ని వెతుక్కుంటా తమకు నిజ జీవితంలో దక్కాల్సిన లైకులను సోషల్ మీడియాలో సొంతం చేసుకుని ఆనందిస్తారు. అందుకే లైకుల కోసం ఆరాటపడేవారిలో అత్యధికులు టీనేజర్లే ఉంటారని వైద్యులు అంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఒక్క సంతానమే ఉన్న ఇంట్లో పిల్లలకు తోడు లేక వినోదం కోసం ఫోన్లపై ఆధారపడుతున్నారు.
ఇలా పరిష్కరించుకోండి: ఇండోర్ గేమ్స్ను క్రమంగా అలవాటు చేయటంపై ఫోకస్ పెట్టండి. పిల్లలతో ఆడటాన్ని పెద్దలు వ్యాపకంగా పెట్టుకోవాలి. పెద్దలు స్క్రీన్ టైంను బాగా తగ్గించుకుంటే పిల్లలు కూడా అలాగే చేస్తారు. వీలైతే కాసేపు వైఫై నియంత్రణ మీ చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆఫ్ చేస్తూ, పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చర్యలు తీసుకోండి. స్క్రీన్ డీ అడిక్షన్ సెంటర్కు వెళ్లేవరకు పరిస్థితి తెచ్చుకోకుండా మీకు మీరే స్వయం నియంత్రణా విధానాన్ని అలవాటు చేసుకుంటే అది పిల్లల్లోనూ మార్పు తెస్తుంది.