Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సృష్టించిన సంక్షోభంతో అందరి ఆలోచనా తీరు మారింది. ముఖ్యంగా ప్రాధాన్యతల క్రమం బాగా మారింది. దాంతో చాలా మంది ఆరోగ్యం, పొదుపు బాట పట్టాలని ఈ కొత్త సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నారు. ఇటీవల యుగోవ్ అనే సంస్థ చేపట్టిన తాజా సర్వేలో.. 2021లో 45 శాతం మంది ఫిట్గా ఉండటం, రోజూ వ్యాయమాం చేయటానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని తేలింది. ఈ 45 శాతం మందిలో 46 శాతం మంది పురుషులుండగా, 45 శాతం మంది మహిళలున్నారు.
మహిళల ఆలోచన మారింది: గతంలో మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవారు కదా. నిర్లక్ష్యం చేసేవారు. అయితే కరోనా కారణంగా ఆరోగ్యంపై దష్టి పెట్టడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటివాటిపై శ్రద్ధ చూపేలా మనవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 32శాతం మంది ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈమేరకు ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. 34శాతం మంది మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతతో కోవిడ్ -19 దూరంగా ఉండటాన్ని ఎంచుకుంటున్నారు. ఇక పురుషుల్లో మాత్రం 30శాతం మంది మాత్రమే వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆరోగ్య బీమాలు: హెల్తీగా, హైజినిక్గా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ 26శాతం హెల్త్ ప్లాన్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. చిన్న వయసులోనే కొత్తతరం వారు ఆరోగ్యరంగంలో పెట్టుబడులు పెట్టడం మంచి పరిణామం. ఇక కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా ఈ సమయంలో బాగా మార్పులకు గురయ్యాయి. దాదాపు అందరూ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడ్డారు. దీన్నే కొనసాగిస్తూ 34 శాతం మంది కొత్త సంవత్సరంలోనూ తమ కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం గడిపేందుకు మొగ్గుచూపుతున్నారు. 18 నుంచి 29 మధ్య వయసున్న యువతీ యువకుల్లోనూ 37 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పటం చూస్తుంటే కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతమైనట్టు కనిపిస్తోంది.
పొదుపు పట్ల అవగాహన: విచ్చలవిడిగా ఖర్చుచేసే వారు తమ ఖర్చులను అదుపు చేసుకుంటున్నారు. రానున్న కాలంలో కూడా ఇదే పొదుపు విధానాలను కొనసాగించేందుకు ఆసక్తిచూపుతున్నారు. 38శాతం మంది 2021లో అత్యధికంగా పొదుపు చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో మహిళలు, పురుషులు ఒకేలా ఆలోచిస్తుండటం విశేషం. 18-29 ఏండ్ల మధ్య ఉన్న 43శాతం మంది అత్యధికంగా పొదుపు చేయాలనుకుంటున్నారు. 40 ఏండ్లు పైబడ్డ వారిలో 32శాతం మంది పొదుపుపై అంతగా ఆసక్తి లేదు. ఈ సర్వే డేటాను 2020 డిసెంబరు 29 నుంచి 2021 జనవరి 3 మధ్య కాలంలో 1015 పట్టణాల్లో నివసిస్తున్న భారతీయుల నుంచి సేకరించారు.