Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వైఫల్యాలతో కుంగిపోకుండా తమ శక్తి సామర్థ్యాలను సమాజానికి చాటి చెబుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది ఇలవరసి జయకాంత్. ఓ దోపిడిలో సర్వం కోల్పోయిన ఈమె తన సంకల్పంతో విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. బతుకు పోరాటంలో ఆమె వేసిన ప్రతి అడుగు విజయాన్నే అందించింది. సుమారు 60 ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తూ, ఓ చిన్నపాటి వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించిన ఆమె గురించి...
తమిళనాడుకు చెందిన ఇలవరసి జయకాంత్ కుటుంబం 45 ఏండ్ల కిందట కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు వలస వెళ్లింది. తాతల కాలం నుంచి వారంతా జీవనోపాధి కోసం స్వీట్లు, స్నాక్స్ తయారుచేసి అమ్మేవారు. పెండ్లి తరువాత ఇలవరసి కూడా ఇదే వ్యాపారం చేస్తుండేది. ఇంట్లో స్వీట్లు, స్నాక్స్ తయారు చేసి స్థానిక దుకాణాలకు, తెలిసిన వారికి అమ్మేది. తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకుంది. తెలిసినవారు, బ్యాంకుల నుంచి రూ.50 లక్షల వరకు అప్పుగా తీసుకొని త్రిస్సూర్లో 2010లో ఓ సూపర్ మార్కెట్ ఓపెన్ చేసింది. వివిధ రకాల పండ్లు, దుంపలు, కూరగాయలతో హల్వా, చిప్స్, కేకులు వంటి స్నాక్స్, స్వీట్లను అమ్ముతూ మంచి లాభాలను పొందింది. ఆ మార్కెట్లో సుమారు 50 మంది పని చేసేవారు. అంతా బాగుంది అనుకునేలోపే దుకాణంలో భారీ దోపిడి జరిగింది. దీంతో సర్వస్వం కోల్పోయి వారి కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చింది. ఈ సంఘటనతో ఆమె మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడు ఇతర అనారోగ్యాలు కూడా తోడవ్వడంతో కొన్నాళ్లు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంది. మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఆమెకు ఆరు నెలలు పట్టింది.
రాత్రీ పగలు కష్టపడుతూ...
అప్పులు ఇచ్చిన వారు వెంటబడ్డారు. మరోవైపు బ్యాంకులు డబ్బు కట్టాలని ఆదేశించాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇన్ని కష్టాలనడుమ సాటిలేని మనోధైర్యంతో ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. ధైర్యాన్ని కూడగట్టుకొని, కుటుంబం సహకారంతో మళ్లీ స్వీట్లు, స్నాక్స్ వ్యాపారాన్నే మొదలు పెట్టింది. వారి వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో త్రిస్సూర్ రైల్వే స్టేషన్ వద్ద 'అవతి హాట్ చిప్స్' పేరుతో ఓ హాట్ చిప్స్ స్టాల్ తెరిచింది. తన ప్రతిభతో వ్యాపారంలో రాటుదేలింది. రాత్రి పగలూ కష్టపడుతూ స్నాక్స్ బిజినెస్ను లాభాల బాటలోకి తీసుకువచ్చింది.
ఉత్తమ పారిశ్రామికవేత్తగా...
కొన్ని నెలల్లోనే ఆ షాప్ నుంచి హాట్ చిప్స్, వడలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. క్రమంగా పాత అప్పులన్నీ తీరుస్తూ, వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టింది. కొన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా ప్రస్తుతం వారి దుకాణం భారీ లాభాల్లో నడుస్తుంది. ఇలా త్రిస్సూర్లో వివిధ ప్రదేశాల్లో మరో నాలుగు స్టాల్స్ కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇలవరసి స్వీట్లు, స్నాక్స్, కేకులు, పచ్చళ్లు సహా మొత్తం 60 ఉత్పత్తులను తయారుచేస్తోంది. ఈ విధంగా ఎంతో ధైర్యంగా పరిస్థితులతో పోరాడిన ఇలవరసి.. 2019లో ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యూఏఈ నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డును కూడా సొంతం చేసుకుంది.