Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిమా కోహ్లీ... కొన్ని రోజులుగా ఈ పేరు దేశమంతా మారు మోగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులై చరిత్ర సృష్టించడం ఓ విశేషమైతే. ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో ఈమే ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం మరో విశేషం. మొదట సివిల్ సర్వీస్లోకి వెళ్ళాలనుకుని తల్లి ప్రేరణతో ఈ రంగంలోకి వచ్చిన ఆమె గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో...
సెప్టెంబరు 2, 1959న ఢిల్లీలో జన్మించారు హిమా కోహ్లీ. అక్కడే ఆమె ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ చేసి లా చదివారు. 1984లో లా డిగ్రీ పొంది, అదే ఏడాది ఢిల్లీ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు.1999 - 2004 మధ్య ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కు న్యాయ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యురాలిగా కూడా కోహ్లీ పనిచేశారు. ఆ తర్వాత మే 29, 2006న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆగస్టు 29, 2007న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 20, 2019 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా, జూన్ 30, 2020 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తల్లి ప్రేరణతో
హిమా కోహ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే తన తల్లి ద్వారానే ప్రేరణ పొందానని ఆమె చెబుతారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత హిమా ఎల్ఎల్బి చేయాలని నిర్ణయించుకున్నారు. ''లా చేయడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో లా చేయమని నా సన్నిహితులు చెప్పారు. అప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు'' అంటారు ఆమె. చట్టపరమైన వృత్తిలో కొనసాగడానికి ఆమెను ఉత్తేజపరిచిన విషయం ఏమిటంటే.. అమెరికన్ న్యాయవాది, రచయిత అయిన ఎర్లే స్టాన్లీ గార్డనర్ రాసిన ఫిక్షన్ నవలను కోహ్లీ తల్లి ఎంతో ఇష్టంగా చదివేవారు. ఇది క్రిమినల్ కేసులు, కోర్టుకు సంబంధించిన విషయాల చుట్టూ తిరుగుతుంది. వీటి ప్రభావం కోహ్లీపై కూడా తీవ్రంగా పడింది.
ఎన్నో బాధ్యతలు...
ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆమె న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీతో కలిసి న్యాయ సహాయ సేవలను కూడా అందించారు. 29 మే 2006న ఈమె ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 29 ఆగస్టు 2007న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించే సమయంలో కోహ్లీ అనేక ముఖ్యమైన ఉత్తర్వులకు, తీర్పులకు నాంది పలికారు. అప్పటికే బెయిల్ మంజూరు చేసిన ఖైదీలను నిర్బంధించడంపై విచారణకు పిలుపునిచ్చారు, నేరానికి పాల్పడిన బాలల గుర్తింపును రక్షించడం, అంధులకు, వికలాంగులకు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునేలా అవకాశం కల్పించారు.
కరోనా సమయంలో...
2020లో కోహ్లీ ఓ న్యాయ కమిటీకి నాయకత్వం వహించార., ఇది భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రతిస్పందనను పర్యవేక్షించింది. మహమ్మారి సమయంలో ప్రైవేట్ పరీక్షా కేంద్రాలలో కరోనాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి అనుమతించే విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో ఆమె స్పందించారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ని ఆమె మందలించారు.
న్యాయ విద్యకు సేవలు
భారతదేశంలో న్యాయ విద్య అలాగే న్యాయ సహాయం అందించడంలో కూడా కోహ్లీ తన పాత్ర పోషించారు. 2017 నుండి కోల్కతాలోని పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ జనరల్ కౌన్సిల్లో పనిచేశారు. అలాగే 2020 జూన్ 30 నుండి న్యూ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీకి కౌన్సిల్లో పనిచేశారు. 20 మే 2020 నుండి ఆమె ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షురాలిగా చేశారు.
మొదటి మహిళా న్యాయమూర్తిగా
2021లో కోహ్లీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. జనవరి 7న ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విడిపోయిన తర్వాత ఐదేండ్లకు అంటే 2019లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయబడింది. దాంతో మన రాష్ట్రానికి మొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా హిమా కోహ్లీ చరిత్ర సృష్టించారు. మన దేశ చరిత్రలో ఇప్పటి వరకు 78 మంది మహిళలు న్యాయమూర్తులుగా పనిచేశారు. 1991లో దేశంలో హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీలాసేథ్ రికార్డు సృష్టించారు. ఆమె హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా చీఫ్ జస్టీస్కు హిమా కోహ్లీ రికార్డు సృష్టించారు.