Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు జన్మనివ్వడం అనేది ప్రతి మహిళ కల. ప్రెగెన్నీ దశ మహిళల జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తల్లికీ, పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు ధరిచేరవని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. గర్భాధారణ సమయంలో ప్రతిరోజూ ఉదయం కనీసం 38 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే డయాబెటిస్కు చెక్ పెట్టవచ్చని వారి అధ్యయనం స్పష్టం చేసింది. ఇలా వారానికి ఐదు రోజుల పాటు ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ప్రెగెన్సీ మహిళలు డయాబెటిస్కు దూరంగా ఉండవచ్చని అధ్యయనం పేర్కొంది.
ప్రసవ సమస్యలను తగ్గిస్తుంది: ఈ అధ్యయనానికి అమెరికాలోని టేనస్సీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమంతా ఎర్లిచ్ నాయకత్వం వహించారు. ''గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామానికి మించిన సాధనం మరొకటి లేదు. ఇది వారికి దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వ్యాయామం ప్రసవ సమస్యలను తగ్గించడమే కాకుండా భవిష్యత్లో తల్లి, బిడ్డకు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది'' అంటున్నారు ఆమె.
అధ్యయనం జరిగింది ఇలా: ఈ అధ్యయన ఫలితాలు డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. శాస్త్రవేత్తలు ప్రెగెన్సీ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ స్టడీలో భాగంగా 2,246 మంది గర్భిణీ స్త్రీల నుండి సమాచారాన్ని సేకరించారు. ఈ అధ్యయనంలో గర్భిణీ స్త్రీలు రోజూ చేస్తున్న వ్యాయామాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానంగా మొదటి త్రైమాసికంలో గర్భిణుల చేసే వ్యాయామ స్థాయిలపై ఈ అధ్యయనం కొనసాగింది.
కనీసం 38 నిమిషాలైన: రోజుకు కనీసం 38 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గర్భిణులలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ప్రతీ 100 మందిలో ఆరు నుండి 10 మంది మహిళలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ భారీన పడుతున్నారు. అందువల్ల వ్యాయామంతో ప్రతీ 100 మంది మహిళల్లో కనీసం ఇద్దరికైనా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయన రచయిత సమంతా ఎర్లిచ్ అన్నారు.