Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిగ్రీ పూర్తి చేసిన శ్వేతకు తల్లిదండ్రులు పెండ్లి చేయాలనుకున్నారు. తెలిసిన వారి ద్వారా ఓ సంబంధం వచ్చింది. అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం. పేరు కిషోర్. గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో ఈ సంబంధమే ఖాయం చేశారు. నిశ్చితార్థం అయిన నెల రోజులకు ఘనంగా పెండ్లి చేశారు. కొన్ని రోజులు వారి సంసారం బాగానే సాగింది. కొన్ని రోజులకు కిషోర్ తాగడం మొదలుపెట్టాడు. కొత్తలో శ్వేత పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకు శ్వేత నెల తప్పింది. ''నాకు అబ్బాయే పుట్టాలి, అబ్బాయే కావాలి'' అని అంటుండేవాడు కిషోర్. అయితే శ్వేతకు పాప పుట్టింది. అప్పటి నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి.
ఆడపిల్లను కన్నదని కిషోర్, శ్వేతను నానా మాటలూ అనేవాడు. రోజూ తాగొచ్చి కొట్టేవాడు. ఆ బాధలన్నీ మౌనింగా భరించేది. రెండో సారి కొడుకు పుడతాడని ఆశపడింది. అప్పుడైనా తన కష్టాలు తీరిపోతాయిని కలలు కన్నది. పుట్టింట్లో తన కష్టాలు తెలిస్తే బాధపడతారని వారికి చెప్పకుండా లోలోపలే కుమిలిపోయేది. ఆ కష్టాల మధ్యనే శ్వేత రెండోసారి నెల తప్పింది. ఈ సారి కొడుకు పుడతాడని కిషోర్ తెగ సంబర పడ్డాడు. శ్వేతకు మనసులో మాత్రం భయం. ఈ సారి కూడా ఆడపిల్లే పుడితే తన పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఒకటే దిగులు.
పోలీసులు కూడా పట్టించుకోలేదు
శ్వేతకు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. కష్టాలు రెట్టింపయ్యాయి. 'పుట్టింది ఎవరైతే ఏంటి, మంచిగా పెంచుకుందాం' అని శ్వేత ఎంత నచ్చజెప్పాలని చూసినా కిషోర్ అస్సలు వినేవాడు కాదు. తాగుడు ఇంకా పెరిగింది. విపరీతంగా కొట్టేవాడు. ఈ బాధలు భరించలేక పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. పోలీసులు కిషోర్ను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. పోలీసులు ఎంత చెప్పినా కిషోర్ తన ధోరణి మార్చుకోలేదు. చివరకు పోలీసులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ లోపు కరోనా రావడంతో ఇక ఏమీ చేయాలేకపోయింది శ్వేత.
కోపం పెంచుకుని
పోలీస్స్టేషన్లో కేసుపెట్టినప్పటి నుండి కిషోర్, శ్వేతపై మరింత కోపం పెంచుకున్నాడు. లాక్డౌన్ అన్ని రోజులు తాగుడు లేకపోవడంతో కిషోర్కు తాగడానికి మందు దొరకలేదు. దాంతో శ్వేత కాస్త ప్రశాంతంగా ఉంది. మందు షాపులు తెరిచిన రోజే కిషోర్ విపరీతంగా తాగి ఇంటికొచ్చాడు. శ్వేతను కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆ సమయంలో ఎటు పోవాలో తెలియక పిల్లలతో పాటు పోలీస్ స్టేషన్లోనే తల దాచుకుంది. తెల్లవారిన తర్వాత ట్రైన్ ఎక్కి పుట్టింటికి వచ్చి జరిగిన విషయమంతా చెప్పింది. ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆమె బంధువుల ద్వారా ఐద్వా లీగల్సెల్కు వచ్చింది.
ఎన్ని సార్లు చెప్పినా రాలేదు
లీగల్ సెల్ సభ్యులకు తన కష్టాలన్నీ చెప్పుకుంది. 'ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా? పైగా అతను బాగా చదువుకున్న వాడు. ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల పుట్టిందని చదువుకున్న వాళ్ళే ఇలా ప్రవర్తిస్తే ఇక చదువు లేని వారి పరిస్థితి ఏమిటి? ఇన్నాళ్ళు అతను మారతాడని అనుకున్నావు. ఇకపై మౌనంగా భరించాల్సిన అవసరం లేదు' అని లీగల్సెల్ సభ్యులు అతనితో మాట్లాడటానికి రమ్మని ఎన్ని సార్లు కబురు పంపినా అతను రాలేదు. దాంతో కిషోర్ వివరాలు కనుక్కోమని స్థానిక ఐద్వా నాయకులకు చెప్పారు.
పైఅధికారులు స్పందించి
లీగల్సెల్ సభ్యులు స్థానిక ఐద్వా నాయకులు అతను పని చేసే ఆఫీస్కు వెళ్ళారు. అప్పటికే కిషోర్ వారం రోజుల నుంచి సెలవులో ఉన్నాడని తెలిసింది. అయినా కూడా కిషోర్ పైఅధికారులను కలిసి అతను భార్యా, పిల్లల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చెప్పారు. శ్వేతను, పిల్లల్ని చూసి స్పందించిన అధికారులు వెంటనే కిషోర్కు ఫోన్ చేసి 'నీ భార్యా పిల్లలతో ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా? ఆడపిల్ల పుట్టిందని భార్యను కొట్టి అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటేస్తావా? నువ్వు ఇలాగే చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి సప్పెండ్ చేస్తాం. ఇకపై మంచిగా ఉండకపోతే చివరకు ఉద్యోగమే పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడైనా నీ భార్యా పిల్లల ముఖం చూసి వదిలేస్తున్నాం' అని హెచ్చరించారు.
భయం మొదలయింది
అమాయకురాలైన శ్వేత అప్పటి వరకు భర్త ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత హింసించినా మౌనంగా భరించింది. అందుకే అతని ఆటలు సాగాయి. ఎప్పుడైతే ఆమె లీగల్సెల్ వారి సహాయంతో ఆఫీస్ వరకు వెళ్ళిందో అతనిలో భయం మొదలయింది. దాంతో వెంటనే అతను శ్వేతకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటూ బతిమలాడుకున్నాడు. అయితే ఆమె మాత్రం 'ఏమైనా మాట్లాడాలనుకుంటే లీగల్సెల్ దగ్గరకు వచ్చి మాట్లాడు' అని ఫోన్ పెట్టేసింది. వెంటనే లీగల్ సెల్కు వచ్చి 'మేడమ్ నేను చేసింది తప్పే, ఇకపై అలా చేయను. నా భార్యా పిల్లలను నాతోపాటే తీసుకెళతాను. మంచిగా చూసుకుంటా' అన్నాడు.
ఎవరు పుడితే ఏంటీ?
అతని మాటలు విన్న బాధ్యులు ''ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగం పోతుందని భయపడి ఇలా మాట్లాడుతున్నావు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నీ బుద్ది కచ్చితంగా మారుతుంది. అయినా ఆడపిల్ల పుట్టిందని భార్యను హింసించడం ఏంటి. చదువుకున్న వాడివేగా... ఆడపిల్లలు పుట్టడానికి కారణం ఎవరు. మగాళ్ళు కాదా? ఆ మాత్రం తెలియదా? ఎవరు పుడితే ఏంటి. జాగ్రత్తగా పెంచుకోవాలి. తాగొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కొట్టి అర్ధరాత్రి బయటకు గెంటావు. ఆ సమయంలో వాళ్ళకు ఏమైనా అయితే పరిస్థితి ఏంటి'' అన్నారు.
బతిమాలుకున్నాడు...
'మేడమ్, ఇప్పటి వరకు నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. శ్వేతను చాలా ఇబ్బంది పెట్టాను. నా పిల్లల్ని కూడా ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. ఇకపై ఇలాంటి తప్పు చేయను. వాళ్ళను ప్రేమగా చూసుకుంటా. నా మాట నమ్మండి' అంటూ బతిమాలుకున్నాడు. 'నీతో రావాలా? వద్దా అని నిర్ణయించుకోవల్సింది నీ భార్యా. మేము కాదు. కాబట్టి నువ్వు నీ భార్యతోనే మాట్లాడుకో' అన్నారు. కిషోర్ పక్కనే ఉన్న భార్యతో 'శ్వేత... ఇకపై నీకూ పిల్లలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటా. ఇప్పటి వరకు నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. పిల్లలను తీసుకుని మన ఇంటికి వచ్చేసెరు' అన్నాడు. భర్త అంతగా బతిమలాడడంతో శ్వేత, కిషోర్తో వెళ్ళడానికి ఒప్పుకుంది.
ఇక ఎలాంటి సమస్యా రాదూ...
కిషోర్తో వెళ్ళే ముందు శ్వేత ఐద్వా వాళ్ళ సలహా తీసుకుంది. మళ్ళీ అతనితో ఏదైనా సమస్య వస్తే తమను కలవమని ఐద్వా నాయకులు ఆమెకు ధైర్యం చెప్పారు. వారిచ్చిన ధైర్యంతో శ్వేత పిల్లల్ని తీసుకుని భర్తతో వెళ్ళింది. ఆమె అక్కడకు వెళ్ళిన రోజు మామ ఇంటికి వచ్చి 'చూడమ్మా... ఇకపై మావాడి వల్ల నీకూ, పిల్లలకు ఎలాంటి సమస్య రాదు. మంచిగా చూసుకుంటాడు. నీకు ఏ కష్టం వచ్చినా మేమూ తోడుగా ఉంటాం. ఎక్కడికీ వెళ్ళి కంప్లెంట్ ఇవ్వకు' అని చెప్పి వెళ్ళిపోయాడు.
చాలా మారిపోయాడు...
రెండు వారాల తర్వాత లీగల్సెల్ సభ్యులు శ్వేతకు ఫోన్ చేస్తే 'మేడమ్ మా వారు నన్ను బాగానే చూసుకుంటున్నాడు. అంతకు ముందులా తాగడంలేదు. కొట్టడం లేదు. పిల్లల్ని కూడా ప్రేమగానే చూసుకుంటున్నాడు. మీతో మాట్లాడిన తర్వాత భయపడ్డాడు. ఇదంతా మీ వల్లనే జరిగింది. చివరకు పోలీసులు చెప్పినా వినని వ్యక్తి మీరు ఆయన ఆఫీస్కు వెళ్లి మాట్లాడిన తర్వాత చాలా మారిపోయాడు. మీరు నాకు చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేను' అని సంతోషంగా చెప్పింది.
- సలీమ