Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశంలోనే మొదటి మహిళా ఫైటర్ పైలెట్గా చరిత్ర సృష్టించింది. గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా నారీశక్తి పురస్కారాన్ని అందుకుంది. మరి ఇప్పుడు... 1950 నుండి ఇప్పటి వరకు జరిగన గణతంత్ర వేడుకల్లో ఏ మహిళకూ దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారతదేశ చరిత్రలో మొదటి సారి ఓ మహిళా ఫైటర్ గణతంత్ర వేడుకల్లో భాగం పంచుకోబోతోంది. ఆమే లెఫ్టినెంట్ భావనాకాంత్... ఈమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
భావనా... బీహార్ రాష్ట్రంలోని దర్భంగ ప్రాంతానికి చెందిన ఈమె బైబూసారేలో డిసెంబర్ 1, 1992లో పుట్టారు. ఆమె బాల్యం కూడా అక్కడే గడిచింది. తండ్రి ఐఓసీఎల్లో ఇంజనీర్గా పని చేశారు. పరౌనీలోని పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ఈమే బెంగుళూరులోని బీఎంస్ కాలేజీ నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. 2017 నవంబరులో ఫైటర్ స్క్యాడ్రన్లో చేరి మిక్ 21 బైసన్లో సోలో ప్లయింగ్ పూర్తి చేసిన తర్వాత మార్చి, 2018లో ఆపరేషన్ విభాగంలో చేరారు.
గర్వంగా ఉంది
చిన్నతనం నుండి భావనకు విమానాలంటో అమితమైన ఆసక్తి. అలాగే బ్యాట్మెంటెన్, వాలీబాల్, అడ్వంచర్ స్పోర్ట్స్ ఆడటానికి ఈమె ఎంతో ఇష్టపడతారు. ప్రస్తుతం రాజస్థాన్లోని ఎయిర్బేస్ మిగ్ - 21 బైసన్ ఫైటర్గా విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర పెరేడ్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని ఆమె తన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలోనే అరుదైన గౌరవం అందుకున్న భావనకు సోషల్ మీడియా వేదికగా ఎందరో అభినందనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ ట్వీట్ చేస్తూ ''నూతన భారతావనిలో మహిళా సాధికారతకు భావన నిజమైన అర్థంగా నిలిచింది'' అని అన్నారు.
నారీశక్తి పురస్కారం
గతంలో యుద్ధ విమానాలకు పైలెట్స్గా మహిళలకు అవకాశం లేదు. 2016లో తొలిసారి భారత వాయుసేనకు ముగ్గురు యువతులు మహిళా పైలెట్లుగా ఎంపికయ్యారు. వారే భావనా, అవని చతుర్వేది, మోహనా సింగ్ అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేత ఫైటర్ పైలట్లుగా నియమించబడ్డారు ఈ ముగ్గురు మహిళలు. మహిళా ఫైటర్ పైలట్ల మొదటి బ్యాచ్ నుండి వచ్చిన ఈమె 2019లో మిగ్ -21 బైసన్ విమానంలో డే ఆపరేషనల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. తొలి మహిళా పైలెట్లుగా ఎంపికైనందుకుగాను ఈ ముగ్గురు 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తి పురస్కారాన్ని ఐతం అందుకున్నారు.
స్ఫూర్తిగా నిలిచారు
యుద్ధ కార్యకలాపాలు నిర్వహించడంలో తొలి మహిళా పైలెట్స్గా ఎంపికయ్యేందు ఈ ముగ్గురు ఎంతో కఠిన శిక్షణను పూర్తి చేసుకున్నారు. చివరకు మిగ్ 21 బైసన్ విమానంపై ఆపరేషన్ చేపట్టడానికి అర్హత సాధించి మహిళా శక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ రోజు జరగబోయే పెరేడ్లో ఐసీఏ తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్, రోహిణి రాడర్, ఆకాష్ మిసైల్, సకోరు 30 ఎంకేయూ వంటి యుద్ధ విమానాలతో కూడిన ఐఏఎఫ్ టేబుల్ విభాగంలో భావన రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనబోతున్నారు. ఐఏఎఫ్ మార్చింగ్ విభాగంలో నలుగురు ఐఏఎఫ్ అధికారులతో పాటు 96 మంది వైమానిక యువతులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ పెరేడ్లో మొత్తం 42 విమానాలు, 4 ఆర్మీ ఏవియేషన్ ఎలికాప్టర్లు భాగం కానున్నాయి.
ఇంకా పరిమితులు ఉన్నాయి
భారతదేశంలో 2015 తర్వాత ఫ్రంట్లైన్ బాధ్యతల్లో మహిళలకు అవకాశం కల్పించారు. అప్పటి నుండి సైనిక రంగంలో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. అయితే యుద్ధనౌకలు, ట్యాంక్స్ వంటి చోట మాత్రం మహిళలకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. వాటిల్లో కూడా మార్పు రావల్సి వుంది. భావన వంటి యువతులు అటువంటి పరిమితులను బద్దలు కొట్టుకొని అడుగులు ముందుకు వేయడం అందరూ గర్వించదగిన విషయం.
సమాజం అంగీకరించదని తెలుసూ
గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తి పురస్కారాన్ని అందుకున్న భావన ఆరోజు ప్రధానితో మాట్లాడుతూ ''నేను ఒక మధ్యతరగతి చెందిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. మహిళలను ఫైటర్ పైలట్లుగా ఈ సమాజం అంగీకరించదని నాకు తెలుసు. అయితే నా దృష్టిలో ఓ మహిళ ఫైటర్ పైలట్ కావడం గొప్ప విషయం అని నేను అనుకోలేదు. ఎలాగైనా ఈ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్నాను. చివరకు సాధించాను'' అన్నారు.