Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సమస్యతో ఇప్పటికీ చాలామంది ఆఫీసులకు వెళ్లి పనిచేసే అవకాశాలు లేకుండాపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయమని ఆదేశించాయి. దీంతో ఈ సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. కానీ దీని వల్ల ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో ఇంటినుంచి పనిచేసేవారు ఒత్తిడి, ఆందోళన బారిన పడుతున్నారు. ఆఫీస్లో అయితే ఉద్యోగులంతా కలిసి ఒకేచోట పనిచేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని నెలలుగా ఇంట్లో ఉంటూ, ఒక్కరే పనిచేయడం వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
స్క్రీన్ టైమ్ సరిచూసుకోండి
ఇంటి నుంచి పని చేసేవారు అదేపనిగా ఫోన్, ల్యాప్టాప్లతో గడపాల్సిన అవసరం లేదు. ఎక్కువ సమయం స్క్రీన్ను చూస్తూ ఉంటే త్వరగా అలసిపోతారు. అందువల్ల మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో మళ్లీ ఫోన్, ల్యాప్టాప్తో టైమ్ పాస్ చేయకుండా కాసేపు మీకు నచ్చిన పుస్తకం చదవండి. మ్యూజిక్ వినడం, వాకింగ్ చేయడం.. వంటి ఇష్టమైన పనులు చేయండి.
తోటి ఉద్యోగులతో మాట్లాడండి
ఖాళీ సమయం దొరికినప్పుడు మీతో కలిసి పనిచేసిన సహోద్యోగులతో ఫోన్లో మాట్లాడండి. కాసేపు ఆఫీస్ వర్క్ను పక్కనపెట్టి.. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోండి. లంచ్ కాల్స్, వర్చువల్ కాఫీ డేట్స్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. వారితో అన్ని విషయాలూ పంచుకుంటూ పని ఒత్తిడిని దూరం చేసుకోండి. ఒంటరిగా పనిచేసేటప్పుడు ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
చిన్న బ్రేక్ తీసుకోండి
అదేపనిగా ఒకేదగ్గర కూర్చొని పనిచేయడం వల్ల బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే వర్క్ చేసేటప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచే పనులపై దృష్టి పెట్టండి. వీలుంటే ఫన్నీ వీడియోలు చూడండి. కాసేపు ఎండలో నిల్చొని రిలాక్స్ అవ్వండి. చిన్నపాటి వ్యాయామాలు ప్రయత్నించండి.
కుటుంబ సభ్యులతో కాసేపు
సాధారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నిరాశ, నిస్పృహగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎవరితో మాట్లాకుండా పనిమీదనే దృష్టి పెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రంగా అనిపిస్తుంది. అందువల్ల ఒత్తిడికి దూరంగా ఉండేందుకు మీకు ఇష్టమైన కుటుంబ సభ్యులతో కాసేపు గడపండి.
ఆహారంపై శ్రద్ధ
ఆఫీస్లో అయితే లంచ్ టైమ్లో తోటి ఉద్యోగులందరితో కలిసి భోజనం చేయవచ్చు. కానీ ఇంటినుంచి పని చేసేటప్పుడు కొన్నిసార్లు పని ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి తినడమే సాధ్యంకాదు. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వర్క్ మొదలుపెడతారు. ఇవన్నీ లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతాయి. అందువల్ల ఎంత పని ఉన్నా, ఒత్తిడి వేధిస్తున్నా సమయానికి తినేలా ప్రణాళిక వేసుకోండి. పోషకాహారం తీసుకుంటూ, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంగా ఉండండి.