Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు వారాల కిందట ఆరోగ్యం బాగోలేదని లతని పుట్టింటికి తీసుకొచ్చారు. అప్పటి నుండి ఎప్పుడు వస్తున్నావంటూ ఆమె భర్త కిషోర్ ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. పెద్దమనుషుల్లో పంచాయితి పెట్టిన తర్వాతనే అక్కడికి వెళ్ళేదని తల్లిదండ్రులు ఆమెకు కచ్చితంగా చెప్పేశారు. అమ్మనాన్నల మాట కాదనలేని లత 'మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పంపితే అప్పుడే వస్తా' అని కిషోర్తో చెప్పేసింది. దాంతో కిషోర్ తన తండ్రిని తీసుకొని ఐద్వా లీగల్సెల్కు వచ్చాడు. లీగల్సెల్ వారు లతను, ఆమె తల్లిదండ్రులను రమ్మనమని లెటర్ పంపారు.
ఆ లెటర్ చూసిన లత తండ్రి సుబ్రమణ్యంకు ఎక్కడి లేని కోపం వచ్చింది. కూతురి కష్టాన్ని చూసి తల్లి సుకన్యకు కన్నీళ్ళు ఆగలేదు. వెంటనే తన చెల్లెలు పద్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పద్మ వెంటనే అక్క ఇంటికి వచ్చి ఆ లెటర్ చదివింది. కిషోర్పై పద్మకు ఒళ్లు మండి పోయింది. కొడుక్కి కాపురం చేయడం రాదు. పెండ్లి తర్వాత భార్యతో ఎలా ఉండాలో తెలీదు. అసలు అతను కాపురానికి పనికొస్తాడో లేదో తెలీదు. పైగా మన అమ్మాయి ఆరోగ్యం గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మంచిగా ఉన్న పిల్ల పెండ్లి తర్వాతే పాడైపోయింది. పెండ్లయి ఏడాది కావొస్తుంది. ఇప్పటి వరకు ఆ అబ్బాయి పిల్లతో సంసారం చేయలేదు. ముందు ఆ అబ్బాయికి టెస్టులు చేయించాలి. అతను సరైనోడయితే అప్పుడే మన అమ్మాయిని అక్కడికి పంపుదాం' అని పద్మ అక్కకు గట్టిగా చెప్పింది.
చెల్లెలిచ్చిన ధైర్యంతో సుకన్య, సుబ్రమణ్యంలు లతను తీసుకొని లెటర్లో ఉన్న అడ్రస్ ప్రకారం ఐద్వా లీగల్ సెల్కు వెళ్ళారు. వచ్చిన దగ్గర నుండి కూతురు జీవితాన్ని తలచుకొని సుకన్య ఏడుస్తూనే ఉంది. లీగల్సెల్ సభ్యులు ఆమెను ఓదార్చి అసలు విషయం ఏమిటని అడిగాడు.
'ఏం చెప్పమంటారు మేడమ్, నా కూతురు లత. పద్దెనిమిదేండ్లకు పెండ్లి చేశాం. మంచి వాళ్లనుకున్నాం. కానీ ఇన్ని సమస్యలు వస్తాయనుకోలేదు. పెండ్లప్పటి నుండే ఒకటే గొడవలు. భోజనాల దగ్గర గొడవలే, పంపకాల దగ్గర గొడవలే. అల్లుడయితే మా ఆయన్ని నానా మాటలు అన్నాడు. వాళ్ళ నాన్న అసలు మా ఆయన ఎవరో తెలియదంటాడు. ఏమన్నా ఉంటే మాకు చెప్పరు. అన్నీ మా పిల్లకు చెప్పిపంపుతారు. పిల్లను ఇచ్చిన దగ్గర నుండి మా ఇంటికి ఎప్పుడూ రాలేదు. కనీసం అల్లుడు కూడా ఇంట్లో అడుగు పెట్టడు. మేం పిలిచినా రారు. మా వాళ్ళు ఎవరైనా భోజనానికి పిలిచినా 'మాకు వేరే వాళ్ళ ఇంటికి వచ్చే అలవాటు లేదు' అంటారు అని సుకన్య చెప్పుకుంటూ పోతుంటే...
ఇంతలో సుకన్య చెల్లి పద్మ అందుకొని 'ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఇప్పటి వరకు ఆ అబ్బాయికి పెండ్లి తర్వాత భార్యతో ఎలా ఉండాలో తెలీదు. పిల్లలను ముట్టుకోలేదంటా. మాకేం ఏం చేయాలో తెలియడం లేదు. వేరే ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు. అసలు అబ్బాయి సంసారానికే పనికి రాకపోతే ఎలా చెయ్యాలి. మా అమ్మాయి భవిష్యత్ ఏమిటి? ఆ అబ్బాయి టెస్టులు చేయించు కోమంటే చేయించుకోడు' అన్నది.
ఇద్దరూ చెప్పింది విన్న సభ్యులు లతను ఒంటరిగా కూర్చోబెట్టి మాట్లాడితే 'ఆయనకు ఏమీ తెలియదంటా, ఇప్పటి వరకు నన్ను ముట్టుకోలేదు. పైగా నేను ఇంట్లో చెబుతానంటే వద్దంటాడు. ఎప్పటికప్పుడు ఇప్పటి నుండి మనిద్దరం మంచిగా ఉందామని చెబుతాడు. మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే' అని చెప్పింది. దానికి సభ్యులు 'ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. పైగా కిషోర్ది నైట్ డ్యూటీ అంటా. నిద్ర సరిగా లేకపోవడం, పని ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చి ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర చూపించుకొని మందులు వాడితే సమస్య పరిష్కారం కావొచ్చు. మరి డాక్టర్ దగ్గరకు ఇద్దరూ వెళతారా?' అని సభ్యులు లతకు నచ్చజెప్పారు. దానికి లత ఒప్పుకుంది.
తర్వాత లీగల్సెల్ సభ్యులు కిషోర్కు ఫోన్ చేస్తే అతను వెంటనే తండ్రిని తీసుకొని వచ్చాడు. ముందు కిషోర్ను ఒంటరిగా కూర్చోబెట్టి 'నీకు ఏమైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకో. మందులు వాడితే సమస్య పరిష్కారమవుతుంది. ప్రస్తుత వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి ఫలితంగా ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. నువ్వు మందులు వాడకుండా అలాగే ఉంటే నీ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. నీ సమస్య పరిష్కరించుకోకుండా భార్య కాపురానికి రావడం లేదంటే ఎలా? అందుకే ముందు నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకో, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకో. అలాగే నీ సమస్య పరిష్కారమయ్యే వరకు నైట్ డ్యూటీలు మానుకో. అలా కుదరకపోతే వేరే ఉద్యోగం చూసుకో. అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ' అని చెప్పారు. దానికి కిషోర్ కూడా సరే అన్నాడు.
తర్వాత సభ్యులు కిషోర్ తండ్రిని పిలిచి 'చూడండి మీరు పెద్దవారు. వాళ్ళ పిల్లను మీ ఇంటికి తీసుకెళ్ళారు. కాని ఆమె తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదంటే ఎలా? అది మంచి పద్దతి కాదు. పెండ్లి సమయంలో మీ మధ్య చాలా గొడవలు జరిగాయి. మీరు వాటిని మర్చిపోకుండా ఇంకా ఇంకా సమస్యలను పెంచుకుంటున్నారు. పెద్దవాళ్ళ మధ్య సంబంధాలు బాగుంటేనే పిల్లలు సంతోషంగా ఉండగలరు. కానీ మీ మధ్య అలాంటి అనుబంధాలు లేవు. ప్రస్తుతం మీ అబ్బాయికి సమస్య ఉంది. ముందు దాన్ని పరిష్కరించుకోవాలి. మీరు అమ్మనాన్నలతో ఎలాంటి సంబంధం వద్దని, వాళ్ళ అమ్మాయి మాత్రం కావాలనుకుంటున్నారు. అలాంటప్పుడు లత మీ అబ్బాయితో ఎలా ఉండగలదు. పైగా తను చిన్నపిల్ల. కాబట్టి ముందు మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి. మీరందరు కలిసి పిల్లల సమస్య పరిష్కరించండి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు' అని సర్ధిచెప్పారు.
దానికి ఇరు వైపుల పెద్దలు ఒప్పుకున్నారు. కిషోర్ వెంటనే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని చెక్ చేయించుకున్నాడు. ఆరు నెలల్లో సమస్య పరిష్కార మవు తుందని డాక్టర్ చెప్పారు. అయితే మందులు మాత్రం రెగ్యులర్గా వాడాలని చెప్పారు. అలాగే నైట్ డ్యూటీలు మాను కోమని కూడా సలహా ఇచ్చారు. డాక్టర్ చెప్పినవన్నీ కిషోర్ జాగ్ర త్తగా పాటించాడు. ఆరు నెలల తర్వాత కిషోర్ సమస్య చిన్నచిన్నగా పరిష్కారమయింది. మళ్ళీ ఆరునెలల తర్వాత లత, కిషోర్ లీగల్సెల్కు వచ్చారు.
'లత మాట్లాడుతూ, మేడమ్ ఇప్పుడు కాస్త పర్లేదు. కిషోర్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా ఆరు నెలల్లో సమస్య పూర్తిగా తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. కిషోర్ మందులు కూడా కరెక్టుగా వాడుతున్నాడు. ఇదంతా మీ వల్లే జరిగింది. నేను ఎన్ని సార్లు చెప్పినా కిషోర్ నా మాట వినలేదు. మీరు చెబితేనే విన్నాడు. కిషోర్ మీ దగ్గరకు రావడం వల్ల నాకే మంచి జరిగింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వీలు చూసుకొని వస్తాం' అని చెప్పి భర్తతో కలిసి సంతోషంగా వెళ్ళింది.