Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతా కాలం నుంచి వసంత రుతువులోకి అడుగిడుతున్న తరుణమిది. చలి గాలులతో ఇబ్బంది పెట్టిన శీతా కాలాన్ని దూరం చేసుకొని అందమైన వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కానీ వసంత రుతువులో మన చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే మన చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అటు చలి కాలం, ఇటు ఎండా కాలం రెండు కాలాలకు మధ్య వచ్చే సమస్యలతో చర్మం ఇబ్బంది పడుతుంది. అందుకే ఈ సమయంలో చర్మ సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అందుకే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
హైడ్రేషన్పై దృష్టి పెట్టండి: ఈ కాలంలో చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మన చర్మంలో తేమ శాతం తగ్గుతూ ఉంటుంది. కనుక మన శరీర కణాలను ఎప్పటికప్పుడు తేమను నిలుపుకునేలా తయారుచేయాలి. రోజూ మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించడం, టోనింగ్ చేయడం, నీటిని ఎక్కువగా తాగడం వంటివి చేస్తుండాలి.
మాయిశ్చరైజర్ మార్చాలి: శీతాకాలంలో ఉన్నట్లు మీ ముఖ చర్మం మరీ అంతగా పొడిబారినట్టు ఉండదు గనుక మీరు వాడుతున్న ఫేస్ క్రీములనే కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో జిడ్డు ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకే తేలికైన, చర్మంలోకి సులువుగా పీల్చుకోగలిగిన వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
మృత చర్మాన్ని తొలగించాలి: స్క్రబింగ్ మరీ ఎక్కువగా చేయడం వల్ల చర్మం పాడవుతుంది. మనం వాడే ఎలాంటి ఉత్పత్తులైనా మృత చర్మాన్ని మాత్రమే తొలగించే విధంగా ఉండాలి తప్ప అధిక మోతాదులో దేన్ని వినియోగించినా దుష్పలితాలు ఎదురవుతాయని మరిచిపోకూడదు. అందుకే కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే స్క్రబ్ చేయాలి. వసంత రుతువులో చెమట పట్టడం ఎక్కువగానే ఉంటుంది. చర్మంపై దుమ్ము, మృత కణాలతో ఇది కలిసి మొటిమలు వచ్చేలా చేస్తుంది. అందుకే జిడ్డు చర్మం ఉన్నవారు తరచూ చన్నీటితో ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. అయితే ఇందు కోసం ఎలాంటి ఉత్పత్తులనూ ఉపయోగించకూడదు. రోజుకు రెండు సార్లు మాత్రమే సబ్బుతో ముఖం కడుక్కోవాలి.