Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2000లో మల్లికా దత్ స్థాపించిన 'బ్రేక్ త్రూ ఇండియా' దేశ వ్యాప్తంగా లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి నడుంబిగించింది. దీనికోసం కళలను ఆమె ఆయుధంగా ఎంచుకుంది. సంగీతం, మల్టీమీడియా, థియేటర్, పాప్ సంస్కతిని ఉపయోగించి తన ప్రయత్నాన్ని ముమ్మురం చేస్తుంది. మరెన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మాయిల్లో ప్రశ్నించే ధైర్యాన్ని నింపుతున్నా ఈ సంస్థ గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో...
మురైలాపూర్... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లాలో ఓ చిన్న మారుమూల గ్రామం. ఈ ప్రాంతంలో నివసించే యువతులు మొన్నటి వరకు అందరిలాగే సాధారణ ఆలోచనలను కలిగివున్నారు. ఇప్పుడు వారిలో ఓ కొత్త కోషం కనిపిస్తుంది. వారికి క్రికెట్ ఆడాలనే ఆసక్తి కలిగింది. తమ కోరికను నిజం చేసుకునేందుకు ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. సామాజిక పరిమితులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అమ్మాయిలు వీటన్నింటినీ ధైర్యంగా అధిగమించారు. సంచలనం సృష్టించారు.
మార్పు కోసం కృషి చేస్తున్నాం
''మొదట్లో మా తల్లిదండ్రులు మమ్మల్ని క్రికెట్ ఆడటానికి అనుమతించలేదు. ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే సంబంధించిన క్రీడ అని వారు మాకు చెప్పారు. ముందు వారిలో ఉన్న ఈ ఆలోచనను తొలగించే ప్రయత్నం చేశాం. చివరకు ఒప్పించాము. గ్రామంలోని కుర్రాళ్ళు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మాకోసం వేేుము వెళ్ళే దారిలో కాపుకాసేవారు. అయినా మేము మా ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ రోజు మేము కొత్త స్వేచ్ఛా భావాన్ని మనసారా ఆశ్వాదిస్తున్నాం. మా పెద్దవాళ్ళ ఆలోచనా ధోరణి కూడా మారిపోయింది'' అని గ్రామ క్రికెట్ జట్టు కెప్టెన్, బౌలర్ 15 ఏండ్ల సంజన చౌహాన్ వివక్షతో పోరాడిన తన అనుభవాన్ని పంచుకుంది.
సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా
లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన మహిళల హక్కుల సంస్థ బ్రేక్త్రూ ఇండియా ఆ గ్రామ అమ్మాయిల కలను నిజం చేసింది. 2000లో మల్లికా దత్ చేత స్థాపించబడిన ఈ స్వచ్చంధ సంస్థ పౌరులకు, ముఖ్యంగా మహిళలకు వారి హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడానికి డిజిటల్ మీడియా, మ్యూజిక్, స్టోరీటెల్లింగ్, థియేటర్, పాప్ కల్చర్ వంటి వివిధ మాధ్యమాలను ఉపయోగిస్తుంది. గహ హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలతో పాటు ఇతర సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా బ్రేక్త్రూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీని ఆధ్వర్యంలో లింగ అసమానతల గురించి పాఠశాల స్థాయి ప్రాజెక్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు 150కి పైగా పాఠశాలల్లోని 18,000 మంది అమ్మాయిలకు అవగాహన కల్పించారు.
ధైర్యాన్ని ఇస్తున్నాం
''మా అన్ని ప్రచారాలు, కార్యకలాపాలు మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రజలకు తెలియజేసేలా అభివద్ధి చేయబడ్డాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్లలో నివసిస్తున్న వారికి లింగ వివక్షను ప్రశ్నించే ధైర్యాన్ని బ్రేక్ త్రూ ఇవ్వగలిగింది'' అని ఆ సంస్థ జాతీయ అధ్యక్షురాలు, సీఇఓ సోహిని భట్టాచార్య చెప్పారు.
ఉద్యోగాన్ని విడిచిపెట్టి
బ్రేక్ త్రూ ఇండియా వ్యవస్థాపకురాలైనా మల్లికా దత్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వ్యవహారాలు, న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. ఆ అనుభవంతో లింగవివక్ష, హింసపై పోరాడేందుకు 2000లో 'బ్రేక్ త్రూ ఇండియా'ను స్థాపించారు. దీనికోసం ఆమె ఫోర్డ్ ఫౌండేషన్లో మానవ హక్కుల ప్రోగ్రామ్ డైరెక్టర్గా తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టారు.
నిధుల సమీకరణ కోసం...
''సంస్థ పారంభ దశలో కార్యకలాపాల ఖర్చులకు నిధులు సమకూర్చడానికి స్నేహితులు, పరిచయస్తుల నుండి డబ్బు అడిగి తీసుకున్నాం. కార్యకలాపాలు కాస్త పెరిగిన తర్వాత కార్పొరేట్లు, గ్రాంట్లు, ఐకెఇఎ ఫౌండేషన్, గూగుల్, అజీమ్ ప్రేమ్జీ ఫిలాంత్రోపిక్ ఇనిషియేటివ్స్, ఐక్యరాజ్యసమితి ట్రస్ట్ ఫండ్, సి అండ్ ఎ ఫౌండేషన్ వంటి ఇతర ఏజెన్సీల నుండి నిధులు పొందాము'' అని సోహిని చెప్పారు.
ప్రజా ఉద్యమాలకు పునాది
20వ శతాబ్దంలో మహిళల ఆకాంక్షలను ఎత్తిచూపిన భారతీయ జానపద, పాశ్చాత్య సమ్మేళనంతో 'మన్ కే మంజీరే' అనే సంగీత ఆల్బమ్ ప్రారంభించడంతో మల్లికా ప్రయత్నాలు ఫలించాయి. 2001 నేషనల్ స్క్రీన్ అవార్డును గెలుచుకున్న ఈ ఆల్బమ్కు శాంతను మొయిత్రా సంగీతం స్వరపరిచారు. శుభ ముద్గల్, అంతారా చౌదరి, మహాలక్ష్మి అయ్యర్ వంటి ప్రముఖ గాయకులు గాత్రదానం చేశారు. ఆ తర్వాత మల్లికా మళ్ళీ తిరిగి వెనక్కి చూడటం లేదు. సంస్థ కార్యకలాపాలు క్రమక్రమంగా పెరుగుతూ ప్రజల మనసులలో చెరగని ముద్ర వేశాయి. ఇది బాబుల్, బాగన్ నా జా, ఈవెంట్స్ వంటి ఆల్బమ్స్ తీసుకొచ్చి ఫిలిం ఫెస్టువల్స్లో పాల్గొని తమని తాము నిరూపించుకున్నారు. వాస్తవానికి ఈ సంస్థ 2005లో ప్రజా ఉద్యమాలకు, ప్రచారాలకు పునాది వేసిందని చెప్పుకోవచ్చు.
సురక్షిత సెక్స్ పై అవగాహన
ఈ విధంగా బ్రేక్ త్రూ తన ప్రచా కార్యక్రమాల ద్వారా సమాజ వైఖరిని మార్చడంపై దష్టి సారించింది. 'మీరు ఏ రకమైన మనిషి?' 'ఇది న్యాయమా?' అనే వినూత్న ప్రచారాలతో మగవారికి సురక్షితమైన సెక్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మగవారి పొరపాట్ల వల్ల వ్యాధుల బారిన పడిన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ ప్రచారంలో భాగంగా తెలియజేస్తున్నారు. ''ఈ రెండు ప్రయత్నాలకు ప్రేక్షకుల నుండి మాకు అద్భుతమైన స్పందన వచ్చింది. హెచ్ఐవి/ఎయిడ్స్పై ప్రజల్లో ఉన్న వివక్ష గురించి దాదాపు 32 మిలియన్ల మందికి అవగాహన కల్పించాం'' అంటున్నారు సోహిని.
బెల్ బజావో
ప్రముఖ యాడ్ ఏజెన్సీ ఓగిల్వి, మాథర్ సహకారంతో 'బెల్ బజావో' మంచి ప్రచారం పొందింది. బెల్ మోగించడం ద్వారా గహ హింసను నివారించాలనే లక్ష్యంతో ఈ పబ్లిక్ సర్విస్ అనౌన్స్మెంట్ (పీఎస్ఏ) లను ప్రారంభించాము. దీన్ని దూరదర్శన్లో కూడా ప్రసారం చేశారు. అలాగే వీడియో వ్యాన్లు, స్ట్రీట్ థియేటర్లు, ఆటల ద్వారా అట్టడుగు ప్రాంతాలకు తీసుకువెళ్లారు. దీని ఫలితంగా గృహహింసను అనుభవిస్తున్న మహిళలు బయటకు వచ్చి కేసులు పెట్టారు. అలా బయటకు వచ్చిన వారి సంఖ్య 15 శాతం పెరిగింది.
పాఠశాల స్థాయిలోనే శిక్షణ
చిన్న వయసులోనే ఆడామగా అనే ఆలోచన ప్రక్రియలు, ప్రవర్తనలు ఏర్పడతాయనే వాస్తవాన్ని పరిశీలించి బ్రేక్త్రూ 2014లో 'తారోన్ కి టోలి' అనే ప్రచార కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలలో సానుకూల విలువలు, వైఖరిని పెంపొందించడంపై ఈ కార్యక్రమం దష్టి సారించింది. రాష్ట్ర విద్యా శాఖ సహకారంతో హర్యానాలోని కొన్ని జిల్లాల్లో ఇది ప్రారంభమైనప్పటికీ ఈ కార్యక్రమం ఇప్పుడు ఇది జార్ఖంగ్, హార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో కూడా పనిచేస్తోంది. అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె-పాల్) భాగస్వామ్యంతో అమలు చేయబడిన ఈ కృషి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో లింగం, లైంగికత, చట్టపరమైన హక్కులు, కౌమార సాధికారత గురించి జ్ఞానాన్ని అందిస్తుంది.
రెండేండ్ల వ్యవధిలో...
''11 నుండి 18 సంవత్సరాల మధ్య కౌమారదశలో ఉన్నవారికి లింగ సమానత్వం, వ్యక్తుల మధ్య సంబంధాలు, చట్టపరమైన హక్కులు, హింస, వివక్షను గుర్తించడం, ఉపాధి సృష్టించడం, సమాజ బాధ్యతలు తీసుకోవడం గురించి బోధించడానికి మేము శిక్షకులను నియమిస్తాం. ఈ మొత్తం కార్యక్రమం కాలంó రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో 28 తరగతి గదులు, 12 అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. తారోన్ కి టోలి విద్యార్థుల రోజువారీ షెడ్యూల్తో అనుసంధానించబడి ఉంది'' అని సోహిని అంటున్నారు.
కలిసొచ్చేవారిని కలుపుకుంటూ
జె-పాల్ నిర్వహించిన సర్వే ప్రకారం తారోన్ కి టోలి కార్యక్రమం పాఠశాల పిల్లల్లో లింగ సమాన ప్రవర్తనను రూపొందించే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ కార్యక్రమం బాలికల్లో తమ కెరీర్ పట్ల ఆశయం, కమ్యూనిటీ లింగ వివక్షపై అవగాహన, కౌమారదశలో అవగాహన స్థాయిలు గతం కంటే 16 శాతం పెరుగుదలకు దారితీసిందని ఫలితాలు వెల్లడించాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని మరింత ఉదృతం చేయాలని నిర్ణయించుకున్నారు. దీన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు లింగ సమానత్వాన్ని కోరుకునే సంస్థలు, నాయకులు, ప్రభుత్వేతర సంస్థలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు, ఇతర వాటాదారులతో బ్రేక్త్రూ సంబంధాలు పెట్టుకుంది.
తీవ్రంగా వ్యతిరేకించారు
తమ ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని ప్రధాన అడ్డంకుల గురించి సోహిని మాట్లాడుతూ ''ప్రారంభంలో మా కార్యక్రమాలకు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే వారిలోని పితస్వామ్య భావజాలాన్ని, సాంస్కతిక నిబంధనలను మార్చడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది'' అన్నారు.
ఇక కొనసాగదు మర్చిపోండి
హింసాత్మక ప్రవర్తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి, ప్రజలర్లో అవగాహన కల్పించడానికి 'బ్రేక్త్రూ ఇండియా' 150 మంది వ్యక్తుల బందం ఉబర్తో కలిసి 'ఇక కొనసాగదు మర్చిపోండి' అనే ప్రచారాన్ని మొదలుపెట్టాలని యోచిస్తోంది. అంతే కాకుండా కౌమారదశ పిల్లలకు అవగాహన కల్పించేందుకు డిజిటల్ శిక్షణా మాడ్యూళ్ళను అభివద్ధి చేయాలని చూస్తోంది.
మార్పు తీసుకురాగలిగాము
బెల్ బజావో విజయం తర్వాత లైంగిక నిష్పత్తులు, బాధితులపై నిందలు వేయడం, బాల్య వివాహాలు, ఆన్లైన్ వేధింపులు, కార్యాలయాల్లో హింస... ఇలా రకరకాల సమస్యల చుట్టూ తమ ప్రచార కార్యక్రమాలను రూపొందించారు. మల్టీమీడియా, కళ, సంస్కతి వంటివి ప్రేక్షకులకు మేము మరింత దగ్గర కావడానికి సహాయ పడ్డాయి. వారిలో మార్పుకు ఉపయోగపడ్డాయి.
- సోహిని, సీఇఓ