Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాప్సికం అంటే చాలూ చిన్నా పెద్దా అందరికీ బోరు కొడుతుంది. అస్సలు సహించదు. దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కూరగాయలన్నీ కచ్చితంగా తినాల్సిందే. ప్రతిదాంట్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు కచ్చితంగా ఉంటాయి. క్యాప్సికంతో చాలా మంది మసాలా కర్రీ లేదా ఫ్రై మాత్రమే ఒక్కటే చేస్తుంటారు. అయితే దీంతో నోటికి రుచిగా అనిపించే పచ్చడితో పాటు రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ఈ వారం తెలుసుకుందాం...
క్యాప్సికం పచ్చడి
కావల్సిన పదార్థాలు: క్యాప్సికం - పావు కిలో, కారం - రెండు టీ స్పూన్స్, ఉప్పు - తగినంత, చింతపండు - సరిపడా, అల్లం, వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూన్, నూనె - తగినంత, జీలకర్ర - అర టీ స్పూన్, పసుపు - కొద్దిగా, జీలకర్ర పొడి - ఒక స్పూను,మెంతిపొడి - ఒక స్పూన్.
తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికం కడిగి, తుడిచి, అంగుళం ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేసు కోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర పొడి, మెంతిపొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మసాలా ఉడికి నూనె తేలగానే స్టవ్ ఆఫ్ చేసి పొడి సీసాలో భద్రపరచుకోవాలి...
కాప్సికం రైస్
కావల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యంతో అన్నం వండుకోవాలి, కాప్సికం - మూడు, నిమ్మకాయ - ఒకటి, వాంగీబాత్ పొడి - మూడు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 10 నుండి12, ఉప్పు - తగినంత, నూనె -మూడు టేబుల్ స్పూన్లు, పోపు కోసం - ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు,కరివేపాకు
తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికంని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని దానిలో పోపుకు సరిపడినంత నూనె తీసుకొని నూనె కాగాక దానిలో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాక జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించాలి. ఈ పోపులో ముందుగా తరిగి పెట్టకున్న క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి. ఇలా క్యాప్సికం ముక్కలు ఉడికిన తర్వాత చివర్లో వాంగీబాత్ పొడి వేసి దింపెయ్యాలి. దీనిలో చల్లారిన అన్నం.. కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపాలి.
పన్నీర్ కాప్సికం కర్రీ
కావలసిన పదార్థాలు: క్యాప్సికం - అరకేజి, పన్నీర్ - పావుకేజీ, యాలకులు - మూడు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, జీలకర్ర - ఒక స్పూను, కారం - రెండు స్పూన్లు, ధనియాల పొడి - ఒకటిన్నర స్పూన్లు, ఉల్లిగడ్డలు - ఐదు, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు, పసుపు - కొద్దిగా, చింతపండు - కొద్దిగా, లవంగాలు - నాలుగు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, పల్లీలు - ఒక కప్పు, కొత్తిమీర - కొంచం, పుదీనా - కొంచం, కరివేపాకు - కొద్దిగా, తెల్ల నువ్వులు - రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిగడ్డలు, క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పల్లీలు, నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిగడ్డ ముక్కలను, పన్నీర్ను విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, పల్లీలు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియాల పొడి, కారం వేసి పది నిమిషాలు ఉడికించాలి. చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
క్యాప్సికమ్ మసాలా కూర
కావలసిన పదార్థాలు: క్యాప్సికం- రెండు, ధనియాలు- ఒకటిన్నర టీస్పూన్లు, కొబ్బరి తురుము- టేబుల్ స్పూన్, ఎండుమిర్చి- ఒకటి, నువ్వులు- టీ స్పూన్, పల్లీలు - పావు కప్పు,ఉల్లిగడ్డ- ఒకటి పెద్దది, వెల్లుల్లి- రెండు రెబ్బలు, కారం- తగినంత, ఉప్పు- తగినంత, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, పసుపు- పావు టీ స్పూన్, నిమ్మరసం- అర టీస్పూన్, నీళ్లు- ముప్పావు కప్పు, గార్నిష్ కోసం కొత్తమీర, ఒక రెమ్మ కరివేపాకు సిద్ధం చేసుకోవాలి.
తయారు చేసే విధానం: ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తరువాత పల్లీలు కూడా వేసి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేయించుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేగనివ్వాలి. ఆ తరువాత క్యాప్సికం ముక్కలను వేసి, ఉప్పు వేసి వేగనివ్వాలి. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి కాసేపు ఉడకనివ్వాలి. తరువాత పసుపు, కారం వేసి ఒక నిమిషంపాటు ఉడికించి. మసాలా పొడి, నిమ్మరసం కలిపి మరో రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి. చివరగా పావు కప్పు నీళ్లు పోసి ఉడికించి.. పైన కొత్తిమీర, కరివేపాకుతో కాస్త గార్నిష్ చేసుకొని మంటమీద నుంచి దించేయాలి. అంతే చలికాలంలో వేడి వేడి క్యాపికం మసాలా కూర రెడీ...