Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీవీ, స్మార్ట్ ఫోన్ ఒకప్పుడు అవసరం... ప్రస్తుతం నిత్యావసరాలుగా మారాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా టెలివిజన్, స్మార్ట్ ఫోన్ లేనివారు కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఇక యువత, టీనేజీ పిల్లలైతే వీటికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా మొబైల్ గేమ్స్లో మునిగిపోతూ టైమ్ మర్చిపోతున్నారు. టెక్నాలజీ తెలుసుకోవడం కొంత వరకు మంచిదే అయినా అతి వినియోగం చాలా ప్రమాదకరమని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే టీనేజ్ పిల్లల విషయంలో ఇది మరింత ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఎక్కువ సేపు గడపడం, మొబైల్ గేమ్స్కి అతుక్కుపోవడం వల్ల టీనేజీ పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం 13 ఏండ్ల నుంచి 19 ఏండ్ల మధ్య గల 500 మంది టీనేజీ యువకులపై జరిగింది. 2009లో ప్రారంభమైన ఈ అధ్యయనం సుమారు 10 సంవత్సరాల పాటు కొనసాగింది. వారి పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.
ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయి: టీనేజీ బాలికలు ఎక్కువ సమయం టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, సామాజికంగా మాధ్యమాల్లో గడపడం వల్ల వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇక యుక్తవయసులోని అబ్బాయిల్లో కూడా ఇటువంటి ఆలోచనలే కనుగొన్నామని అధ్యయనం పేర్కొంది. అబ్బాయిల్లో అయితే వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడటం వల్ల వారిలో ఈ ఆలోచనలు వస్తున్నాయని తెలిపింది. అంతేకాక, ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ అతి వాడకం బాలికలకు ప్రమాదకరమని, రీడింగ్ యాప్స్ అబ్బాయిలకు ప్రమాదకరమని అధ్యయనం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, కౌమారదశలోని తమ పిల్లలను మొబైల్ వాడకానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచితే ఈ ఆత్మహత్య ఆలోచనలను నివారించవచ్చని అధ్యయనం సూచించింది. కాగా, ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ యూత్ అండ్ అడోలసెన్స్-లో ప్రచురించబడ్డాయి.
కుటుంబ సభ్యులతో గడపడం లేదు: ఈ అధ్యయనంపై బ్రిగాÛమ్ యంగ్ విశ్వవిద్యాలయ పరిధిలోని స్కూల్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ అసోసియేట్ డైరెక్టర్ సారా కోయెన్ మాట్లాడుతూ ''సాధారణంగా ఏ స్క్రీన్పై అయినా ఎక్కువ సమయం గడపడం అనేది ఆత్మహత్య ఆలోచనలకు దారితీయదు. కానీ ఈ రెండు సంఘటనలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అయితే, టీనేజీ పిల్లలు తమ ఎక్కువ సమయం టీవీ చూడటం, మొబైల్ వాడటానికి కేటాయిస్తున్నారు. తద్వారా వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఫలితంగా వారిలో ప్రతికూల ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇవి వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరగడానికి కారణమవుతాయి'' అని పేర్కొన్నారు.
వెనుకబడిపోతున్నామనే భావన: ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్లో యాక్టివ్గా ఉండకపోతే తమ తోటి వారి కంటే వెనుకబడిపోతున్నామనే భావన టీనేజీ పిల్లల్లో పెరిగిపోతుంది. ఎక్కువ సేపు ఆన్లైన్లో ఉంటేనే అంతా మనల్ని గుర్తిస్తారని టీనేజీ పిల్లలు భావిస్తున్నారు. వారు అప్లోడ్ చేసిన ఫొటోలకు, వీడియోలకు లైక్స్, కామెంట్లు రాకపోతే ఆత్మనూన్యతా భావానికి లోనవుతున్నారు. ఇవి క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అందువల్ల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను ఆన్లైన్లో ఎక్కువ సేపు గడపకుండా వారి ఆలోచనలను మళ్లించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.