Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం ధరించిన తర్వాత కొందరికి సమయం సులువుగా గడిచిపోతే మరికొందరికి మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సరిపడినంత విశ్రాంతి, చక్కటి ఆహారంతో పాటు కడుపులోని బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం వల్ల ప్రెగెన్సీ ఆరోగ్యకరంగా కొనసాగుతుంది. కొన్ని సార్లు కారణాలేవైనా.. కడుపులోని బిడ్డకు ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. దీన్ని కొన్ని ప్రమాద సంకేతాల ద్వారా సులువుగా తెలుసుకునే వీలుంటుంది. అవేంటంటే..
కండ్లు తిరగడం: సాధారణంగా ప్రెగెన్సీ మొదటి మూడు నుంచి ఐదు నెలల వరకూ చాలా మందికి కండ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు సహజంగా ఎదురవుతుంటాయి. దీనివల్ల పెద్దగా సమస్యలేమీ ఉండవు. కానీ ఆఖరి రెండు నెలల్లో మీకు కండ్లు తిరిగినట్టు అనిపించినా, కంటి చూపు మందగించినట్టుగా ఉన్నా డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా జస్టేషనల్ డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బ్లడ్ షుగర్ స్థాయుల్లో తేడాల వల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం ఏర్పడవచ్చు.
రక్తస్రావం: సాధారణంగా చాలామంది మహిళలకు ప్రెగెన్సీ మొదటి నెలల్లో కాస్త రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇది మరీ ఎక్కువగా కాకుండా చాలా కొద్దిగా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు గర్భం ధరించిన తర్వాత మీకు రక్తస్రావం అవుతూ ప్యాడ్ వాడాల్సిన పరిస్థితి ఎదురైతే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. సాధారణంగా అండం గర్భాశయంలో కాకుండా ఫాలోపియన్ ట్యూబుల్లో లేదా ఇంకెక్కడైనా పెరుగుతుంటే ఇలా రక్తస్రావం అయ్యే ప్రమాదాలు ఎక్కువ. ఇలాంటప్పుడు తల్లీ బిడ్డలిద్దరికీ ప్రమాదం ఉండవచ్చు కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.
వైట్ డిశ్చార్జ్: సాధారణంగా గర్భం ధరించిన తర్వాత వజైనల్ డిశ్చార్జ్ సాధారణంగానే కనిపిస్తుంది. కానీ నీళ్లు నీళ్లుగా ఎక్కువగా కనిపిస్తుంటే ఉమ్మ నీరు బయటకు వెళ్లిపోతోందేమో అని పరీక్షించాల్సి వస్తుంది. ఈ ఉమ్మనీరు మీ బిడ్డ చుట్టూ రక్షణ కవచంలా ఉండి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ డెలివరీ డేట్కి ముందుగా ఇలా జరిగితే అది బిడ్డకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.
కడుపు నొప్పి: సాధారణంగా పిరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం సహజ. గర్భాశయం సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా మామూలుగా అయితే ఇబ్బందేమీ లేదు. కానీ గర్భం ధరించిన తర్వాత కాస్త ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి వస్తోందంటే అది ప్రమాద సంకేతంగా గుర్తించాలి. మీరు మూడో త్రైమాసికంలో ఉంటే అవి కాన్పు నొప్పులు కూడా కావచ్చు. అందుకే గర్భం ధరించిన తర్వాత ఎప్పుడు పొత్తి కడుపులో కాస్త ఎక్కువగా నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించడం మంచిది.
కాళ్లు చేతులు వాపులు: గర్భం ధరించిన తర్వాత ఆఖరి త్రైమాసికంలో కడుపులో బిడ్డ పెరుగుదల వల్ల కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక చాలామందికి అరికాళ్లు కొద్దిగా వాపు వస్తుంటాయి. కొందరికి చేతులు, ముఖం కూడా వాస్తుంటాయి. కొద్దిగా వాపు రావడం సాధారణమే అయినా.. ఈ వాపుతో పాటు ఎరుపుదనం, ర్యాషెస్ కనిపించినా.. వాపు చాలా ఎక్కువగా ఉన్నా డాక్టర్ని సంప్రదించాలి. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం దీనికి కారణం కావచ్చు.