Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పప్పమ్మల్... వయసు 105 ఏండ్లు. తడబడని ఆమె మాటలు, వణకని ఆమె చేతులు చూస్తే ఎవ్వరూ ఆమె వయసును గుర్తించలేరు. వ్యవసాయంలో మహిళలను ప్రోత్సహిస్తూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి వ్యవసాయంలో కొత్తదనాన్ని సృష్టించారు. గొప్ప సేంద్రీయ మహిళా రైతుగా గుర్తింపుపొందారు. పద్మశ్రీ అందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె గురించి నేటి మానవిలో...
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా శివారులో ఉన్న తెక్కంపట్టి అనే గ్రామానికి చెందిన 105 ఏండ్ల పప్పమ్మల్ 1916లో జన్మించారు. ఇటీవల పద్మ అవార్డులు అందుకున్న వారిలో ఈమె కూడా ఒకరు. ఈ అవార్డు తనకు వచ్చిందని చెప్పినప్పుడు ఆమె అస్సలు నమ్మలేదని తన 50 ఏండ్ల మనవడు ఆర్.బాలు అన్నారు.
పద్మశ్రీతో సత్కారం
రైతులుకు ఓ రోల్ మోడల్గా నిలిచి వ్యవసాయంలో మహిళలను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కషికి ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సాంఘిక ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యవసాయ కార్యక్రమాలలో మహిళలను ప్రోత్సహించడం, సేంద్రీయ రైతుగా ఉండటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించడం కొత్త వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడం వంటివి ఆమెకు ఈ గుర్తింపును తీసుకొచ్చాయి.
కొత్త జీవితం
1950 నుండి పప్పమ్మల్ జీవితం మలుపు తిరిగింది. ఆమెకు పిల్లలు కలగకపోవడంతో భర్త ఆమె చెల్లెలినే రెండో వివాహం చేసుకున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె భర్త రెండో పెండ్లి తర్వాత తన అమ్మమ్మతో కలిసి తెక్కంపట్టిలో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అక్కడే ఓ టీ షాప్ ప్రారంభించింది. మెల్లమెల్లగా అదే కిరాణా దుకాణంగా మారిపోయింది. దానిపై వచ్చే ఆదాయంతో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అప్పటి నుండి పప్పమ్మల్ తన ఎదుగుదలకు బాటలు వేసుకుంది. నీలగిరి పర్వతాల
నుండి ప్రవహించే భవానీ నది ఆమె పొలానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రవహించేది. కానీ తన పొలానికి సాగునీరు అందుబాటులో లేదు. దాంతో ఈశాన్య రుతుపవనాల సమయంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు పండించేది. అలాగే వర్షాధార పంటలపై దృష్టిపెటింది. గత పదేండ్ల నుండి సాంప్రదాయ పంటలతో పాటు సూక్ష్మ సేద్యం కింద అరటి కూడా పండిస్తుంది.
మహిళలకు గుర్తింపు లేదు
అప్పట్లో వ్యవసాయంలో మహిళలకు పెద్దగా గుర్తింపులేదు. శ్రమ చేసినా విలువలేదు. ఇప్పుడు కూడా అధికారిక గణాంకాల్లో వ్యవసాయంతో పాటు ఆర్థిక వ్యవస్థలో మహిళల వాస్తవ వాటాను సరిగ్గా సూచించవు. 2013 ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారతదేశంలో 80శాతం వ్యవసాయ పనులు మహిళలే చేస్తున్నారు. కానీ కేవలం 13శాతం భూమి మాత్రమే మహిళల పేరుతో ఉంది. 60-80శాతం ఆహారాన్ని గ్రామీణ మహిళలు ఉత్పత్తి చేస్తారు. అయినప్పటికీ వారికి రైతులుగా గుర్తింపే లేదు. ఈ పితస్వామ్య సామాజంలో భర్త భూములలో భార్యకు వాటా లభించదు. భూమి తమ పేరుమీద లేని మహిళలకు బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్, కోఆపరేటివ్స్, ప్రభుత్వ పథకాలు లభించవు.
నిత్యం శ్రమించేది
పప్పమ్మల్ తన సొంత కష్టంతో భూమిని కొనుగోలు చేసింది. భర్త నుండి గానీ, కుటుంబం నుండి గానీ ఆమెకు భూమి రాలేదు. అయినప్పటికీ పప్పమ్మల్ తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి నిత్యం శ్రమించేది. మూస గ్రామీణ మహిళల జీవితాన్ని వదిలిపెట్టి వ్యవసాయంలో కొత్త పద్ధతులను అనుసరించింది. ఇప్పుడు ఆమె 7.5 ఎకరాల భూమికి యజమాని అయ్యింది. తన పెద్ద చెల్లెలి నలుగురు ఆడపిల్లలకు 7.5 ఎకరాల భూమిని ఇచ్చింది. వారిని దత్తత తీసుకొని చదివించింది. వారికి మంచి జీవితాన్ని అందించింది.
ప్రజా జీవితం
ఆమె కేవలం వ్యవసాయంలోనే కాదు రాజకీయాల్లోనూ ప్రవేశించింది. 1962లో స్థానిక ఎన్నికల్లో పంచాయతీ వార్డ్ సభ్యురాలిగా గెలిచి తర్వాత పంచాయతీ వైస్ చైర్మన్ కూడా అయ్యింది. 1983 నుండి పప్పమ్మల్ ప్రజా జీవితం మరొక పెద్ద మార్పును తీసుకుంది. ఆ మార్పే ఆమెను ఓ ప్రధాన రైతుగా మార్చడానికి దారితీసింది. ఇప్పుడు ఆమె వ్యవసాయంలో మహిళలకు ఓ రోల్మోడల్గా మారింది. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఎఆర్) లోని కషి విజ్ఞన్ కేంద్రా(కేవీకే)లో చేరింది. ఇప్పుడు అది కోయంబత్తూరులో అవినాషిలింగం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హౌమ్ సైన్స్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేవీకే పరిశోధనలో శిక్షణ, ఆన్-ఫీల్డ్ పరీక్ష, స్కేలింగ్ను సులభతరం చేస్తుంది. ఆర్ధికంగా స్థానిక రైతుల అనుకూలతను బట్టి సాంకేతిక పరిజ్ఞానం, పంట పద్ధతిని గుర్తించడంలో కూడా కేవీకే పాల్గొంటుంది.
వ్యవసాయ శాస్త్రవేత్తగా...
''సాంకేతిక వ్యవసాయంలో ఆమె ప్రాథమిక శిక్షణ పొందింది. కేవీకే స్థానిక నిర్వహణ కమిటీ(ఎల్ఎంసి)లో తక్షణ నాయకురాలిగా మారింది. స్వతహాగా ఆమెకున్న నాయకత్వ లక్షణాలతో వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలలో ఇతర మహిళలను సమీకరించడం ప్రారంభించింది. తన నైపుణ్యంతో ఎల్ఎంసీకి సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ(ఎస్ఐసి)లో పప్పమ్మల్ సభ్యురాలయ్యింది. చిన్నప్పటి నుండి ఎప్పుడూ పాఠశాలలో అడుగు పెట్టని ఆమె ఎస్ఐసీ సభ్యురాలిగా మారింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా తన సామర్థ్యాన్ని పెంచుకుంది. ఈ వ్యవసాయం గురించి నిపుణులతో నిత్యం చర్చిస్తూ వుండేది. అవినాషిలింగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హౌమ్ సైన్స్ ఫర్ ఉమెన్ విస్తరణ కేంద్రంలో కీలక సభ్యురాలిగా, కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీఎన్ఎయు)లో వివిధ కమిటీలలో సభ్యురాలిగా, అనేక ల్యాబ్-టు-ఫార్మ్ టెక్నాలజీలలో ముఖ్యమైన పాత్ర పోషించింది. తోటి మహిళా రైతులు వ్యవసాయంలో ఆధునాతన పద్ధతులు అనుసరించేలా ప్రోత్సహించింది.
మోడల్ ఫామ్
''తెక్కంపట్టిలోని ఆమె వ్యవసాయ క్షేత్రంలో హోం సైన్స్, వ్యవసాయం విద్యార్థులకు ఒక మోడల్ ఫామ్గా అవతరించింది. పరిశోధన కోసం వచ్చిన ఆ విద్యార్థులకు తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చేది. అంతేకాదు కేవీకే ఆధ్వర్యంలో ఆమె తన గ్రామంలో మహిళా రైతుల కోసం మొదటి స్వయం సహాయక బృందాన్ని కూడా నిర్వహించింది. సమిష్టి కార్యక్రమాలు ఎన్నింటికో ఆమె నాయకత్వం వహించింది. 2007లో ఆమె ఇతర రైతుల భాగస్వామ్యంతో గ్రామ ధాన్యాగార పథకాన్ని విజయవంతంగా నడిపింది. 2008లో 92 సంవత్సరాల వయసులో ఆధునిక వ్యవసాయ యంత్రాలు నిర్వహించడంలో శిక్షణ తీసుకుని ఈ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
కేంద్ర మంత్రి సందర్శించారు
మాజీ కేంద్ర మంత్రి వి.సి. శుక్లా ఎనిమిది సంవత్సరాల కిందట కోయంబత్తూరును సందర్శించాడు అతను పప్పమ్మల్ గురించి విని ఆమె పొలాన్ని సందర్శించాడు. అతను ఆమె వ్యవసాయ పద్ధతుల గురించి అడుగుతూ గంటకు పైగా గడిపాడు. ఒకసారి ఆమె పంజాబ్ 80 మంది పంజాబ్ రైతులకు తను పండించిన వస్తువులతో వండిన ఆహారాన్ని అందించింది. తను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో ఆమె వ్యవసాయంలో మహిళా రైతుల భాగస్వామ్యం గురించే గట్టిగా మాట్లాడుతుంది.
అరటి ఆకులోనే భోజనం
వద్ధాప్యంలోనూ ఆమె ఆరోగ్యం గురించి అడిగితే వేడి వేడి ఆహారాన్ని అరటి ఆకులో వడ్డిస్తేనే తింటున్నదని ఆమె మనువడు బాలు చెప్పాడు. ఐదేండ్ల కిందట ఆమె కోయంబత్తూర్లోని మహిళా రైతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఆమె తనతో పాటు అరటి ఆకులను తీసుకొని విమానంలో వెళ్ళింది. సమావేశంలో భోజన సమయంలో ఆ ఆకులనే ఉపయోగించిందని ఆయన చెప్పాడు. అరటి ఆకులో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆమె చక్కగా చెబుతుంది. పైగా ఆకు కుళ్ళిపోయినప్పుడు అది పర్యావరణానికి ఎంతగా ఉపయోగపడుతుందో అనేక సమావేశాల్లో చెబుతుంది.
మాకు వేరే మార్గం లేదు
మాకు విశ్రాంతి లేదు. చిన్నతనంలో ఆటలు ఆడటానికి సమయం కూడా లేదు. బాల్యం నుండి పని చేయాల్సి వచ్చింది. పంటలు పండించడం, విత్తడం, నీటిపారుదల, పంట కోత... ఇలా ఎప్పుడూ వ్యవసాయంతోనే గడిచిపోయేది. పెండ్లి తర్వాత బాధ్యతలు పెరిగిపోయాయి. ఇటు ఇంట్లో పనులు చేస్తూ పొలంలో కూడా పని చేయాలి. మహిళలు భరించాల్సిన జీవన విధానం ఇదే. మాకు వేరే మార్గం లేదు. మేము చాలా అరుదుగా మంచి ఆహారం తినేవాళ్ళం. పండుగ సందర్భంగా మాత్రమే బియ్యం వండేవారు.
భాగస్వామ్యం అవసరం
ఏ ప్రాంతంలోనైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రైతు సమిష్టి కేంద్రాలు ఉండాలి. దీని వల్ల రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా సమిష్టి కేంద్రాలు లేకపోతే సేంద్రీయ వ్యవసాయం విజయవంతం కావడం కష్టం. ఎందుకంటే రైతులు విడివిడిగా ఉంటే మంచి ధరను నిర్ణయించడం కష్టం. అలాగే మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకూడదు. వ్యవసాయ, సామాజిక సంస్థలలో, నిర్ణయాలలోనూ భాగస్వాములు కావాలి. అప్పుడు మాత్రమే మొత్తం సమాజానికి ప్రయోజనం ఉంటుంది.
సహజమార్గమే...
రసాయన ఆధారిత ఎరువులు, పురుగుమందులు అంటే నాకు భయం. వాటిని వ్యవసాయంలో వాడడం నాకు అస్సలు ఇష్టం లేదు. దేశంలో రసాయనాలు ఎంతగా ప్రవేశపెట్టినప్పటికీ నేను నా తండ్రి వద్ద నేర్చుకున్న సహజ మార్గాన్నే అనుసరిస్తున్నాను. దీని గురించి నేను ఏ ప్రత్యేక పాఠశాలకుగానీ, నిపుణుల వద్ద శిక్షణగానీ తీసుకోలేదు. టీఎన్ఏయు ప్రొఫెసర్లు నాకు సోదరుల మాదిరిగానే ఉన్నారు. 13 మంది వైస్ ఛాన్సలర్లతో నాకు పరిచయం ఏర్పడింది. వ్యవసాయ శిక్షణా వర్క్షాప్లకు, విశ్వవిద్యాలయంలో జరిగే వార్షిక రైతుల దినోత్సవ వేడుకలకు నన్ను కచ్చితంగా ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తుంటారు