Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హల్వా... నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీటును ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది క్యారెట్, బీట్రూట్ వంటి వాటితోనే చేస్తుంటారు. మరెన్నో పదార్థాలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. తింటానికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఎన్నో రకాల హల్వాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం...
గుమ్మడికాయ హల్వా
కావలసిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ -ఒకటి (మీడియం సైజు), చెక్కర - అరకేజీ, కోవా - కప్పు, జీడిపప్పు - అర కప్పు, నెయ్యి - రెంఉ టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - స్పూను, పాలు - రెండు కప్పులు.
తయారుచేసే విధానం: తీపి గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లెకుండా సన్నగా తురుముకోవాలి. బాణలిలో గానీ, దళసరి గిన్నెలో గానీ నెయ్యి వేసి జీడి పప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి. అందులోనే తురుము, పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి. అది చిక్క బడ్డాక చెక్కర, కోవా, యాలకుల పొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు వేయించిన జీడిప్పప్పులు కూడా వేసి దింపాలి. అంతే రుచ్చికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ..
చాకొలెట్ బాదం హల్వా
కావలసిన పదార్థాలు: పాలు - అర లీటరు, కోకో పౌడర్ - అర కప్పు, పంచదార - 250 గ్రాములు, బ్రెడ్ స్లైసులు -రెండు, జీడిపప్పు పొడి - రెండు స్పూన్లు, కిస్మిస్ - కొన్ని, నెయ్యి - రెండు స్పూన్స్, బాదంపప్పు- 50గ్రాములు.
తయారు చేసే విధానం: ముందుగా పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించి పెట్టుకోవాలి. తరువాత పాలలో బ్రెడ్ స్లైస్ లు , కోకో పౌడర్ , పంచదార, బాదాం నానపెట్టి పొట్టు తీసుకుని చేసుకున్న పేస్ట్, కొద్దిగా జీడిపప్పు పొడి వేసి కలిపి ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం గట్టిగా హల్వాలా అయిన తరువాత చివరిలో నెయ్యి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేటకి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకుని హల్వాను ప్లేట్ లో వేసుకుని ముక్కలుగా కట్ చేసి దానిపై కిస్మిస్, జీడిపప్పు,బాదాం పలుకులు వేసి డెకరేట్ చేసుకోవాలి.
టమాట హల్వా
కావలసినవి పదార్ధాలు: ఎర్రని టమాటాలు - ఆరు, నెయ్యి - అరకప్పు, పంచదార - కప్పు, రవ్వ - అర కప్పు, బాదం, జీడిపప్పులు - అర కప్పు,
యాలకులు పొడి - టీ స్పూన్.
తయారుచేసే విధానం: ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి వాటిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న నీటిని వంపి మిక్సిలో గుజ్జుగా చేసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి అది కాగాక జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేపి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా వేపి, దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి వుడకనివ్వాలి. రవ్వకాస్త గట్టిపడగానే టమాట గుజ్జు, పంచదార వేసి కలపాలి, బాగా చిక్కబడిన తర్వాత యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి ముద్దగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి. ప్లేటుకి నెయ్యిరాసి ఈ మిశ్రమం వేసి సమంగా చేసి ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే టమాట హల్వ రెడీ.
ద్రాక్ష హల్వా
కావలసిన పదార్ధాలు: నల్లద్రాక్షలు - వంద గ్రాములు, మైదా - పావుకేజీ, పంచదార - పావుకేజీ, జీడిపప్పుల ముక్కలు - టేబుల్ స్పూన్, బాదం పప్పుల ముక్కలు -టేబుల్ స్పూన్.
తయారుచేసే విధానం: ముందుగా మైదాపిండిలో కొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా కలపాలి. కలిపిన ముద్దలో మూడు కప్పుల నీళ్ళు పోసి పూర్తిగా నీళ్ళలో కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టాలి (మైదా పాలుగా అవ్వటానికి). అరగంట తర్వాత కలిపిన మైదాలో నీళ్ళు పైకి తేరుకుంటాయి. తేరుకున్న నీరు తీసేస్తే అడుగున మైదా పాలు వుంటాయి. ద్రాక్షలో గింజలు తీసి మిక్సిలో వేసి జ్యూస్లా చేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాండి పెట్టి పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక మైదా పాలు, ద్రాక్ష జ్యూసు వేసి కలపాలి. మాడిపోకుండా కలుపుతుండాలి. ఇది గట్టిపడి ముద్దలా అవుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. మైదాపాలు, ద్రాక్ష రసం, పంచదార, నెయ్యి బాగా కలిసి ముద్దలా అయ్యి బాండి అంచులు విడుతుంది. అంటే హల్వా తయానే అయినట్టే. ఒక ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి హల్వాను వేసి సమంగా సర్ది జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు అద్దుకుంటే ద్రాక్ష హల్వా రెడి. చల్లారక ముక్కలుగా కట్ చెయ్యాలి.
ఫ్రూట్ హల్వా
కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు - పావుకప్పు, యాపిల్ ముక్కలు - అరకప్పు, అరటిపండు ముక్కలు - పావుకప్పు, మామిడిపండు ముక్కలు - పావుకప్పు, బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పు, నీళ్లు - మూడున్నర కప్పులు, చక్కెర - పావుకప్పు, నెయ్యి - నాలుగు చెంచాలు, యాలకుల పొడి - అరచెంచా, జీడిపప్పు, కిస్ మిస్ - గుప్పెడు.
తయారు చేసే విధానం: స్టౌమీద కడాయి పెట్టి చెంచాడు నెయ్యి వేయాలి. వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వను కూడా వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించి తీసేయాలి. తర్వాత మరో చెంచా నెయ్యి వేసి పండ్ల ముక్కలన్నిటినీ వేసి దోరగా వేయించాలి. వీటిని చల్లారబెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టౌమీద గిన్నె పెట్టి నీళ్లు, చక్కెర వేయాలి. మరుగుతున్నప్పుడు రవ్వ పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. రవ్వ మెత్తబడిన తర్వాత పండ్ల గుజ్జును కూడా వేయాలి. ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయి దగ్గరగా అయ్యాక మిగతా నెయ్యి, జీడిపప్పు, కిస్ మిస్ వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి చల్లి దించేసుకోవాలి. కావాలంటే కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.