Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చిందంటే ఎవరికైనా మామిడి కాయలు, తాటిముంజలు గుర్తుకొస్తాయి. అలాగే వడియాలు, పచ్చళ్లు పెట్టుకునే సీజన్ కూడా ఇదే. అయితే చాలా మందికి వడియాలంటే బియ్యంతోనో, సగ్గుబియ్యంతోనో, మినప్పప్పుతోనే చేసిన వడియాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. వీటితోనే కాకుండా ఇంకా ఎన్నో రకాల వడియాలు చేసుకోవచ్చు. అలాంటి కొన్ని కొత్తరకం వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం...
టమాటాలతో
కావల్సిన పదార్థాలు: టమాటాలు - 200 గ్రాములు, సగ్గుబియ్యం - పావు కేజీ, నీరు - ఆరు కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - టీ స్పూను.
తయారు చేసే విధానం: టమాటాలను నీటిలో పావుగంట ఉడికించాలి. చల్లబడ్డాక తొక్క తీసి, మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచాలి. సగ్గుబియ్యాన్ని పదిహేను నిమిషాలు నానబెట్టి నీరు వడకట్టాలి. నానిన సగ్గుబియ్యానికి ఆరు కప్పుల నీరు జతచేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు, కారం, టమాటా గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్పై గుండ్రంగా పల్చగా వేసి బాగా ఎండనిచ్చి డబ్బాల్లో నిలువ చేసుకోవాలి.
పేలాలతో
కావల్సిన పదార్థాలు: జొన్నలు - కప్పు, కారం - టీ స్పూను, వాము - టీ స్పూను, వేయించిన నువ్వులు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారు చేసే విధానం: జొన్నల్ని ఎనిమిది గంటలపాటు నానబెట్టి నీరంతా వడకట్టి కొద్దిసేపు ఆరబెట్టాలి. వీటిని కడాయిలో వేసి (మూత పెట్టి) సన్నని సెగమీద ఉంచితే పేలాలవుతాయి. తర్వాత ఒక పాత్రలో పేలాలు, కారం, వాము, నువ్వులు, ఉప్పు వేసి (కొద్దిగా) నీరు చిలకరిస్తూ కలపాలి. పేలాలు మెత్తబడ్డాక ఈ మిశ్రమాన్ని పిడికిట్లోకి ముద్దలా తీసుకుని పల్చగా వత్తి ఎండ బెట్టుకోవాలి. ఈ వడియాలు వాము, నువ్వులు పంటికి తగిలి ఎంతో రుచిగా ఉంటాయి.
ఎండు మిర్చితో
కావల్సిన పదార్థాలు: మినప్పప్పు - కప్పు, ఎండుమిర్చి - ఐదు, మిరియాలు - పావు టీ స్పూను, శనగపప్పు - కప్పు, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: ఒక పాత్రలో మినప్పప్పు, గింజలు తీసిన ఎండుమిర్చి, మిరియాలు, శనగపప్పు, వెల్లుల్లి వేసి, సరిపడా వేడి నీటిని చేర్చి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి సరిపడా ఉప్పుని కలపాలి. ఈ మిశ్రమాన్ని పల్చని పొడిబట్టపై వడియాల్లా పెట్టుకుని బాగా ఎండబెట్టుకోవాలి. మిగతా వడియాల్లా కాకుండా ఈ వడియాల రుచి కాస్త ఘాటుగా భిన్నంగా ఉంటుంది.
బూడిద గుమ్మడితో
కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ - ఒకటి, మినప్పప్పు - కాయకు సరిపడా, పచ్చిమిర్చి - వంద గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: బూడిద గుమ్మడికాయను తురుముగా తరిగి ఒక శుభ్రమైన పలుచటి బట్ట తీసుకుని ఈ తురుమును ఆ బట్టలో ఉంచి మూటకట్టి ఈ మూటపై ఏదైనా బరువు ఉంచాలి. రాత్రంతా ఇలా ఉంచిన తర్వాత ఈ గుడ్డలో నుండి ఉదయానికి నీరంతా దిగిపోతుంది. ఆ తర్వాత మినపప్పును మెత్తగా రుబ్బుకుని ఈ పిండిలో గుమ్మడికాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి ప్లాస్టిక్ పేపర్పై గానీ గుడ్డపైన గానీ కొంచెం పెద్దసైజులో వడియాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాలను ఎండలో మూడు నాలుగు రోజులు ఎండబెట్టి పొడి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. చారు చేసుకున్నప్పుడు నంజుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి.
ఉప్మారవ్వతో...
కావల్సిన పదార్థాలు: ఉప్మారవ్వ - పావు కిలో, ఉప్పు - తగినంత, నువ్వులు - చెంచా, వాము - చెంచా.
తయారు చేసే విధానం: ముందుగా ఉప్మారవ్వను ఒక గ్లాసుతో కొలచి పెట్టుకోవాలి. ఒక గ్లాసు ఉప్మాకు ఎనిమిది గ్గాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లను ఒక గిన్నెలో తీసుకొని బాగా మసిలే దాకా వేడి చేసి, దాంట్లో తగినంత ఉప్పు, నువ్వులు, వాము వేసి తర్వాత ఉప్మా రవ్వను వేస్తూ ముద్దలు అవకుండా కలుపుతూ ఉండాలి. అలా ఐదు నిమిషాల తర్వాత వేరొక గిన్నెలో దాన్ని తీసుకొని ఎండగా ఉన్న స్థలంలో ఆ పిండిని గరిటెతో తీసుకొని కవర్పై సన్నగా, గుండ్రంగా ఒక్కొక్కటిగా వేయాలి. అలా ఒక రోజు ఎండలో ఉంచాక కవర్పై నుండి తీస్తే సరి. వేయించడానికి సిద్ధంగా ఉన్న వడియారు రెడీ...
కొన్ని టిప్స్
- వడియాలకు ఉపయోగించే గుమ్మడి కాయ ముదురుగా ఉంటే మంచిది. బూడిద గుమ్మడికాయ తరిగినప్పుడు గింజలు తీసేయండి. పక్షులు కానీ ఉడతలు కానీ ఈ గింజల కోసం వచ్చి వడియాలు పాడు చేస్తాయి. ముక్కలను ఒక పలుచని నూలు వస్త్రంలో వేసి బాగా మూట గట్టి, చిల్లుల బుట్టలో పెట్టి పైన పళ్లెం పెట్టి దాని మీద బరువు పెట్టాలి. గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ, పిండి తక్కువ ఉంటే వడియాలు బాగా గుల్లగా వస్తాయి.
- క్యాబేజీ, ఉల్లిగడ్డ, క్యారట్, బీట్రూట్, ఆలు తో కూడా బూడిద గుమ్మడి కాయ మాదిరిగానే వడియాలు పెట్టుకోవచ్చు. పొట్టు మినప్పప్పు వాడితే రుచి, ఆరోగ్యం కూడా. పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు.
- పప్పు ఎక్కువగా నానబెట్టుకుంటేనే మంచిది. ఎక్కువైతే మిగిలిన పిండితో గారెలు వేసుకోవచ్చు. తక్కువైతే మాత్రం కష్టం.
- సువాసన కలిగిన ఇంగువ వాడితే బాగుంటుంది.
- పప్పును ముందు రోజు నానబెట్టుకుంటే వడియాలు గుల్లగా వస్తాయి.
- పప్పును మెత్తగా రుబ్బాలి. పిండి పలుచగా ఉంటే వడియాలు పెట్టడానికి సరిగా రావు.
రెండు రోజులు బాగా ఎర్రటి ఎండలో వడియాలు బాగా ఎండిన తర్వాత నెమ్మదిగా వస్త్రం నుండి వేరుచేయాలి.
- వడియాలు ఎండితే వస్త్రం దగ్గరకు ముడుచుకుంటుంది. అందువల్ల వడియాలు ఉన్న వస్త్రాన్ని తిరగేసి కొద్దిగా నీళ్లు చల్లి తడిపి క్లాత్ను ఆ చివర, ఈ చివర పట్టి మెల్లగా లాగితే వడియాలు సులువుగా వస్తాయి.
- బియ్యాన్ని నానబోసి, దంచి లేదా మిక్సీలో వేసి తయారు చేసిన పిండితో వడియాలు పెడితే వడియాలు రుచిగా ఉంటాయి. మిల్లులో ఆడించిన బియ్యప్పిండితో వడియాలు అంత బాగా రావు.
- వడియాలు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే నిల్వ చేసే డబ్బాలో కాసిన్ని మెంతిగింజలు వేసి ఉంచితే సరి.