Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలు సంతోషంగా పండగలు చేసుకోవాలంటే ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించాలి.. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ పండగ అయినా నిండుగా ఉంటుంది అంటున్నారు మాజీ మంత్రులు, కాంగ్రెస్ మహిళా ప్రజా ప్రతినిధులు డాక్టర్ జె.గీతారెడ్డి, డి.కె. అరుణ. బతుకమ్మ పండుగపై వారి మనోభావాలు మానవి పాఠకుల కోసం..
ఆశాలంతా మహిళలే..
ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో బతుకమ్మ అనేది ఒక ఆచారంగా వస్తున్న పండుగ. సంతోషంగా అందరూ చేసుకునేవే పండుగలు. కులమతభేధాలు లేకుండా ఐక్యంగా చేసుకునే పండుగ ప్రాముఖ్యత మొదటి నుంచే ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో ఆడుతున్న పండుగ ఇది. ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన మన వాళ్ళద్వారా అక్కడ కూడా ఆడుతున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా చేసుకునే బోనాలు, బతుకమ్మ పండగ మహిళలు అత్యధికంగా పాల్గొనే ఉత్సవాలు.
రాష్ట్ర ప్రజల్లో నిరాశ, నైరాశ్యం ఉంది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాల కోసం కోట్లాది రూపాయలను విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కుటుంబాలు, శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వమని ఆశావర్కర్స్ కోరుతున్నారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదు. పల్లెలో పండుగ కనిపించడం లేదు. ఒక రైతు చనిపోయినా.. ఆ ఊర్లో అంతా విషాదమే. రైతుల సమస్యలు, మహిళల సమస్యలను పరిష్కరిస్తేనే పండుగలకు సార్ధకత. రోజుకు పదిమంది వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పల్లెల్లో పండుగలు సంతోషంగా జరుపుకోవాలంటే ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవాలి. బతుకమ్మ ఆడే మహిళ జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రభుత్వం చేసినా చేయకపోయానా.. పండుగలు జరుగుతాయి. కానీ, ప్రజాసమస్యలు మాత్రం ప్రభుత్వమే పరిష్కరించాలి.
అసెంబ్లీలోనూ రైతాంగ సమస్యలపై, ఆశా వర్కర్ల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభనుంచి మూకుమ్మడిగా బయటకు పంపించి ఏకపక్షంగా సభను నిర్వహించారు. ఇది ప్రజాస్వామ్యానికి విదుర్ధం. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆశాలంతా మహిళలే. వారిపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సమస్యలు లేని సమాజంలో పండగలు ఎవరూ నిర్వహించవల్సిన అవసరం లేదు.. ప్రజలే సంతోషంగా చేసుకుంటారు.
తెలంగాణను విత్తన భాండాగారం చేస్తామని అంటున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే రైతుల సమస్యలు కొంతైన తీరుతాయి. ప్రజలంతా సంతోషంగా ఉంటేనే ఏ పండగైనా నిండుగ ఉంటుంది.
అన్నదాతను ఆదుకోవాలి..
ప్రజల మధ్య ఐక్యతకు చిహ్నంగా, సమాజంలో ఆనందం పెంచే ఉత్సవంగా ఎన్నో పండగలను చేసుకుంటాం. అలాంటి పండగ కోవలోనే వస్తుంది బతుకమ్మ. ఈ పండగ ప్రజల మధ్యలో నుంచి పుట్టింది. ఆడపిల్లలు తమ కష్టసుఖాలను చెప్పుకునేందుకు ఆడుకునే ఈ ఆట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర పండగగా గుర్తింపు రావడం సంతోషమే. పల్లెపల్లెంతా పూలజాతరగా మారిన ఈ వేళ.. రైతుల ఇంట మాత్రం కన్నీరే మిగిలింది. వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య పెరగడంతో చాలా పల్లెలు బతుకునిచ్చే బతుకమ్మ వేడుకలకు దూరమయ్యాయి.
బతుకమ్మ పండుగ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ప్రజలు వారివారి ఆచారాల ప్రకారం బతుకమ్మను ఆడతారు. ఇది ఒకరు ఆడమంటే ఆడేది కాదు.. వద్దంటే ఆగేది కాదు. బతికించమని కోరుకోవడమే ఈ పండగ అర్థం. అరాచకాల నుంచి కాపాడమని కోరుతూ ఆనాడు ఆడవాళ్లు బతుకమ్మ ఆడారు. ఇలా ప్రజల జీవితాలలో నుంచి వచ్చిన ఉత్సవం ఇది. ఇప్పుడు తమ సమస్యలు పరిష్కరించమని ఆశావర్కర్స్ బతుకమ్మ ఆడుతున్నారు.
పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా అంతా బతుకమ్మ సంబురాలల్లో మునిగితేలుతున్నాయి. కానీ, కొన్ని చోట్ల మాత్రం పల్లెలన్నీ విషాదంలో మునిగిఉన్నాయి. అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటే ఆ ఊరంతా మౌనంగా బతికించవమ్మ బతుకమ్మ అంటూ వేడుకుంటున్నాయి. ఇంటింటికి తిరిగి ఆరోగ్యసూత్రాలు చెప్పే ఆశవర్కర్స్ తమ కష్టాన్ని గుర్తించమని బతుకమ్మ ఆడి మరి ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ఇప్పుడు రైతులను బతికించమని మేం కోరుతున్నాం.
బతుకమ్మ వేడుకలు పబ్లిసిటీ స్టంట్గా మారాయి తప్ప ప్రజలు స్వచ్ఛందంగా చేసుకునే వేడుకలుగా లేవు. కారణం.. ప్రజలు సమస్యల మధ్యన ఉన్నారు. రాష్ట్రంలో మహిళకు ప్రాధాన్యత ఇవ్వకుండా పండగలు చేస్తే సరిపోతుందా? క్యాబినెట్లో ప్రాధాన్యత లేదు. సమస్యలు చెప్పుకోవడానికి మహిళా కమిషన్ లేదు. అత్యాచారాలు, అఘాయిత్యాలకు అంతు లేదు. ఇలాంటి పరిస్థితిలో బతికించమని బతుకమ్మను వేడుకోవడానికి కూడా మహిళలు సిద్ధంగా లేరు. చాలా పల్లెల్లో విషాదఛాయలు నిండుకున్నాయి. రైతులను, మహిళలను బతికించమని ఈ సందర్భంగా మేం కోరుతున్నాం.
-వి. యశోద